Category: Andhra Pradesh

  • టీటీడీ గొప్ప అవకాశం: VIP దర్శనం ఉచితంగా పొందండిలా..

    టీటీడీ గొప్ప అవకాశం: VIP దర్శనం ఉచితంగా పొందండిలా..

    TTD Govinda Koti Scheme: యువతలో రోజురోజుకి ఆధ్యాత్మిక చింతన కనుమరుగైపోతోంది. దీనిని మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు వినూత్న పద్దతిని అమలులోకి తీసుకొచ్చారు. ఎవరైతే గోవింద కోటి రాస్తారో.. వారికి ఉచితంగా వీఐపీ దర్శనం కల్పిస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    గోవింద కోటి అంటే ఏమిటి? TTD వినూత్న పథకం

    నిజానికి చాలామందికి రామకోటి మాత్రమే తెలుసు. ఈ తరహాలోనే టీటీడీ యాజమాన్యం గోవింద కోటి తీసుకొచ్చించి. ఈ పథకం ద్వారా యువతలో భక్తి భావాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశ్యం.

    VIP దర్శనం పొందే విధానాలు:

    • కుటుంబంతో సహా VIP దర్శనం: 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న యువత గోవింద కోటి (కోటిసార్లు గోవింద నామం) రాస్తారో.. అలాంటి వారికి, వారి ఫ్యామిలీతో సహా వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.
    • వ్యక్తిగత VIP బ్రేక్ దర్శనం: ఎవరైనా 10,01,116 (పది లక్షల వెయ్యి నూట పదహారు) సార్లు గోవింద నామం రాస్తారో.. అలాంటి వారికి (రాసిన వ్యక్తికి మాత్రమే) వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది.

    గోవింద కోటి పుస్తకాలు మరియు నియమాలు

    పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి?

    గోవింద కోటి రాయాలనుకునే వారికోసం కావాల్సిన పుస్తకాలు.. టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్‌లో లభిస్తాయి.

    పుస్తకాల వివరాలు మరియు పూర్తి చేయడానికి పట్టే సమయం:

    ఒక్కో పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఇలాంటి ఒక పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు.

    • 10,01,116 నామాలు రాయడానికి సుమారు 26 పుస్తకాలు అవసరమవుతాయి. ఈ పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.
    • కోటి నామాలు రాయడానికి 252 కంటే ఎక్కువ పుస్తకాలు కావాల్సి ఉంటుంది, దీనికి మరింత ఎక్కువ సమయం పడుతుంది.

    గోవిండ కోటి పూర్తి చేశాక VIP దర్శనం పొందడం ఎలా?

    ఎవరైతే గోవింద కోటి పూర్తి చేస్తారో.. అలాంటి వారు తాము రాసిన పుస్తకాలను తిరుమలలోని పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తే.. వారికి ఆ మరుసటిరోజే వీఐపీ దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఉచితంగానే శ్రీవారి వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని లేదా పద్దతిని టీటీడీ యాజమాన్యం ఎప్పుడో ప్రవేశపెట్టింది.

    గోవింద కోటి ద్వారా లబ్ధి పొందిన వారు

    ఇప్పటి వరకు గోవింద కోటి రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నవారు కేవలం ముగ్గురు మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో మొదటి వ్యక్తి బెంగళూరుకు చెందిన కీర్తన అనే యువతి. ఇంటర్ పూర్తిచేసిన ఈ యువతి 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీ యాజమాన్యానికి సమర్పించింది. యాజమాన్యం ఈమెకు ఉచిత వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తరువాత మరో ఇద్దరు యువత కూడా 10,01,116 సార్లు గోవింద నామం రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నట్లు సమాచారం.

    గోవింద కోటి వల్ల కలిగే ప్రయోజనాలు

    యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి టీటీడీ తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ గోవింద కోటి. దీనివల్ల భక్తి భావం పెరుగుతుంది. తద్వారా మనసులో చెడు ఆలోచనలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరిగి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా.. సమాజానికి కూడా ఉపయోగపడుతుంది.

  • కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    Kanipakam Temple Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి ప్రతిరోజూ లెక్కకు మించిన భక్తులు వెళ్తూనే ఉంటారు. అయితే దేవాలయ అధికారులు తాజాగా కొన్ని కీలక నియమాలను వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలను కాణిపాకం సందర్శనకు విచ్చేసే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.

    కాణిపాకం ఆలయంలో కొత్త దర్శన నియమాలు

    శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో ‘పెంచల కిశోర్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇకపై కాణిపాకం వచ్చే ప్రోటోకాల్, ఉభయదారులు, వారి కుటుంబ సభ్యులు మినహా సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనానికి టికెట్స్ తీసుకోవాల్సిందే. ఇదివరకు సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికి ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉండేది, కానీ ఆ విధానానికి స్వస్తి పలికారు.

    ఆలయ సిబ్బంది బంధువులకూ టికెట్ తప్పనిసరి

    ఆలయ ఉద్యోగులకు సంబంధించినవారు ఎవరైనా దర్శనానికి వచ్చినా, వారు కూడా తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టారు.

    8 మంది ఆలయ ఉద్యోగుల తొలగింపు

    ఇదిలా ఉండగా, కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో పనిచేసే ఎనిమిదిమంది ఉద్యోగులను తొలగించినట్లు దేవాదాయ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 6న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, లెక్కకు మించి ఎక్కువ డబ్బులు తమ వద్ద ఉంచుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

    ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించబడిన వారిలో ఆలయ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ విశిష్టత

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ వెలసిన స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు మరియు స్థల గ్రంధాలు వెల్లడిస్తున్నాయి. కాణిపాకంలో భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే అవి తప్పక నెరవేరతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా, ఈ పవిత్ర స్థలంలో ఎవరైనా అసత్య ప్రమాణాలు చేస్తే, దానికి తగిన పరిణామాలను వారు ఎదుర్కొంటారని కూడా స్థానికులు మరియు భక్తులు చెప్పుకుంటారు. ఈ కారణంగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు.

    వార్షిక బ్రహ్మోత్సవాలు

    ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సుమారు ఇరవై ఒక్క రోజులకు పైగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారు మూషికాది వివిధ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలిచేవారికి సకల శుభాలు కలుగుతాయని, ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

  • విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    Satellite Toll Collection: భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ హైవేల నిర్మాణాలను వేగవంతం చేయడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, టోల్ వసూళ్ల ప్రక్రియను సులభతరం చేయడానికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో, 2019 డిసెంబర్ 15న ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు, ఈ ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో మరింత ఆధునికమైన శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం అమలులోకి రానుంది.

    శాటిలైట్ టోల్ విధానం అంటే ఏమిటి?

    శాటిలైట్ టోల్ విధానం అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ఆధారంగా పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా వాహనదారులు టోల్ చెల్లించడానికి ప్రత్యేకంగా టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ రుసుము వసూలు చేయబడుతుంది.

    తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ టోల్ ట్రయల్స్

    కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించినట్లుగా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని జాతీయ రహదారులపై శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం టెస్టింగ్ దశలో ఉంది. తాజాగా ఈ ప్రయోగాత్మక విధానం మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. ముఖ్యంగా, హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే మీద పంతంగి, కొర్లపహాడ్ (తెలంగాణ) మరియు చిల్లకల్లు (ఆంధ్రప్రదేశ్) టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ విధానంతో టోల్ వసూలు చేయడం ప్రారంభించారు.

    టోల్ ఫీజు ఎలా కట్ అవుతుంది? ప్రయోజనాలేంటి?

    టోల్ ప్లాజా వద్ద వాహనం ఆగకపోయినా టోల్ ఫీజు ఎలా వసూలు అవుతుందనే సందేహం చాలా మంది వాహనదారులలో తలెత్తింది. అయితే, శాటిలైట్ టోల్ విధానంలో, వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను ఉపయోగించి, GPS ద్వారా వాహనం ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తారు. దీని ఆధారంగా నిర్దిష్ట రుసుము వాహనదారుడి ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

    • సమయం ఆదా: టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకపోవడంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
    • డబ్బు ఆదా: ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి రావడం వలన అనవసరపు ఖర్చు తగ్గుతుంది.
    • ట్రాఫిక్ రద్దీ తగ్గుదల: టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడం తగ్గుతుంది, తద్వారా ట్రాఫిక్ జామ్‌లు తగ్గుముఖం పడతాయి.

    భవిష్యత్ ప్రణాళికలు మరియు ప్రభుత్వ కృషి

    ప్రస్తుతం ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ట్రయల్ రన్‌లో ఉంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, దేశం మొత్తం మీద ఇది ఎప్పుడు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

    పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, టోల్ వసూలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ GPS ఆధారిత టోల్ సేకరణను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కూడా కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యమైన రోడ్ల నిర్మాణం ద్వారా ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తూ, కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోంది.

  • నేడు, రేపు వర్ష సూచన: ఆ జిల్లాల్లో భారీ వర్షం!

    నేడు, రేపు వర్ష సూచన: ఆ జిల్లాల్లో భారీ వర్షం!

    AP Rain Alert: అసలే ఎండాకాలం, భానుడి భగభగలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే వేడి విపరీతంగా ఉంది, ఇక నగరాల్లో ఎండ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సమయంలో వర్షం పడితే బాగుంటుందని అందరూ ఆశిస్తారు. ఆ ఆశలని నిజం చేయడానికే వరుణుడు కరుణించినట్లు ఉన్నాడు. ఈ రోజు, రేపు (మంగళవారం, బుధవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    భారీ వర్షాలు, పిడుగులతో కూడిన గాలులు: ఈ జిల్లాలకు హెచ్చరిక

    వాతావరణ అనిశ్చితల కారణంగా రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో వేగవంతమైన ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

    భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు

    అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాలలో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.

    మోస్తరు వర్ష సూచన ఉన్న జిల్లాలు

    కాకినాడ, విశాఖపట్టణం, డా. బీ. ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు & పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి మరియు చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

    వాతావరణ శాఖ హెచ్చరికలు & అలర్ట్స్

    ఈ రోజు కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హోర్డింగ్స్ దగ్గర, చెట్ల కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

    కొనసాగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల వివరాలు

    వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు నగరాల్లో ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంది. మంగళవారం విజయవాడలో 33 డిగ్రీలు, తిరుపతిలో 34 డిగ్రీలు మరియు విశాఖపట్టణంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఈ నగరాల్లో కూడా వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    అకాల వర్షాల ప్రభావం: పంట నష్టం, రైతుల ఆందోళన

    ఎండాకాలంలో కురుస్తున్న ఈ అకాల వర్షాల వల్ల నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మామిడి రైతులపై ఈ వర్షం ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన గాలుల వల్ల ఇతర పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

    వర్షాల సమయంలో ప్రజలకు ముఖ్య సూచనలు

    ఎండాకాలంలో వచ్చే వర్షాలు పంట నష్టాలను కలిగించడంతో పాటు, అనుకోని ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. కాబట్టి వర్షం పడే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.

    • చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదు.
    • కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాలు, నిర్మాణాల దగ్గర ఉండకూడదు.
    • పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున, వర్షం పడే సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండటం సురక్షితం.
  • టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    TTD VIP Break Darshan Timing: ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఈ రద్దీ మరింత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యం.. బ్రేక్ దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేసింది. రద్దీని తగ్గించడంలో భాగంగా ఈ కొత్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    కొత్త వీఐపీ బ్రేక్ దర్శన నియమాలు (జూలై 15 వరకు)

    టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ‘వీఐపీ’లకు మాత్రమే ఈ రోజు నుంచి (2025 మే 1) జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయం కూడా ఉదయం 5:45 గంటల నుంచి 11 గంటల వరకు పరిమితం చేశారు.

    ప్రత్యేక సేవల రోజుల్లో మినహాయింపు

    కాగా.. శ్రీవారి తిరుప్పాడ సేవ (గురువారం), అభిషేక సేవ (శుక్రవారం) నేపథ్యంలో ఈ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.

    సాధారణ భక్తుల ప్రయోజనం కోసమే ఈ మార్పులు

    నిజానికి.. సాధారణ రోజులలో కంటే కూడా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వేసవి సెలవులు కావడం చేస్తే.. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సాధారణ భక్తుల సంఖ్య పెరగడం వల్ల, వారికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడానికి.. వీఐపీ దర్శనానికి సంబంధించి మార్పులు చేయడం జరిగింది.

    వీఐపీ భక్తుల సంఖ్య పెరిగితే.. సాధారణ భక్తులు తప్పకుండా కొంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. దేవదేవుని దర్శనం కూడా ఆలస్యమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ఈ రోజు (గురువారం) నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయి. అయితే జులై 15 తరువాత ఈ రూల్స్ ఇలాగే కొనసాగుతాయా?, పాత వేళలనే అమలు చేస్తారా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద టీటీడీ యాజమాన్యం సామాన్య భక్తులకు అనుకూలంగా కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.

    ఇతర టీటీడీ సమాచారం & నవీకరణలు

    అక్షయ తృతీయ నాడు రద్దీ

    ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దేవదేవుని దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ క్యూలైన్ కొనసాగింది. దీంతో టోకెన్స్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ఈ రోజు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

    జూన్ నెల ఆన్‌లైన్ సేవా కోటా

    ఇదిలా ఉండగా.. శ్రీవారి సేవలో 2025 జూన్ నెలలో వివిధ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా ఏప్రిల్ 30న విడుదలైంది.

    ముఖ్యమంత్రి సూచనలు & వార్షిక బ్రహ్మోత్సవాలు

    తిరుమల తిరుపతి దేవస్థానాలు సందర్శించే భక్తులకు నాణ్యమైన సేవలను అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కీలక సూచనలు చేశారు. అయితే టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సారి 2025 సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి.