Telangana Polycet 2025: ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. కాగా ప్రస్తుతం పోటీ పరీక్షల కాలం నడుస్తోంది. ఇందులో భాగంగానే రేపు (మంగళవారం, మే 13) తెలంగాణ పాలీసెట్ 2025 పరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ళ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సులు మరియు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లమోలలో ప్రవేశానికి ఈ పరీక్ష రాయడం జరుగుతుంది. పరీక్ష సమయం, పరీక్షలకు వెళ్లేవారు పాటించాల్సిన సూచనలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్ష: హాజరయ్యే విద్యార్థులు
రేపు (మే 13) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 1,06,716 మంది. ఇందులో వివరాలు:
- ఎంపీసీ విద్యార్థుల సంఖ్య: 64,295 మంది
- బైపీసీ విద్యార్థుల సంఖ్య: 42,421 మంది
- మహిళల సంఖ్య: 49,538 మంది
- పురుషుల సంఖ్య: 57,178 మంది
తెలంగాణ పాలిటెక్నిక్ 2025: పరీక్షా విధానం
2025 తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్ష ఇంజినీరింగ్ కోర్సుల వారికి ఈ క్రింది సబ్జెక్టులు ఉంటాయి:
- గణితం (Mathematics): 60 మార్కులు
- ఫిజిక్స్ (Physics): 30 మార్కులు
- కెమిస్ట్రీ (Chemistry): 30 మార్కులు
అగ్రికల్చర్ / హార్టికల్చర్ / వెటర్నరీ కోర్సుల వారికి అదనంగా ఈ సబ్జెక్టు కూడా ఉంటుంది:
- బయాలజీ (Biology): 30 మార్కులు
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య సూచనలు
తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సూచనలను తప్పకుండా పాటించాలి:
1. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోండి
2025 తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్య గమనిక: 11 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.
2. అవసరమైన వస్తువులు మరియు నిషేధిత వస్తువులు
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి), బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
గమనిక: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి పరీక్షా కేంద్రంలోకి ఖచ్చితంగా అనుమతించబడవు. ఈ విషయాలను విద్యార్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
3. ముందస్తు ప్లాన్
తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ప్రయాణానికి తగినంత సమయం కేటాయించుకోవాలి. ఒకవేళ పరీక్ష కేంద్రం గురించి తెలియకపోతే, పరీక్షకు ముందు రోజే మీ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ఉత్తమం. పరీక్ష సమయంలో అనవసరమైన టెన్షన్ నివారించడానికి, పరీక్షా కేంద్రం గురించి ముందే తెలుసుకుని, ఆలస్యం కాకుండా హాజరవ్వాలి. దీనిని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష రాసిన తరువాత.. మే 2025 చివరి నాటికి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. ఏ కాలేజీలో సీటు లభిస్తుంది, ఇతరత్రా వివరాలు తెలుస్తాయి.