Author: Kumar

  • రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    Cars under Rs. 10 Lakhs: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా ఓ కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది కల. అయితే, మన బడ్జెట్‌కు సరిపోయే, మంచి ఫీచర్లున్న కారును ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ కథనంలో, రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని బెస్ట్ కార్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

    రూ.10 లక్షలలోపు బెస్ట్ కార్లు..

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో.. కారు కొనాలనుకునే వారి కోసం ఇక్కడ బెస్ట్ మోడల్స్ ఉన్నాయి..

    1. టాటా నెక్సాన్ (Tata Nexon)

    దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV నెక్సాన్. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులోని పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమాటిక్, డీజిల్ మాన్యువల్ మరియు సిఎన్‌జీ మాన్యువల్ ఆప్షన్స్ కలిగిన సుమారు 9 వేరియంట్స్ ధరలు రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి. టాటా నెక్సాన్ యొక్క కొన్ని టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చు. నెక్సాన్ అన్ని వేరియంట్ల డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఫీచర్లు మరియు ఇంజిన్ పర్ఫామెన్స్‌లో కొంత తేడా ఉంటుందని గమనించాలి. ఇది 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.

    2. కియా సోనెట్ (Kia Sonet)

    స్టైలిష్ లుక్ మరియు ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే కియా సోనెట్ కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ మోడల్ యొక్క 7 వేరియంట్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తాయి. దీని ఆధునిక డిజైన్ మరియు ఫీచర్లు యువ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తాయి.

    3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO)

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో మహీంద్రా నుంచి వచ్చిన అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ 3XO (గతంలో XUV300) ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. సింపుల్ ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో పాటు ఉత్తమమైన పనితీరును అందిస్తుంది.

    4. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

    రూ. 7.94 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హ్యుందాయ్ వెన్యూ కూడా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఓ మంచి కారు. ఈ మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. నిజానికి ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న లేదా ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కాంపాక్ట్ SUVల జాబితాలో వెన్యూ కూడా ఒకటి. ఇది మంచి డిజైన్, ఆధునిక ఫీచర్లు కలిగి, అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

    5. టయోటా టైసర్ (Toyota Taisor)

    ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా నుంచి వచ్చిన అర్బన్ క్రూయిజర్ టైసర్ కూడా రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, AMT మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో వస్తాయి. టయోటా బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ దీని అదనపు ఆకర్షణలు.

    ఇతర బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లు (Other Budget-Friendly Cars)

    పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా, రూ. 10 లక్షల బడ్జెట్‌లో మరికొన్ని మంచి కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మారుతి సుజుకి ఫ్రాంక్స్ (ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు)
    • టాటా పంచ్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)
    • రెనాల్ట్ కిగర్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • నిస్సాన్ మాగ్నైట్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • హ్యుందాయ్ ఎక్స్‌టర్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)

    గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్-రోడ్ ధరలు మీ నగరం మరియు రాష్ట్రం బట్టి మారవచ్చు. ఖచ్చితమైన ధరల వివరాల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.

  • నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    Nita Ambani in TIME100 Philanthropy List 2025: అంబానీ ఫ్యామిలీ అంటే కేవలం భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కుటుంబం కూడా. ఇటీవల, ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుల జాబితాలో (Time Magazine’s 100 Most Influential People) ముకేశ్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్మన్ శ్రీమతి నీతా అంబానీ (Nita Ambani) కూడా స్థానం సంపాదించారు.

    టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన దాతృత్వ నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో నీతా అంబానీ ఏకంగా 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 407 కోట్లు) విరాళంగా అందించారు. ఈ ఘనతతో, భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన పారిశ్రామికవేత్తల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. సుమారు 100 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కేవలం వ్యాపార దిగ్గజమే కాకుండా గొప్ప పరోపకారి అని కూడా నిరూపించుకున్నారు.

    రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంబానీ కుటుంబం సేవా కార్యక్రమాలు

    అంబానీ కుటుంబం, రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలను చురుకుగా చేపడుతోంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో వారి కృషి లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చింది.

    ముఖ్య సేవా రంగాలు మరియు కార్యక్రమాలు:

    • విద్య మరియు నైపుణ్యాభివృద్ధి: స్కాలర్‌షిప్‌లకు నిధులను సమకూర్చడం, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మరియు మహిళలు కెరీర్ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడటం.
    • గ్రామీణాభివృద్ధి: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అధునాతన నీటి సంరక్షణ ప్రాజెక్టులు చేపట్టడం, మరియు గ్రామీణ వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం.
    • ఆరోగ్య సంరక్షణ: ఆసుపత్రుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను విస్తరించడం, మరియు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం. వీరి దాతృత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.

    ముకేశ్ అంబానీ మరియు నీతా అంబానీలు ఈ కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు.

    క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం

    సేవా కార్యక్రమాలతో పాటు, రిలయన్స్ ఫౌండేషన్ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహిస్తోంది. నీతా అంబానీ తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తూ, మహిళా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

    గుర్తింపు పొందిన ఇతర భారతీయ దాతలు

    టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (Azim Premji) మరియు జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) కూడా స్థానం పొందారు.

    అజీమ్ ప్రేమ్‌జీ సుమారు 25 సంవత్సరాల క్రితం తన ఫౌండేషన్‌ను స్థాపించి, 29 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను తన సంస్థ నుంచి ఫౌండేషన్‌కు బదిలీ చేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు విద్య వంటి ప్రాజెక్టుల కోసం భారీ మొత్తంలో విరాళాలు అందించిన నిఖిల్ కామత్, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.

  • బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    Gold and Silver Price: బంగారం ధరలు పడిలేస్తున్న కెరటంలా.. తగ్గుతూ, పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు (మే 20) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పు జరిగింది. తులం గోల్డ్ రేటు సుమారు రూ. 95,000 వద్ద నిలిచాయి. ఈ కథనంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఢిల్లీ, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరలు (Gold Price) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 450 తగ్గి.. రూ. 87,250 వద్ద నిలిచింది, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,170 వద్ద నిలిచింది. నిన్న (సోమవారం) స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో.. బంగారం ధరల్లో మార్పులు జరిగాయి.

    తెలుగు రాష్ట్రాలు & ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    ఇక తెలుగు రాష్ట్రాల (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 450 తగ్గి.. రూ. 87,100 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,020 వద్ద ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

    వెండి ధరలు (Silver Price)

    గోల్డ్ రేటు మాత్రమే కాకుండా.. సిల్వర్ రేటు కూడా తగ్గింది. నేడు (మంగళవారం) వెండి ధరలు గరిష్టంగా రూ. 1,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో కేజీ వెండి రేటు రూ. 1,08,000 వద్ద నిలిచింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 108 రూపాయలన్నమాట. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ రేటు రూ. 97,000 వద్ద ఉంది. ఇక్కడ కూడా కేజీ ధర రూ. 1,000 తగ్గింది.

    బంగారం ధరల భవిష్యత్తు: నిపుణుల విశ్లేషణ

    అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనా మరియు అమెరికా పరస్పర సుంకాలను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా.. చెన్నైలో విస్తృతమైన బంగారు నిల్వలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో బంగారం ఉన్నప్పుడు.. కావలసినంత సరఫరా ఉంటుంది. సరఫరా పెరిగినప్పుడు.. ధరలు తప్పకుండా తగ్గుతాయి. భారతదేశంలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. బహుశా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

    ఇదిలా ఉండగా.. కొంతమంది పరిశోధకులు సంవత్సరాలుగా కష్టపడి పరిశోధనలు చేస్తూ.. సీసం నుంచి బంగారం తయారు చేసే విధానం కనిపెట్టారని చెబుతున్నారు. ఇది పూర్తిగా విజయవంతం అయితే.. బంగారం బఠానీల్లా దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    Honda CMX500 Rebel: దాదాపు అన్ని టూ వీలర్ కంపెనీలు కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తున్న తరుణంలో.. హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle) కంపెనీ, దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు ‘సీఎమ్ఎక్స్500 రెబెల్’ (CMX500 Rebel).

    ధర & బుకింగ్స్

    ఈ కొత్త బైక్ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ కేవలం గురుగ్రామ్, ముంబై మరియు బెంగళూరులలోని బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయించనుంది.

    హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఈ కొత్త రెబల్ 500 బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

    కొత్త హోండా రెబెల్ బైక్ బ్లాక్ అవుట్ థీమ్ కలిగి.. ఒకే మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్.. దాని ఎన్ఎక్స్500 బైకు కంటే రూ. 78000 తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అదే సమయంలో ప్రత్యర్థి కవాసకి ఎలిమినేటర్ 500 కంటే రూ. 64000 తక్కువ ధరకే లభిస్తుంది. మొత్తం మీద దీని ధర అధికంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకోవడమే అని తెలుస్తోంది.

    డిజైన్

    చూడటానికి అత్యద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్.. హై-మౌంటెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, కిందికి ఉన్న సీటు, కొంచెం ఇరుగ్గా ఉన్న పిలియన్ సీటు వంటి వాటిని పొందుతుంది.

    ఇంజిన్ వివరాలు

    సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్ 471 సీసీ ఇన్‌లైన్-2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి.. 46 హార్స్ పవర్, 43.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు రైడర్లను అబ్బురపరుస్తుందని భావిస్తున్నాము.

    వీల్స్, బ్రేక్స్ & ఇతర ముఖ్య ఫీచర్లు

    ఈ బైక్ 16 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే ముందు వీల్ 130 సెక్షన్ టైర్ ఉపయోగిస్తే.. వెనుక వీల్ 150 సెక్షన్ టైర్ ఉపయోగిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. నెగటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన రెబల్ 500 బైక్.. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ చాసిస్ పొందుతుంది. దీని సీటు ఎత్తు 690 మిమీ వరకు ఉంది. సుమారు 11.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు 195 కేజీలు కావడం గమనార్హం. దీని బరువు ఇప్పటికే మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్‌లకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

    హోండా రెబెల్ 500 సేల్స్ అంచనా..

    భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా రెబల్ 500 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే ఇది ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కొంత ఎక్కువగా ఉండటం చేత.. ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

  • రూ. లక్ష కంటే తక్కువ ధరలో!.. 2025 సుజుకి అవెనిస్

    రూ. లక్ష కంటే తక్కువ ధరలో!.. 2025 సుజుకి అవెనిస్

    2025 Suzuki Avenis: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, భారతీయ మార్కెట్లో తమ ప్రసిద్ధ ‘అవెనిస్’ స్కూటర్ యొక్క సరికొత్త స్టాండర్డ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ నూతన మోడల్ ఇప్పుడు OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడింది. అవెనిస్ లైనప్‌ను మరింత విస్తరించడంలో భాగంగా కంపెనీ ఈ 2025 మోడల్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.

    ధర మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు

    భారతీయ మార్కెట్లో కొత్తగా విడుదలైన 2025 సుజుకి అవెనిస్ స్కూటర్ ధర రూ. 91,400 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఇది ప్రస్తుత స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 1800 తక్కువ కావడం గమనార్హం. ఈ కొత్త మోడల్ OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ పొందడం మినహా, ఇంజన్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది అదే 124 సీసీ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 6750 rpm వద్ద 8.7 హార్స్‌పవర్ మరియు 5500 rpm వద్ద 10 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    కలర్ ఆప్షన్స్ మరియు ప్రధాన ఫీచర్లు

    2025 సుజుకి అవెనిస్ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది:

    • పెర్ల్ గ్లేసియర్ వైట్‌ విత్ గ్లోసీ స్పార్కిల్ బ్లాక్
    • పెర్ల్ మీరా రెడ్ విత్ గ్లోసీ స్పార్కిల్ బ్లాక్
    • గ్లోసీ స్పార్కిల్ బ్లాక్ విత్ ఛాంపియన్ ఎల్లో
    • మోనోటోన్ గ్లోసీ విత్ స్పార్కిల్ బ్లాక్

    ఈ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్యాటరీ వోల్టేజ్ ఇండికేటర్, ఆయిల్ చేంజ్ అలర్ట్, మరియు ట్రిప్ మీటర్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

    డిజైన్ మరియు భద్రతా ఫీచర్లు

    డిజైన్ విషయానికొస్తే, 2025 సుజుకి అవెనిస్ స్కూటర్ ఆకట్టుకునే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు స్పోర్టీ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌తో వస్తుంది. భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫంక్షన్, ఈజీ స్టార్ట్ టెక్నాలజీ మరియు ఇంటిగ్రేటెడ్ స్టార్ట్/స్టాప్ స్విచ్ వంటివి పొందుపరిచారు. అయితే, ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో లేదని గమనించాలి.

    ప్రత్యర్థులు & అదనపు సౌకర్యాలు

    భారత మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వంటి స్కూటర్లకు ఇది గట్టి పోటీనిస్తుంది. సుజుకి అవెనిస్ స్ప్లిట్ స్టైల్ గ్రాబ్ రైల్, ఎక్స్‌టెండెడ్ ఫ్లోర్‌బోర్డ్, మరియు సౌకర్యవంతమైన సింగిల్ పీస్ స్టెప్ సీటు వంటివి కలిగి ఉంది. అంతేకాకుండా, ప్రయాణంలో సౌలభ్యం కోసం USB ఛార్జింగ్ సాకెట్, షట్టర్డ్ ఇగ్నీషన్ కీ సిస్టమ్‌తో కూడిన వన్ టచ్ సెంట్రల్ లాకింగ్ మెకానిజం, ఫ్రంట్ యుటిలిటీ రాక్ మరియు హింజ్ టైప్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

    స్టోరేజ్ సామర్థ్యం మరియు లభ్యత

    2025 సుజుకి అవెనిస్ కేవలం మంచి డిజైన్ మరియు ఫీచర్లతోనే కాకుండా, 21.8 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. ఈ లేటెస్ట్ స్కూటర్ భారతదేశంలోని అన్ని అధీకృత సుజుకి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఆన్-రోడ్ ధరలు ప్రాంతాన్ని బట్టి కొంత మారే అవకాశం ఉందని కొనుగోలుదారులు గమనించాలి.

  • టాటా హారియర్ ఈవీ లాంచ్ ఎప్పుడంటే?: ఫీచర్లు, రేంజ్ & మరిన్ని వివరాలు

    టాటా హారియర్ ఈవీ లాంచ్ ఎప్పుడంటే?: ఫీచర్లు, రేంజ్ & మరిన్ని వివరాలు

    Tata Harrier EV: భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న టాటా మోటార్స్, మరో శక్తివంతమైన కారును ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ‘హారియర్ ఈవీ’. తాజా సమాచారం ప్రకారం, ఈ వాహనాన్ని కంపెనీ 2025 జూన్ 3న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఆవిష్కరణ మరియు కీలక వివరాలు

    టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న హారియర్ ఈవీ మొదటిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఇది టాటా యొక్క నూతన యాక్టీ.ఈవీ ప్లస్ (Acti.ev Plus) ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. ఈ అధునాతన ప్లాట్‌ఫాం కారణంగా, హారియర్ ఈవీ ఒక పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుందని అంచనా. మార్కెట్లో ఇది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XUV9e) వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

    ఆకట్టుకునే డిజైన్‌

    విడుదలకు సిద్ధమవుతున్న కొత్త టాటా హారియర్ ఈవీ ఆకట్టుకునే డిజైన్‌తో, చూడగానే ఆకర్షించేలా ఉంటుంది. దీని హెడ్‌ల్యాంప్ మరియు డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRL) వంటివి చాలా ప్రత్యేకంగా, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో రూపొందించబడ్డాయి. అప్‌డేటెడ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్ ఈ ఎలక్ట్రిక్ వాహనానికి మరింత ఆకర్షణను జోడిస్తాయి. అలాగే, టర్బైన్ బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ పొందుతుందని సమాచారం.

    ఇంటీరియర్ డిజైన్‌

    కేవలం బాహ్య రూపమే కాకుండా, హారియర్ ఈవీ ఇంటీరియర్ ఫీచర్లు కూడా వాహన వినియోగదారులకు సౌకర్యవంతమైన మరియు ఆధునిక అనుభూతిని అందించేలా ఉంటాయని తెలుస్తోంది. విశాలమైన క్యాబిన్, ప్రీమియం మెటీరియల్స్, మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

    పనితీరు మరియు రేంజ్

    టాటా హారియర్ ఈవీ డ్యూయెల్ మోటార్ సెటప్‌తో వస్తుందని, ఇది క్వాడ్ వీల్ డ్రైవ్ (ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌ను అందిస్తుందని అంచనా. ఈ పవర్‌ట్రైన్ సుమారు 500 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు, ఇది అద్భుతమైన యాక్సిలరేషన్ మరియు డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారును కంపెనీ ప్రత్యేకంగా ఎక్కువ రేంజ్ అందించేలా తీర్చిదిద్దుతోంది. వాస్తవ ప్రపంచంలో ఈ కారు రేంజ్ 500 కిమీ వరకు ఉంటుందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీ వత్స పేర్కొన్నారు. అయితే, బ్యాటరీ స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

    పర్యావరణ హితం దిశగా టాటా మోటార్స్ ప్రయాణం

    భారతదేశంలో టాటా మోటార్స్ తన ‘ఓపెన్ కొలాబరేషన్ 2.0’ చొరవలో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా అభివృద్ధి చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త కార్లు లేదా అప్‌డేటెడ్ ఈవీలను లాంచ్ చేస్తోంది. అంతే కాకుండా, తమ బ్రాండ్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 4,00,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా టాటా మోటార్స్ పనిచేస్తోంది.

    భారతదేశంలో టాటా ఎలక్ట్రిక్ వాహనాల లైనప్

    ఇప్పటికే భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ విజయవంతంగా నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ వంటి పలు ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ విజయవంతమైన జాబితాలోకి ఇప్పుడు కొత్తగా హారియర్ ఈవీ కూడా చేరనుంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కార్లను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది.

    నెక్సాన్ ఈవీ: అమ్మకాలలో అగ్రగామి

    టాటా మోటార్స్ 2020లో తన మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV అయిన నెక్సాన్ ఈవీను లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇది వినియోగదారుల ఆదరణ పొందుతూ, ఎప్పటికప్పుడు పలు అప్‌డేట్‌లను అందుకుంటూనే ఉంది. భారతీయ మార్కెట్లో ఇది ఇప్పటికే 2,00,000 కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. దీంతో, అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ కారుగా నెక్సాన్ ఈవీ రికార్డ్ సృష్టించింది.

    భవిష్యత్తులో మరిన్ని టాటా ఎలక్ట్రిక్ కార్లు

    టాటా మోటార్స్ భవిష్యత్తులో తన ప్రఖ్యాత ‘సియెర్రా’ కారును కూడా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. హారియర్ ఈవీ విజయంతో, టాటా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది.

  • వచ్చేస్తోంది సరికొత్త టయోటా కరోలా: దీని గురించి తెలుసా?

    వచ్చేస్తోంది సరికొత్త టయోటా కరోలా: దీని గురించి తెలుసా?

    Toyota Corolla Cross GR Sport: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) గ్లోబల్ మార్కెట్లో ‘2026 కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్’ ను ఆవిష్కరించింది. ఈ కొత్త కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న కరోలా ఆధారంగా రూపొందించినట్లు స్పష్టమవుతోంది. సరికొత్త కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఎక్స్‌టీరియర్ డిజైన్ అప్‌డేట్స్

    2026 టయోటా కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్, దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్‌డేట్స్ పొందుతుంది. దీనిలోని హెడ్‌లైట్స్ మరియు టెయిల్ లైట్స్ ఇప్పుడు ఆకర్షణీయమైన డీఆర్ఎల్ సిగ్నేచర్‌లను పొందుతాయి. ఫ్రంట్ బంపర్ కొత్త మెష్ డిజైన్‌తో వస్తుంది. హెడ్‌లైట్‌లు ప్రకాశవంతమైన బార్‌ను కలిగి ఉండటం, దానిపై బ్రాండ్ లోగో కూడా గమనించవచ్చు. కొత్త 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ మినహా, సైడ్ ప్రొఫైల్ దాదాపు మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది.

    ఇంటీరియర్ ఫీచర్లు

    ఇంటీరియర్ విషయానికి వస్తే, కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్ కారులో అనేక నవీకరణలు ఉన్నాయి:

    • కొత్త ఏసీ వెంట్స్
    • కొత్త గేర్ షిఫ్ట్ నాబ్
    • పెద్ద సెంటర్ కన్సోల్
    • స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ స్పేస్
    • స్లైడింగ్ స్టోరేజ్ బాక్స్
    • కొత్త కప్ హోల్డర్‌లు

    అంతేకాకుండా, ఈ కారులో 10.5 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, మరియు హీటెడ్ సీటింగ్ వంటి అత్యాధునిక ఫీచర్స్ కూడా ఉంటాయి.

    ఇంజిన్ మరియు పనితీరు

    డిజైన్ మరియు ఫీచర్లలో మార్పులు ఉన్నప్పటికీ, యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి, కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్ రెండు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్ తో వస్తుంది:

    • 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (140 హార్స్ పవర్)
    • 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (197 హార్స్ పవర్)

    ఈ ఇంజిన్‌లు ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

    జీఆర్ స్పోర్ట్స్ వేరియంట్ ప్రత్యేకతలు

    కొత్త కరోలా క్రాస్ జీఆర్ స్పోర్ట్స్ వేరియంట్ కొన్ని ప్రత్యేకమైన అంశాలను కలిగి ఉంటుంది:

    • పూర్తిగా నలుపు రంగులో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్
    • షార్ప్ నోస్ మరియు ఆకర్షణీయమైన బంపర్
    • గ్రిల్ మరియు టెయిల్‌గేట్‌పై జీఆర్ లోగోలు
    • కారు లోపల బ్రౌన్ నౌబ్ అపోల్స్ట్రే
    • స్వెడ్ లాంటి సింథటిక్ లెదర్
    • కాంట్రాస్టింగ్ రెడ్ కలర్ స్టిచ్చింగ్ మరియు జీఆర్ లోగోలు

    భారతదేశంలో విడుదల మరియు అంచనాలు

    గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త 2026 కరోలా జీఆర్ స్పోర్ట్స్, భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఒకవేళ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు కర్ణాటకలోని టయోటా ప్లాంట్ నుంచి విడుదలవుతుందని సమాచారం. అయితే, ఈ కారు ధరలు మరియు ఇతర వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో 2025 ఐక్యూబ్

    తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో 2025 ఐక్యూబ్

    2025 TVS iQube: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన అప్డేటెడ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2025 మోడల్ లైనప్‌లో కేవలం కొత్త ఫీచర్లను జోడించడమే కాకుండా, ధరలను కూడా తగ్గించి వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఐక్యూబ్ ధరలు ఇప్పుడు రూ. 99,741 నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. ముఖ్యంగా, బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాన్ని పెంచి, మరింత ఎక్కువ రేంజ్‌ను అందిస్తోంది.

    2025 టీవీఎస్ ఐక్యూబ్: వేరియంట్లు మరియు నూతన ధరలు

    వివిధ శ్రేణుల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, టీవీఎస్ ఐక్యూబ్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి నవీకరించబడిన ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    • ఐక్యూబ్ (2.2 kWh బ్యాటరీ): రూ. 99,741
    • ఐక్యూబ్ (3.5 kWh బ్యాటరీ): రూ. 1.24 లక్షలు
    • ఐక్యూబ్ ఎస్ (3.5 kWh బ్యాటరీ): రూ. 1.35 లక్షలు
    • ఐక్యూబ్ ఎస్‌టీ (3.5 kWh బ్యాటరీ): రూ. 1.46 లక్షలు
    • ఐక్యూబ్ ఎస్‌టీ (5.3 kWh బ్యాటరీ): రూ. 1.60 లక్షలు

    (గమనిక: పైన తెలిపిన అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ప్రాతిపదికన ఇవ్వబడ్డాయి)

    2025 టీవీఎస్ ఐక్యూబ్: కీలక అప్‌డేట్స్ మరియు ఫీచర్లు

    టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2025 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులతో పాటు ముఖ్యమైన సాంకేతిక అప్‌గ్రేడ్‌లను కూడా చేసింది, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందించే లక్ష్యంతో.

    పెరిగిన బ్యాటరీ సామర్థ్యం మరియు అత్యుత్తమ రేంజ్

    గతంలో ఐక్యూబ్ ఎస్ మరియు ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్లు 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చేవి. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లు 3.5 kWh బ్యాటరీతో వస్తున్నాయి, దీని వలన ఒక్కసారి ఛార్జ్‌పై రేంజ్ 145 కిలోమీటర్ల వరకు పెరిగింది.

    అదేవిధంగా, టాప్-స్పెక్ ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ గతంలో 5.1 kWh బ్యాటరీని కలిగి ఉండగా, ఇప్పుడు మరింత శక్తివంతమైన 5.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఈ అప్‌గ్రేడ్ వలన ఇది ఏకంగా 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే, బేస్ ఐక్యూబ్ వేరియంట్‌లో ఎటువంటి మార్పు లేదు; ఇది తన 2.2 kWh బ్యాటరీతో 75 కిమీ నుంచి 80 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అన్ని వేరియంట్లు కూడా 4.4 kW హబ్ మోటార్‌ను కలిగి ఉంటాయి, ఇది స్థిరమైన పనితీరును అందిస్తుంది.

    ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్లు

    కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది, ఇది పట్టణ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. డ్యూయెల్ టోన్ షేడ్ కలర్ సీటు మరియు ప్రయాణికుల సౌకర్యం కోసం రియర్ బ్యాక్‌రెస్ట్ వంటివి దీని ప్రధాన ఆకర్షణలు.

    • టాప్ స్పెక్ ఐక్యూబ్ (ఎస్‌టీ): బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) తో కూడిన 7-ఇంచెస్ అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే.
    • ఐక్యూబ్ ఎస్ వేరియంట్: 7-ఇంచెస్ నాన్-టచ్ డిస్‌ప్లే, అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది.
    • బేస్ వేరియంట్లు: 5-ఇంచెస్ నాన్-టచ్ డిస్‌ప్లే, ముఖ్యమైన రైడింగ్ వివరాలను చూపిస్తుంది.

    టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్

    భారతదేశంలో 2020లో తొలిసారిగా లాంచ్ అయినప్పటి నుండి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అప్‌డేట్‌లను పొందింది. డిజైన్, ఫీచర్లు మరియు ముఖ్యంగా బ్యాటరీ అప్‌గ్రేడ్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. పెరిగిన రేంజ్, మెరుగైన ఫీచర్లు కొనుగోలుదారులను బాగా ఆకర్షించాయి. దీని ఫలితంగా, ఇప్పటివరకు టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు ఐదు లక్షల యూనిట్లను దాటడం ఈ స్కూటర్ ప్రజాదరణకు నిదర్శనం.

  • తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొత్త సీఎన్‌జీ కారు: పూర్తి వివరాలు

    తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొత్త సీఎన్‌జీ కారు: పూర్తి వివరాలు

    Citroen C3 CNG: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు, సీఎన్‌జీ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. దాదాపు అన్ని కంపెనీలు తమ కార్లను, బైకులను ఈ విభాగాల్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ (Citroen) తన సీ3 కారును సీఎన్‌జీ కిట్‌తో లాంచ్ చేసింది. ఈ కొత్త సీఎన్‌జీ కారు ధరలు, మైలేజ్ వంటి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూసేద్దాం..

    సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ: పూర్తి వివరాలు

    దేశీయ మార్కెట్లో ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం సిట్రోయెన్ తన ప్రముఖ C3 మోడల్‌ను CNG వేరియంట్‌లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది.

    వేరియంట్లు & ధరలు

    కొత్త సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి:

    • లైవ్
    • ఫీల్
    • ఫీల్ (ఓ)
    • షైన్

    వీటి ధరలు రూ. 7.16 లక్షల నుంచి రూ. 9.24 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అంటే దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 93,000 ఎక్కువని తెలుస్తోంది. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది.

    డిజైన్ మరియు ఫీచర్లు

    చూడటానికి సాధారణ సిట్రోయెన్ సీ3 మాదిరిగా ఉన్నప్పటికీ.. సీ3 సీఎన్‌జీ అదే లైటింగ్ సెటప్, ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే ఇది సీఎన్‌జీ కారు అని ప్రత్యేకంగా తెలియడానికి CNG బ్యాడ్జెస్ వంటివి అక్కడక్కడా కనిపిస్తాయి. ఇందులోని సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్ల వరకు ఉంటుంది.

    మైలేజ్

    సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ కారు.. ఒక కేజీ సీఎన్‌జీతో 28.1 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. పెట్రోల్ సిట్రోయెన్ సీ3 కారు కంటే కూడా సీఎన్‌జీ సీ3 మైలేజ్ కొంత ఎక్కువే అని తెలుస్తోంది. కాబట్టి ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి ఈ మోడల్ మంచి ఎంపిక అవుతుంది. ప్రస్తుతం ఈ కారు బ్రాండ్ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

    సీఎన్‌జీ కార్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

    నిజానికి భారతదేశంలో ఒకప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ ఉండేది. ఆ తరువాత పెట్రోల్ కార్లకు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ లేదా సీఎన్‌జీ వెహికల్స్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. కాలాన్ని బట్టి మనిషి కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. అంతే కాకుండా సీఎన్‌జీ కార్ల మైలేజ్ పెట్రోల్ కార్ల మైలేజ్ కంటే కూడా ఎక్కువే. సాధారణ లేదా మధ్యతరగతి ప్రజలు ఎవరైనా.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే మార్కెట్లో లాంచ్ అవుతున్న సీఎన్‌జీ కార్ల సంఖ్య పెరుగుతోంది, కొనుగోలుదారులు కూడా ఎక్కువవుతున్నారు.

    సీఎన్‌జీ వాహనాల భవిష్యత్తు ఎలా ఉండనుంది?

    ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చాలా కంపెనీలు సీఎన్‌జీ కార్లను లాంచ్ చేశాయి. మరికొన్ని కంపెనీలు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కేవలం కార్లు మాత్రమే కాకుండా బైకులు కూడా సీఎన్‌జీ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లను లాంచ్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే.. రాబోయే రోజుల్లో సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

  • పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    Gold and Silver Price Today: భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి క్రమంగా తగ్గుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారీగా పెరిగిన పసిడి ధరలు, ఆ తరువాత ఒడిదుడుకులకు లోనవుతూ, గత రెండు రోజులుగా ఊహించని రీతిలో తగ్గాయి. ఈ రోజు (మే 15) బంగారం ధర గరిష్టంగా 2130 రూపాయల వరకు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు, అలాగే వెండి ధరల వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులలో నేటి బంగారం ధరలు

    లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధర, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా వరుసగా రెండో రోజు పతనమైంది. ఈ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,100 వద్ద స్థిరపడింది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 93,930 వద్ద ఉంది.

    నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరల పరిస్థితి

    దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో బంగారం ధరలు సాధారణంగా కొంత ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,250 వద్ద ఉంది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 94,080 వద్ద నిలిచింది.

    నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఈరోజు మరింత క్షీణించింది.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. నిన్న కిలో వెండి ధర రూ. 1,09,000 ఉండగా, ఈరోజు రూ. 1000 తగ్గి, రూ. 1,08,000 వద్దకు చేరింది. ఈ ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, ముంబై, చెన్నై, మరియు బెంగళూరు వంటి నగరాలకు వర్తిస్తాయి. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 97,000 వద్దకు చేరింది.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు మరియు కొనుగోలు దారులకు సూచనలు

    అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న మార్పుల కారణంగానే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. అమెరికా – చైనా దేశాలు ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణమని తెలుస్తోంది. 90 రోజుల వరకు కొత్త సుంకాలు ఆ రెండు దెసలలో అమలులో ఉంటాయి. కాబట్టి గోల్డ్ రేటు కొంతవరకు తగ్గుముఖం పట్టిందనిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. బంగారం ధరలు తగ్గినప్పుడే పసిడి ప్రియులు కొనుగోలు చేయడం ఉత్తమం. కాబట్టి ధరలు తగ్గుతున్నప్పుడు.. బంగారం కొనాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.