Tag: Akshaya Tritiya 2025

  • అక్షయ తృతీయ 2025: ఈ ఒక్కరోజే ఎంత బంగారం కొన్నారో తెలుసా?

    అక్షయ తృతీయ 2025: ఈ ఒక్కరోజే ఎంత బంగారం కొన్నారో తెలుసా?

    Akshaya Tritiya 2025 Gold Sales: బంగారం ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. కొందరు పండుగలకు కొనుగోలు చేస్తే.. మరికొందరు పెళ్లిళ్లకు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయకు మాత్రం దాదాపు అందరూ గోల్డ్ కొనాలని అనుకుంటారు. డబ్బున్నవారు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తే.. మధ్యతరగతి లేదా పేదవారు కనీసం ఒక గ్రామ్ బంగారమైన కొనుగోలు చేయాలని అనుకుంటారు.

    రికార్డు స్థాయిలో బంగారం, వెండి అమ్మకాలు

    ఇలా అనుకోవడం వల్లనే.. నిన్న (అక్షయ తృతీయ 2025) ఒక్క రోజే ఏకంగా భారతదేశంలో ఏకంగా రూ. 16000 కోట్ల విలువైన బంగారం & వెండి అమ్మకాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ధరల పెరుగుదల ఉన్నప్పటికీ.. గోల్డ్ రేటు తులం లక్ష రూపాయలకు చేరువైనప్పటికీ.. కొనుగోలుదారులు మాత్రం అస్సలు తగ్గలేదు. ఎగబడి మరీ బంగారం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇలా కొనుగోలు చేయడంతోనే సుమారు 15 టన్నుల కంటే ఎక్కువ బంగారం అమ్ముడైపోయింది.

    అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి?

    హిందూ క్యాలెండర్ ప్రకారం.. అత్యంత పవిత్రమైన రోజుగా భావించే అక్షయ తృతీయ శ్రేయస్సుకు, అదృష్టం మరియు కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైనది భావిస్తారు. అందులోనూ బంగారం కొనుగోలు చేసి తీసుకొస్తే.. సాక్షాత్తు మహాలక్ష్మినే ఇంటికి తెచ్చినట్లు భావిస్తారు. ఈ కారణంగానే చాలామంది గోల్డ్ కొనుగోలు చేస్తారు.

    పురాణాల ప్రకారం ప్రాముఖ్యత

    పురాణాల ప్రకారం.. ఈ రోజు (అక్షయ తృతీయ) మహా శివుడు కుబేరునికి అపారమైన సంపదను ఇవ్వడమే కాకుండా, లక్ష్మి దేవికి అదృష్ట దేవత అనే బిరుదును కూడా అనుగ్రహించారు. లక్ష్మి అంటే డబ్బు లేదా బంగారం. డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది. బంగారం మాత్రం మనదగ్గరే శాశ్వతంగా ఉంటుందని ఈ పండుగ రోజున బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా పెట్టుకున్నారు.

    మార్కెట్ వర్గాల అంచనాలు

    ఢిల్లీలోని చాందిని చౌక్ పార్లమెంట్ సభ్యుడు మరియు అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) జాతీయ కార్యదర్శి ‘ప్రవీణ్ ఖండేల్వాల్’ మాట్లాడుతూ.. అక్షయ తృతీయ రోజు దేశం మొత్తం మీద రూ. 12000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మరియు సంబంధిత వస్తువులు అమ్ముడయ్యాయి. వెండి వ్యాపారం రూ. 4000 కోట్లు జరిగినట్లు అంచనా అని పేర్కొన్నారు. ధరలు పెరుగుదల ఉన్నప్పటికీ.. బంగారంపై పెట్టుబడి ఉత్తమమని భావిస్తున్న చాలామంది గోల్డ్ కొనుగోలు చేశారని అన్నారు. ధరలు ఇంకా తక్కువగా ఉండి ఉంటే.. బంగారం కొనుగోలు మరింత ఎక్కువగా ఉండేదని స్పష్టం చేశారు.

    గత కొన్నేళ్లుగా బంగారం, వెండి ధరలు

    గత సంవత్సరాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. వాటి వివరాలు:

    • 2022: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 52,700, కేజీ వెండి ధర రూ. 65,000.
    • 2023: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 61,800, కేజీ వెండి ధర రూ. 76,500.
    • 2024: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 74,900 వద్ద నిలిచింది (అక్షయ తృతీయ నాటికి).

    దీన్ని బట్టి చూస్తే.. ప్రతి ఏటా గోల్డ్ రేటు ఎంతగా పెరుగుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఇది పెట్టుబడిగా బంగారం ప్రాముఖ్యతను సూచిస్తుంది.

  • అక్షయ తృతీయ 2025: బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు గోల్డ్ రేటు ఎంతంటే?

    అక్షయ తృతీయ 2025: బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు గోల్డ్ రేటు ఎంతంటే?

    Gold Price: లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనుగోలు చేయాలని వేచి చూస్తున్నవారికి ఇది ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు (2025 ఏప్రిల్ 30) పసిడి రేటు స్వల్పంగా తగ్గింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ధరలు తగ్గకపోయినా, ఇటీవల కాలంలో రేటు పెరగకపోవడమే గుడ్‌న్యూస్.

    ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (ఏప్రిల్ 30, 2025)

    తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర నగరాల్లో

    తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,910గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే, ఈ రోజు ధరలు వరుసగా రూ. 50 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 60 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గాయి. ఇదే ధరలు చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

    ఢిల్లీలో ధరలు

    ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 50 తగ్గి రూ. 89,900 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు 60 రూపాయలు తగ్గి, రూ. 98,040 వద్ద నిలిచింది. నిన్న గరిష్టంగా రూ. 440 పెరిగిన పసిడి ధర ఈ రోజు తగ్గడం గమనార్హం. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

    అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు?

    భారతదేశంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇది కొందరికి సెంటిమెంట్‌గా మారితే, మరికొందరు ఈ రోజు బంగారం కొనడం లేదా దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని, సంపద వృద్ధి చెందుతుందని బలంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకాలే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లను పెంచుతాయి.

    బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

    గతంలో బంగారం ధరలు అందుబాటులోనే ఉండేవి. కానీ కాలక్రమేణా, బంగారం కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, పసిడి నిల్వలు తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగాయి.

    ఇతర కారణాలు:

    • భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు: అంతర్జాతీయంగా జరిగే రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలామంది బంగారంలో పెట్టుబడులు పెడతారు.
    • పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్లలో నష్టాలు వచ్చినప్పుడు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. ఇది కూడా డిమాండ్‌ను, తద్వారా ధరలను పెంచుతుంది.
    • అమెరికా ప్రతీకార సుంకాలు: అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలు వంటివి కూడా పరోక్షంగా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.

    ఇలాంటి కారణాల వల్ల ఇటీవల బంగారం ధర తులం లక్ష రూపాయలు దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.