Author: Himansh

  • కారు పెయింట్ కోసం రూ. కోటి!.. ఇది కదా అంబానీ అంటే

    కారు పెయింట్ కోసం రూ. కోటి!.. ఇది కదా అంబానీ అంటే

    Ambani Rolls Royce Cullinan Gets Paint Job Worth Rs One Crore: భారతీయ కుబేరుడు, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన ముకేశ్ అంబానీ గురించి, వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పారిశ్రామిక వేత్తల్లో అగ్రగామిగా ఉన్న వీరి జీవన విధానం కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో భాగంగానే వీరు రోజువారీ ప్రయాణానికి కూడా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరు తమ కారు పెయింటింగ్ కోసమే కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్: పెయింట్‌కే కోటి రూపాయలు!

    జీవితంలో ఒక్కరోజైనా రోల్స్ రాయిస్ కారులో తిరగాలని చాలామంది కలలు కంటారు. అయితే అంబానీ ఫ్యామీలీ మాత్రం ఏకంగా 10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉంది. ఇందులో ఒక రోల్స్ రాయిస్ కల్లినన్ పెయింట్ కోసం మాత్రమే రూ.1 కోటి ఖర్చు చేశారు.

    జియో గ్యారేజిలోని అనేక ఖరీదైన అన్యదేశ్య కార్లలో.. రోల్స్ రాయిస్ కల్లినన్ చాలా ప్రత్యేకం. ఈ కారుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు ధర రూ. 13.14 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. ఇది బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ కాదు, సాధారణ వెర్షన్ మాత్రమే. దీని ప్రారంభ ధర రూ. 6.95 కోట్లు (ఎక్స్ షోరూమ్) మాత్రమే అయినప్పటికీ, దీని పెయింట్ కోసం రూ.1 కోటి.. ఇతరత్రా కస్టమైజేషన్ కోసం కూడా భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    కస్టమైజేషన్ తో పెరిగిన కల్లినన్ ధర

    రోల్స్ రాయిస్ ధరలు ఎక్కువే అయినప్పటికీ.. కస్టమైజేషన్ కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కస్టమైజేషన్ కోసం పెట్టే ఖర్చు వల్లనే.. ఈ బ్రాండ్ ధరలు భారీగా ఉంటాయి. అంబానీ ఫ్యామిలీ.. కల్లినన్ కారును తమ అభిరుచికి తగిన విధంగా మార్చుకోవడానికి రూ. 13 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేశారు. ఇది ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందింది. ఇవి కాకుండా.. ఈ కారులో ఏ పరికరాలను కస్టమైజ్ చేసారో వెల్లడికాలేదు.

    నెంబర్ ప్లేట్ కోసమే రూ. 12 లక్షలు

    అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్ కారుకు ప్రత్యేక పెయింట్ స్కీమ్ మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్ నెంబర్ 0001 కోసం రూ. 12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారును వారు ఎంత ప్రత్యేకంగా రూపొందించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

    అంబానీ గ్యారేజీలోని ఇతర ఖరీదైన కార్లు

    రిలయన్స్ అధినేత అంబానీ గ్యారేజిలో కేవలం రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. కాంతిని బట్టి రంగులు మార్చే ‘బెంట్లీ బెంటాయెగా’ (రూ.4 కోట్లు) కూడా ఉంది. ఇది కాకుండా.. మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని, బిఎండబ్ల్యూ మరియు ఆస్టన్ మార్టిన్ వంటి సుమారు 170 కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ కార్ల మొత్తం ధర రూ. వంద కోట్లు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

  • సీఎం కీలక నిర్ణయం: ప్రభుత్వ పాఠశాలల్లోనే..

    సీఎం కీలక నిర్ణయం: ప్రభుత్వ పాఠశాలల్లోనే..

    Telangana Government Schools Pre-Primary: తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగింది. విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించాలని తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

    ప్రీ ప్రైమరీ విద్యపై ప్రభుత్వ దృష్టి

    2025-26 విద్యాసంవత్సరం నుండి ఈ ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమికంగా, సామర్గ్ర శిక్ష పథకం కింద 210 పాఠశాలల్లో ఈ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, విద్య నాణ్యతను పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    సామాన్యులకు ఊరట: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం తగ్గింపు

    ఇంతకుముందు, తల్లిదండ్రులు తమ పిల్లలను నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సి వచ్చేది. దీనికోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి రావడం సాధారణ ప్రజలకు ఆర్థికంగా భారంగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, సామాన్యులపై ఈ భారాన్ని తగ్గించేందుకు ఈ కీలకమైన అడుగు వేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ప్రశంసనీయమైన చర్య అని అభిప్రాయపడుతున్నారు.

    అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణం: చిన్నారులకు ప్రత్యేక ఆతిథ్యం

    మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు కూడా వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, మరియు హెల్పర్లు సాదరంగా స్వాగతం పలికారు.

    తొలిసారిగా చిన్నారులకు ఎగ్ బిర్యానీ

    ఆశ్చర్యకరంగా, మొదటి రోజు చిన్నారులకు ఎగ్ బిర్యానీ వడ్డించారు. బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ పెట్టడం ఇదే తొలిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి సీతక్క కూడా పాల్గొన్నారు.

    చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం

    సమతుల ఆహారంతోనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారనే దృఢమైన నమ్మకంతో, తెలంగాణ ప్రభుత్వం వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి కట్టుబడి ఉంది. ప్రతి రోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించడంతో పాటు, వీలున్నప్పుడల్లా వినూత్నమైన, రుచికరమైన వంటకాలను అందించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

    రాష్ట్ర అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం: ప్రభుత్వ ద్విముఖ వ్యూహం

    తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతూనే, మరోవైపు విద్యార్థుల వికాసం మరియు భవిష్యత్ ఎదుగుదలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలతో ముందుకు సాగితే, ప్రజల నమ్మకాన్ని మరింతగా చూరగొంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు: మిస్ వరల్డ్ 2025 పోటీలు

    దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా హైదరాబాద్ పేరుగాంచింది. ఇటీవలే, ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. సుమారు 140 దేశాలకు చెందిన సౌందర్యరాశులు ఈ పోటీలలో పాల్గొన్నారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇది హైదరాబాద్ నగరం యొక్క అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

  • ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమదైన రీతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటిన్, మెగా డీఎస్సీ, దీపం – 2 వంటివి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కాగా మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఈ కథనంలో వివరంగా చూద్దాం.

    ప్రజలకు అండగా ప్రభుత్వ హామీలు: ఉచిత బస్సు ప్రయాణం మరియు తల్లికి వందనం

    2025 ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, విద్యార్థుల తల్లులకు అండగా నిలిచే “తల్లికి వందనం” పథకం గురించి కీలక ప్రకటన వెలువడింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు.

    తల్లికి వందనం పథకం: పూర్తి వివరాలు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న సందర్భంగా, “తల్లికి వందనం” పథకంపై మంత్రి నారా లోకేష్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేయనున్నారు. వేసవి సెలవులు ముగిసిన అనంతరం ఈ ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆయన తెలిపారు.

    లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రభుత్వ కేటాయింపులు

    ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ 6” హామీల అమలుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, వారందరికీ “తల్లికి వందనం” పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ. 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల వరకు ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

    విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరిన్ని పథకాలు

    “తల్లికి వందనం” పథకంతో పాటు, విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటిలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” మరియు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పథకం ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, బూట్లు వంటివి అందించడం జరుగుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ పథకాలు తెలియజేస్తున్నాయి.

    తల్లికి వందనం పథకానికి అర్హత మరియు ముఖ్యమైన సూచనలు

    ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఈ క్రింది ముఖ్యమైన సూచనలను గమనించాలి:

    • హౌస్ డేటా బేస్: తల్లులు మరియు వారి పిల్లల వివరాలు తప్పనిసరిగా హౌస్ డేటా బేస్‌లో నమోదు అయి ఉండాలి.
    • ఈకేవైసీ (eKYC): హౌస్ హోల్డ్ మొత్తానికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
    • ఆధార్ లింకింగ్: బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి.
    • NPCI లింకింగ్: బ్యాంకు ఖాతాకు NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కూడా అవసరం.

    గమనిక: పైన తెలిపిన ప్రక్రియలన్నీ ఇప్పటికే పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే, వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఈకేవైసీ పూర్తి కాకపోయినా లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోయినా “తల్లికి వందనం” పథకం ప్రయోజనాలు అందకపోవచ్చు. కావున, అర్హులైన లబ్ధిదారులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

  • 10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    AP Signs MoU with NVIDIA For AI: ఈ రోజు టెక్నాలజీ అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో AI టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీని రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కూడా ప్రవేశపెట్టాలని.. ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీకి ఎన్వీడియా కంపెనీ సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.

    రాష్ట్రంలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియాతో కీలక ఒప్పందం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి, మరో 500 స్టార్టప్‌ల అభివృద్ధికి ఎన్వీడియా కంపెనీతో శుక్రవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఎన్విడియా సహకారం – మంత్రి నారా లోకేష్ చొరవ

    రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు.. ఏఐ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఎన్వీడియా తన సహకారం అందించనుంది. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ ముంబైలో ఎన్వీడియా సీఈఓ ‘జెన్సన్ హుయాంగ్’ను కలిశారు. ఆ సమయంలో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకారం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు హుయాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత ఇప్పటికే ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం జరిగింది.

    ఏపీని ఏఐ రీసెర్చ్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం

    భారతదేశంలో ఏపీని ఏఐ రీసర్చ్ హబ్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నారు.

    ప్రభుత్వ మద్దతు మరియు వనరులు

    ఏఐ యూనివర్సిటీకి కావాల్సిన పరికరాలు (కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ మరియు హార్డ్‌వేర్ సామర్త్యలు) ప్రభుత్వం అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రభుత్వమే విద్యార్థులకు పరిశోధనావకాశాలను, ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

    ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

    రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు:

    • మంత్రి నారా లోకేష్
    • ఎన్వీడియా సౌత్ ఇండియా ఎండీ దూపర్
    • గణేష్ మహబాల
    • ఉన్నత విద్యా కార్యదర్శి
    • ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి

    ఏఐ టెక్నాలజీ: ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ దిశ

    ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రోజు భారతదేశం ఏఐ టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే.. పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

    వివిధ రంగాల్లో ఏఐ అనువర్తనాలు, ఉద్యోగాలపై ప్రభావం

    ఏఐ టెక్నాలజీ ఒక్క ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఎడ్యుకేషన్, మీడియా, టెలి కమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా విస్తరించి ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది గతంలోనూ.. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ టెక్నాలజీ పనిని వేగవంతం చేయడానికి పనికొస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యోగులు లేదా ఉద్యోగార్థులు మారుతున్న ప్రపంచంలో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేర్చుకోవడం ఉత్తమం.

  • చరిత్ర సృష్టించిన థాయిలాండ్ భామ: ప్రపంచ సుందరి ఎవరీ ‘ఒపెల్ సుచాత’?

    చరిత్ర సృష్టించిన థాయిలాండ్ భామ: ప్రపంచ సుందరి ఎవరీ ‘ఒపెల్ సుచాత’?

    Miss World 2025 Winner Opal Suchata: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మిస్ వరల్డ్ 2025 (72వ ఎడిషన్) పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ప్రతిష్టాత్మక అందాల పోటీలో థాయిలాండ్ సుందరి ‘ఒపల్ సుచాత చువాంగ్‌శ్రీ’ (Opal Suchata Chuangsri) మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది విజేత, మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్జ్‌కోవా, ఒపెల్ సుచాతకు కిరీటాన్ని అలంకరించారు.

    ఎవరీ ఒపల్ సుచాత చువాంగ్‌శ్రీ?

    ఒపల్ సుచాత చువాంగ్‌శ్రీ థాయిలాండ్ దేశానికి చెందిన యువతి. ఆమె ప్రస్థానం, వ్యక్తిగత వివరాలు ఇక్కడ చూడండి.

    బాల్యం మరియు విద్యాభ్యాసం

    ఒపల్ సుచాత 2003 జనవరి 20న థానేట్ డోంకామ్నెర్డ్ మరియు సుపాత్ర చువాంగ్‌శ్రీ దంపతులకు జన్మించారు. వీరి కుటుంబం ఒక ప్రైవేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఒపల్ సుచాత తన ప్రాథమిక విద్యను కాజోన్‌కీట్సుక్సా స్కూల్‌లో, సెకండరీ విద్యను ఉడోమ్ సుక్సా స్కూల్‌లో పూర్తి చేశారు. ఇక్కడే ఆర్ట్స్ ప్రోగ్రాం కింద చైనీస్ భాషను మేజర్‌గా అభ్యసించారు. ప్రస్తుతం ఆమె థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు.

    అందాల పోటీలలో ప్రస్థానం

    ఒపల్ సుచాత ఇప్పటికే మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 కిరీటాన్ని గెలుచుకున్నారు. అనంతరం, మిస్ యూనివర్స్ 2024 పోటీలో థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించి, అక్కడ మూడవ రన్నరప్‌గా నిలిచారు.

    చారిత్రాత్మక విజయం

    మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలవడం ద్వారా ఒపల్ సుచాత చరిత్ర సృష్టించారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి థాయ్ యువతిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు థాయిలాండ్ దేశం నుంచి ఎవరూ ఈ ఘనత సాధించలేదు.

    నగదు బహుమతి

    మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో, ఒపల్ సుచాత టాప్ 4లో మార్టినిక్, ఇథియోపియా మరియు పోలెండ్ దేశాల ప్రతినిధులను అధిగమించి ప్రతిష్టాత్మక కిరీటాన్ని దక్కించుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్జ్‌కోవా, ఒపల్‌కు కిరీటాన్ని అలంకరించడమే కాకుండా, తన “మిస్ వరల్డ్” బిరుదును కూడా లాంఛనంగా అందజేశారు. విజేతగా నిలిచిన ఒపెల్‌కు సుమారు రూ. 8.5 కోట్ల నగదు బహుమతి కూడా లభించే అవకాశం ఉందని సమాచారం.

    మిస్ వరల్డ్ కిరీటం విజేతలకు లభించే ప్రయోజనాలు (Benefits Of Miss World Winners)

    ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి, అవి:

    • ప్రపంచవ్యాప్త గుర్తింపు: విజేతలకు ప్రపంచవ్యాప్తంగా అపారమైన కీర్తి, గుర్తింపు లభిస్తాయి.
    • ఆర్థిక ప్రయోజనాలు: నగదు బహుమతితో పాటు, స్పాన్సర్‌షిప్‌లు మరియు ఇతర సంస్థల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.
    • బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశాలు: అనేక ప్రతిష్టాత్మక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే అవకాశం దక్కుతుంది.
    • సామాజిక ప్రభావం: ప్రపంచ వేదికపై తమ వాణిని వినిపించడం ద్వారా, సామాజిక సేవ మరియు మార్పునకు పాటుపడవచ్చు.
    • విలాసవంతమైన సౌకర్యాలు: విజేతకు దుస్తులు, విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్లలో వసతి, ఆభరణాలు, మేకప్ మరియు స్టైలింగ్ సేవలు వంటివి ఉచితంగా లభిస్తాయి.
  • సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    Yogandra 2025: ప్రపంచ దేశాలకు భారతదేశం గురువు అని ఎన్నో గ్రంధాలు పేర్కొన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను మాత్రమే కాకుండా, యోగ వంటి గొప్ప విధానాలతో భాసిల్లుతున్న భారత్, గొప్ప తాత్విక వేత్తలకు, గురువులకు నిలయంగా భాసిల్లుతోంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న యోగాను దేశం మొత్తం అవలంబించేలా ప్రధాని మోదీ చర్య తీసుకున్నారు. ఈ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. రాబోయే యోగ దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు.

    యోగాంధ్ర 2025: నెల రోజుల యోగా మహోత్సవం

    జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజులపాటు (జూన్ 21 నుంచి) నిరవహించే ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర 2025’ (Yogandra 2025) పేరుతో చేపడతామని ఆయన అన్నారు. యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ నినాదంతో, ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    విశాఖలో భారీ యోగా ప్రదర్శన: లక్షలాది మంది భాగస్వామ్యం

    విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాదిమంది యోగాసనాలు వేయనున్నారు. దీనికి ప్రముఖ యోగ గురువులు హాజరవుతారు. వీరందరిని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యోగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేసారు.

    పది లక్షల మందికి యోగా శిక్షణ, పోటీలు

    జూన్ 21 నుంచి నిర్వహించనున్న నెల రోజుల యోగా కార్యక్రమాల్లో భాగంగానే సుమారు 10 లక్షల మందికి యోగా నేర్పించడమే కాకుండా, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వీరందరినీ యోగా దినోత్సవం రోజున రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా చేస్తామని సీఎం అన్నారు. నెలరోజుల పాటు యోగాకు సంబంధించిన పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి, విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

    విద్యా వ్యవస్థలో, దైనందిన జీవితంలో యోగా

    వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్ 21 వరకు ఉదయం ఒక గంటసేపు పిల్లలకు యోగా తరగతులు బోధించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో యోగాను పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చనున్నట్లు ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పార్యటక స్థలాల్లో కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద హోటళ్లలో కూడా యోగా కోసం స్థలాన్ని కేటాయించేలా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

    యోగా ప్రాముఖ్యత – ప్రధాని మోదీ చొరవ

    భారతదేశంలో యోగాకు ఎనలేని చరిత్ర ఉన్నప్పటికీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల వెలుగులోకి వచ్చింది. యోగా అనేది ఒక కులానికి లేదా మతానికి మాత్రమే పరిమితం కాదు. యోగా అనేది సైన్స్, మనిషి జీవితంలో యోగా ఒక భాగమైనప్పుడే ఆరోగ్యం సాధ్యమవుతుంది. మోదీ ప్రతి ఏటా యోగా దినోత్సవం రోజు తానే స్వయంగా యోగా చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా దినోత్సవం జరుగుతూనే ఉంది.

  • మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    Free Bus Service in Andhra Pradesh: ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల అమలుకు సంబంధించిన విషయాలను కర్నూలులో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

    ‘సూపర్ సిక్స్’ హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

    కర్నూలు వేదికగా జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి?

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. 2025 ఆగష్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి రాష్ట్రంలోని అందరి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    తల్లికి వందనం పథకం అమలు

    అంతే కాకుండా.. వేసివి సెలవులు పూర్తయిన తరువాత, అంటే వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే సమయానికి తల్లికి వందనం పథకం కింద.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు వేస్తామని అన్నారు. తల్లుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.

    చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

    అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్తవేయడాన్ని అవమానంగా భావిస్తారని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ చెత్త రహిత రాష్ట్రం కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి చెత్తను మిద్దె తోటలకు ఉపయోగించుకోవాలని సూచించారు.

    ఇతర ముఖ్య సంక్షేమ పథకాలు మరియు హామీలు

    దీపం 2 పథకం: నేరుగా ఖాతాల్లోకి నగదు

    దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.

    రాయలసీమ అభివృద్ధి – ఉద్యానవన పంటల ప్రోత్సాహం

    రాయల సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదని అన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

    పేదలకు ఉచిత విద్యుత్ మరియు సౌర విద్యుత్

    పేదలకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు.. సౌర విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

    ఉచిత బస్సు ప్రయాణం – వివరాలు

    ఆగష్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు సర్వీస్ ద్వారా.. ప్రభుత్వం రూ. 3182 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన తరువాత అది 94 శాతానికి చేరుతుందని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రస్తుతం 11,216 బస్సులు ఉన్నాయి. ఇందులోని 8193 బస్సులలో మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేయడం జరుగుతుంది.

  • 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!.. సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం

    20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!.. సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం

    Telangana Government Jobs: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. నిరుద్యోగులు కోరుకునేది మాత్రం సకాలంలో నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగానే 2024 – 25 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా సన్నద్ధమవుతోంది. దీనికి తగిన విధంగానే జాబ్ క్యాలెండర్‌లో కొన్ని సవరణలు చేసే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే 20 వేలకంటే ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

    ప్రభుత్వ ఉద్యోగాల జారీకి సన్నాహాలు మరియు ఎస్సీ వర్గీకరణ

    ప్రభుత్వం అనుకున్న విధంగానే ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. అట్టడుగు వర్గాల వారికి కూడా న్యాయం జరిగేలా.. త్వరలో విడుదలకానున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడానికి.. ప్రభుత్వ విభాగాల్లోనో ఖాళీలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగానే.. ఈ క్రింది నియామకాలు చేపట్టనున్నారు:

    • గ్రూప్స్
    • టీచర్స్
    • పోలీస్
    • విద్యుత్తు
    • గురుకుల
    • వైద్య నియామకాలు

    అంతే కాకుండా ఇందులో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.

    వివిధ శాఖల్లో ఖాళీల అంచనా

    ఆర్టీసీ మరియు వైద్య విభాగాల్లోని సుమారు 10వేల ఉద్యోగాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గురుకుల నియామకాల్లో సుమారు 2000 పోస్టులు బ్యాక్‌లాగ్‌గా ఉన్నట్లు, ఇతర ప్రభుత్వ విభాగాలు మరియు విద్యుత్ సంస్థలలోని ఇంజినీరింగ్ విభాగాల్లో దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగ ఖాళీలు ఉంటాయని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    నిరుద్యోగుల ఆశలు మరియు పోటీకి సన్నద్ధత

    తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అంతకంటే శుభవార్త మరొకటి ఉండదని నిరుద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా.. మరింత గట్టిగా సన్నద్ధమవ్వాలి.

    ప్రభుత్వం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కాబట్టి విడుదలయ్యే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంది. ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవ్వాల్సి ఉంటుంది.

    పట్టుదలతో ప్రయత్నించండి: విజయం మీదే!

    ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంది కల. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయినా ఉద్యోగానికి సిద్దమవుతున్నవారు చివరి నిమిషం వరకు ఏ మాత్రం నిరాశ చెందకుండా.. శ్రమించాలి. శ్రమలో లోపం లేకుండా ఉంటే.. ఆలస్యమైనా ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనటం అక్షర సాధ్యం. కాబట్టి ఇప్పుడు మీ ముందున్న అంశం ఉద్యోగం కోసం బాగా సిద్దమవ్వడమే.

    రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే విషయంతో పాటు.. ఎగ్జామ్ డేట్, క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ఫీజు వంటి ఇతర వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.

  • హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ఖరారు: కొత్త చార్జీలు ఇవే..

    హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ఖరారు: కొత్త చార్జీలు ఇవే..

    Hyderabad Metro Rail to Hike Ticket Fares: ఎట్టకేలకు హైదరాబద్ మెట్రో చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి (మే 17, శనివారం) నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ఛార్జీలు కనిష్టంగా 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెరుగగా, గరిష్ట ఛార్జీలు రూ. 60 నుంచి రూ. 75కు చేరాయి. దీని ప్రకారం, మెట్రో ప్రయాణ ధరలు సుమారు 25 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది. ఈ ఛార్జీల పెరుగుదల రోజూ మెట్రోలో ప్రయాణించే సుమారు ఐదు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది.

    కొత్త మెట్రో ఛార్జీల పూర్తి వివరాలు (రూపాయలలో)

    ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 60 మధ్య ఉన్నాయి. సవరించిన ఛార్జీల ప్రకారం వివిధ దూరాలకు ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    • 2 కిలోమీటర్ల వరకు: రూ. 12
    • 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు: రూ. 30
    • 6 కిమీ నుంచి 9 కిమీ వరకు: రూ. 40
    • 9 కిమీ నుంచి 12 కిమీ వరకు: రూ. 50
    • 12 కిమీ నుంచి 15 కిమీ వరకు: రూ. 55
    • 18 కిమీ నుంచి 21 కిమీ వరకు: రూ. 66
    • 21 కిమీ నుంచి 24 కిమీ వరకు: రూ. 70
    • 24 కిమీ కంటే ఎక్కువ దూరం: రూ. 75

    ఈ నూతన ఛార్జీల పట్టికను ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది.

    ఛార్జీల పెంపునకు కారణాలు మరియు నేపథ్యం

    రెండేళ్ల నిరీక్షణ తరువాత ధరల సవరణ

    మెట్రో రైల్వేస్ చట్టం 2002 ప్రకారం, ఛార్జీలను సవరించడానికి లేదా కొత్త ధరలను అమలు చేయడానికి 2022లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) ఏర్పాటైంది. ఈ కమిటీ 2023 జనవరి 25న సవరించిన ఛార్జీలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఛార్జీల పెరుగుదల గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

    ఎల్ & టీ మెట్రో రైల్ స్పందన

    హైదరాబాద్ మెట్రో రైలు సేవలను మరింత నాణ్యతతో, మెరుగైన సౌకర్యాలతో అందించడానికి ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఎల్ & టీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. “ప్రయాణికులు ఈ మార్పునకు సహకరించి, మద్దతు అందించాలని ఆశిస్తున్నాము,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    ప్రయాణికుల అభిప్రాయాలు

    ఛార్జీల పెరుగుదలపై కొందరు ప్రయాణికులు స్పందిస్తూ, ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ధరల పెంపు కొంతవరకు సమర్థనీయమేనని, అయితే అదే సమయంలో మెట్రో రైళ్లలో కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు.

    ఇతర నగరాల మెట్రో ఛార్జీల పరిస్థితి

    ఇప్పటికే దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ఢిల్లీ మెట్రో రెండుసార్లు ఛార్జీలను పెంచింది. బెంగళూరు మెట్రో కూడా సుమారు 45 శాతం మేర ఛార్జీలను పెంచడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఇప్పుడు ధరల సవరణను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

    భవిష్యత్ ప్రణాళికలు

    రోజురోజుకూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

  • మొదలైన సరస్వతి పుష్కరాలు: తెలుసుకోవలసిన విషయాలు ఇవే..

    మొదలైన సరస్వతి పుష్కరాలు: తెలుసుకోవలసిన విషయాలు ఇవే..

    Saraswati Pushkaralu in Telangana: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు (మే 15) నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పుష్కరాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహావిష్కరణతో పాటు, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన గదుల సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్న ఈ పుష్కరాల్లో పాల్గొంటున్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలవడం ఒక విశేషం. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    పుష్కరాల ప్రారంభం & పూజా కార్యక్రమాలు

    తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత, మరియు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల కలయిక) వద్ద గురువారం ఉదయం 5:44 గంటలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి వారు ప్రత్యేక పూజలతో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాల సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6:45 గంటల నుంచి 7:35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది.

    భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఏర్పాట్లు

    రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వహణ కోసం సుమారు రూ. 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసే లక్షలాది భక్తుల కోసం తాత్కాలిక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సౌకర్యం, స్నానఘట్టాల నిర్మాణం, వాహనాల పార్కింగ్ వంటి వాటికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరాలకు ప్రతి రోజు సుమారు ఒక లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    పర్యావరణ పరిరక్షణకు చర్యలు

    పుష్కరాల సమయంలో నదీ జలాలు కలుషితం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు పుష్కరాలకు సంబంధించిన పోస్టర్లను కూడా బుధవారం ఆవిష్కరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుష్కరాలను నిర్వహించగా, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగడం ఇదే ప్రప్రథమం.

    పుష్కరాల చారిత్రక ప్రాముఖ్యత

    ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సరస్వతి నది పుష్కరాలకు అశేష జనవాహిని తరలివస్తుంది. భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని కాళేశ్వరం వద్ద, మహారాష్ట్ర మీదుగా ప్రవహించే గోదావరి నదిలో ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు కలిసే పవిత్ర ప్రదేశంలోనే అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవిస్తుందని ప్రతీతి. ఇక్కడ ప్రసిద్ధ మహా సరస్వతి ఆలయంతో పాటు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం కూడా కొలువై ఉంది. సరస్వతి నది పుష్కరాలను కేవలం తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.