Leapmotor India Entry: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. దేశీయ దిగ్గజాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కంపెనీలు కూడా భారతీయ విఫణిలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా, మరో చైనా కంపెనీ ‘లీప్మోటర్’ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఆ చైనా కంపెనీ ఏది?, అది ఎలాంటి వెహికల్స్ తయారు చేస్తుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
స్టెల్లాంటిస్ ద్వారా భారత్లో లీప్మోటర్ ప్రవేశం
గ్లోబల్ ఆటోమోటివ్ దిగ్గజం స్టెల్లాంటిస్.. ఎనర్జీ వెహికల్ తయారీ సంస్థ ‘లీప్మోటర్’ను (ఇది స్టెల్లాంటిస్ గ్రూప్ కంపెనీ) భారతదేశానికి తీసుకురావడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. స్టెల్లాంటిస్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో జీప్ మరియు సిట్రోయెన్ బ్రాండ్లతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
లీప్మోటర్ ప్రత్యేకత: సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీ
2015లో స్థాపించబడిన ‘లీప్మోటర్’, 2022 నుంచి పెద్ద ఎత్తున సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీని అమలు చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అని స్టెల్లాంటిస్ పేర్కొంది. ఈ కంపెనీ (లీప్మోటర్) భారతీయ విఫణిలోకి అడుగుపెట్టిన తరువాత ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించనుంది.
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లీప్మోటర్ తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, తన ఉనికిని చాటుకుంటుందని స్టెల్లాంటిస్ అధికారికంగా వెల్లడించింది. లీప్మోటర్ తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను లాంచ్ చేస్తుంది. కంపెనీ లాంచ్ చేయబోయే కార్లు అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ బ్రాండ్ కార్లు డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో ఇతర కంపెనీలకు ఏ మాత్రం తీసిపోవు.
గ్లోబల్ మార్కెట్లో లీప్మోటర్ విజయం
2024లో గ్లోబల్ మార్కెట్లో లీప్మోటార్ సుమారు మూడు లక్షల వాహనాలను డెలివరీ చేసింది. ఈ సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు అని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఈ బ్రాండ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ ఏమన్నారు?
“జీప్, సిట్రోయెన్ బ్రాండ్లతో ఇప్పటికే భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాము. తాజాగా లీప్మోటర్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది అని ప్రకటించడం సంతోషంగా ఉంది” అని స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ హజేలా అన్నారు. “భారతదేశంలో తప్పకుండా మా ఉనికిని చాటుకోవడం మాత్రమే కాకుండా, ప్రజల అవసరాలకు అనువైన ఉత్పత్తులను ప్రవేశపెడతాము” అని ఆయన అన్నారు.
భారత మార్కెట్లో ఆదరణ పొందుతుందా?
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో లీప్మోటార్ వంటి విజయవంతమైన కంపెనీ దేశీయ విఫణిలోకి అడుగుపెట్టడం మంచి పరిణామం. కొత్త బ్రాండ్ వాహనాలను కోరుకునేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.
లీప్మోటార్ కంపెనీ ఎలాంటి వాహనాలను లాంచ్ చేస్తుందనేది ఆసక్తికరం. తక్కువ ధర వద్ద వాహనాలను అందిస్తుందా? లేదా లగ్జరీ సెగ్మెంట్లో ప్రవేశిస్తుందా? అలాగే, భారత మార్కెట్ కోసం ఎలాంటి ప్రత్యేక టెక్నాలజీలను తమ వాహనాల్లో అందిస్తుందనే విషయాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆశిస్తున్నాము.