Tag: Andhra Pradesh

  • 10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    AP Signs MoU with NVIDIA For AI: ఈ రోజు టెక్నాలజీ అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో AI టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీని రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కూడా ప్రవేశపెట్టాలని.. ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీకి ఎన్వీడియా కంపెనీ సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.

    రాష్ట్రంలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియాతో కీలక ఒప్పందం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి, మరో 500 స్టార్టప్‌ల అభివృద్ధికి ఎన్వీడియా కంపెనీతో శుక్రవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఎన్విడియా సహకారం – మంత్రి నారా లోకేష్ చొరవ

    రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు.. ఏఐ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఎన్వీడియా తన సహకారం అందించనుంది. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ ముంబైలో ఎన్వీడియా సీఈఓ ‘జెన్సన్ హుయాంగ్’ను కలిశారు. ఆ సమయంలో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకారం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు హుయాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత ఇప్పటికే ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం జరిగింది.

    ఏపీని ఏఐ రీసెర్చ్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం

    భారతదేశంలో ఏపీని ఏఐ రీసర్చ్ హబ్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నారు.

    ప్రభుత్వ మద్దతు మరియు వనరులు

    ఏఐ యూనివర్సిటీకి కావాల్సిన పరికరాలు (కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ మరియు హార్డ్‌వేర్ సామర్త్యలు) ప్రభుత్వం అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రభుత్వమే విద్యార్థులకు పరిశోధనావకాశాలను, ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

    ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

    రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు:

    • మంత్రి నారా లోకేష్
    • ఎన్వీడియా సౌత్ ఇండియా ఎండీ దూపర్
    • గణేష్ మహబాల
    • ఉన్నత విద్యా కార్యదర్శి
    • ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి

    ఏఐ టెక్నాలజీ: ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ దిశ

    ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రోజు భారతదేశం ఏఐ టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే.. పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

    వివిధ రంగాల్లో ఏఐ అనువర్తనాలు, ఉద్యోగాలపై ప్రభావం

    ఏఐ టెక్నాలజీ ఒక్క ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఎడ్యుకేషన్, మీడియా, టెలి కమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా విస్తరించి ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది గతంలోనూ.. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ టెక్నాలజీ పనిని వేగవంతం చేయడానికి పనికొస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యోగులు లేదా ఉద్యోగార్థులు మారుతున్న ప్రపంచంలో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేర్చుకోవడం ఉత్తమం.

  • సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    Yogandra 2025: ప్రపంచ దేశాలకు భారతదేశం గురువు అని ఎన్నో గ్రంధాలు పేర్కొన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను మాత్రమే కాకుండా, యోగ వంటి గొప్ప విధానాలతో భాసిల్లుతున్న భారత్, గొప్ప తాత్విక వేత్తలకు, గురువులకు నిలయంగా భాసిల్లుతోంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న యోగాను దేశం మొత్తం అవలంబించేలా ప్రధాని మోదీ చర్య తీసుకున్నారు. ఈ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. రాబోయే యోగ దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు.

    యోగాంధ్ర 2025: నెల రోజుల యోగా మహోత్సవం

    జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజులపాటు (జూన్ 21 నుంచి) నిరవహించే ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర 2025’ (Yogandra 2025) పేరుతో చేపడతామని ఆయన అన్నారు. యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ నినాదంతో, ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    విశాఖలో భారీ యోగా ప్రదర్శన: లక్షలాది మంది భాగస్వామ్యం

    విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాదిమంది యోగాసనాలు వేయనున్నారు. దీనికి ప్రముఖ యోగ గురువులు హాజరవుతారు. వీరందరిని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యోగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేసారు.

    పది లక్షల మందికి యోగా శిక్షణ, పోటీలు

    జూన్ 21 నుంచి నిర్వహించనున్న నెల రోజుల యోగా కార్యక్రమాల్లో భాగంగానే సుమారు 10 లక్షల మందికి యోగా నేర్పించడమే కాకుండా, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వీరందరినీ యోగా దినోత్సవం రోజున రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా చేస్తామని సీఎం అన్నారు. నెలరోజుల పాటు యోగాకు సంబంధించిన పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి, విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

    విద్యా వ్యవస్థలో, దైనందిన జీవితంలో యోగా

    వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్ 21 వరకు ఉదయం ఒక గంటసేపు పిల్లలకు యోగా తరగతులు బోధించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో యోగాను పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చనున్నట్లు ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పార్యటక స్థలాల్లో కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద హోటళ్లలో కూడా యోగా కోసం స్థలాన్ని కేటాయించేలా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

    యోగా ప్రాముఖ్యత – ప్రధాని మోదీ చొరవ

    భారతదేశంలో యోగాకు ఎనలేని చరిత్ర ఉన్నప్పటికీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల వెలుగులోకి వచ్చింది. యోగా అనేది ఒక కులానికి లేదా మతానికి మాత్రమే పరిమితం కాదు. యోగా అనేది సైన్స్, మనిషి జీవితంలో యోగా ఒక భాగమైనప్పుడే ఆరోగ్యం సాధ్యమవుతుంది. మోదీ ప్రతి ఏటా యోగా దినోత్సవం రోజు తానే స్వయంగా యోగా చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా దినోత్సవం జరుగుతూనే ఉంది.