Tag: Hyderabad Metro

  • హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ఖరారు: కొత్త చార్జీలు ఇవే..

    హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ఖరారు: కొత్త చార్జీలు ఇవే..

    Hyderabad Metro Rail to Hike Ticket Fares: ఎట్టకేలకు హైదరాబద్ మెట్రో చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి (మే 17, శనివారం) నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ఛార్జీలు కనిష్టంగా 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెరుగగా, గరిష్ట ఛార్జీలు రూ. 60 నుంచి రూ. 75కు చేరాయి. దీని ప్రకారం, మెట్రో ప్రయాణ ధరలు సుమారు 25 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది. ఈ ఛార్జీల పెరుగుదల రోజూ మెట్రోలో ప్రయాణించే సుమారు ఐదు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది.

    కొత్త మెట్రో ఛార్జీల పూర్తి వివరాలు (రూపాయలలో)

    ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 60 మధ్య ఉన్నాయి. సవరించిన ఛార్జీల ప్రకారం వివిధ దూరాలకు ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    • 2 కిలోమీటర్ల వరకు: రూ. 12
    • 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు: రూ. 30
    • 6 కిమీ నుంచి 9 కిమీ వరకు: రూ. 40
    • 9 కిమీ నుంచి 12 కిమీ వరకు: రూ. 50
    • 12 కిమీ నుంచి 15 కిమీ వరకు: రూ. 55
    • 18 కిమీ నుంచి 21 కిమీ వరకు: రూ. 66
    • 21 కిమీ నుంచి 24 కిమీ వరకు: రూ. 70
    • 24 కిమీ కంటే ఎక్కువ దూరం: రూ. 75

    ఈ నూతన ఛార్జీల పట్టికను ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది.

    ఛార్జీల పెంపునకు కారణాలు మరియు నేపథ్యం

    రెండేళ్ల నిరీక్షణ తరువాత ధరల సవరణ

    మెట్రో రైల్వేస్ చట్టం 2002 ప్రకారం, ఛార్జీలను సవరించడానికి లేదా కొత్త ధరలను అమలు చేయడానికి 2022లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) ఏర్పాటైంది. ఈ కమిటీ 2023 జనవరి 25న సవరించిన ఛార్జీలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఛార్జీల పెరుగుదల గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

    ఎల్ & టీ మెట్రో రైల్ స్పందన

    హైదరాబాద్ మెట్రో రైలు సేవలను మరింత నాణ్యతతో, మెరుగైన సౌకర్యాలతో అందించడానికి ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఎల్ & టీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. “ప్రయాణికులు ఈ మార్పునకు సహకరించి, మద్దతు అందించాలని ఆశిస్తున్నాము,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    ప్రయాణికుల అభిప్రాయాలు

    ఛార్జీల పెరుగుదలపై కొందరు ప్రయాణికులు స్పందిస్తూ, ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ధరల పెంపు కొంతవరకు సమర్థనీయమేనని, అయితే అదే సమయంలో మెట్రో రైళ్లలో కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు.

    ఇతర నగరాల మెట్రో ఛార్జీల పరిస్థితి

    ఇప్పటికే దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ఢిల్లీ మెట్రో రెండుసార్లు ఛార్జీలను పెంచింది. బెంగళూరు మెట్రో కూడా సుమారు 45 శాతం మేర ఛార్జీలను పెంచడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఇప్పుడు ధరల సవరణను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

    భవిష్యత్ ప్రణాళికలు

    రోజురోజుకూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

  • పెరగనున్న మెట్రో ఛార్జీలు: కొత్త ధరలు ఇలా..

    పెరగనున్న మెట్రో ఛార్జీలు: కొత్త ధరలు ఇలా..

    Hyderabad Metro Fare Hike: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రయాణం చాలా వరకు సులభతరమైంది. ఒకింత మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. గమ్యాన్ని తొందరగా చేరడానికి మెట్రో ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ నుంచి బయటపడటానికి మెట్రో ఓ సులభమైన మార్గం. ఈ కారణాల వల్లనే చాలామంది మెట్రోలలో ప్రయాణిస్తున్నారు.

    మెట్రో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

    అయితే మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ కంపెనీ షాకిచ్చింది. ఒక్కసారిగా మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను స్వల్పంగా పెంచనున్నట్లు ఎల్ అండ్ టీ ఇప్పటికే వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

    ఛార్జీల పెంపు ఎప్పుడు అమలులోకి రానుంది?

    కాగా ప్రస్తుతం ఎల్ అండ్ టీ చైర్మన్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల, మెట్రో కొత్త చార్జీలు మే రెండో వారంలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

    ప్రస్తుత, ప్రతిపాదిత ఛార్జీలు ఎంత?

    ప్రస్తుతం మెట్రో ఛార్జీలు కనిష్టంగా రూ. 10 నుంచి.. గరిష్టంగా రూ. 60 వరకు ఉంది. మెట్రో ఛార్జీలను పెంచడం ద్వారా ఎల్ అండ్ టీ కంపెనీ సుమారు రూ. 150 కోట్ల ఆదాయం రాబట్టుకునేందుకు సన్నద్ధమవుతోంది. తాజా పెంపు తర్వాత గరిష్ట ఛార్జీ రూ. 75కు చేరనుంది. దీన్ని బట్టి చూస్తే గరిష్టంగా 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఎలా పెంచుతుందని విషయం త్వరలోనే వెల్లడవుతుంది.

    ఛార్జీల పెంపునకు కారణాలు ఏమిటి?

    హైదరాబాద్ మెట్రో ఆపరేటర్స్, ప్రకటనలు, మాల్స్ అద్దెల ద్వారా ఎల్ అండ్ టీ ప్రతి ఏటా సుమారు రూ. 150 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే మెట్రో మెయింటెనెన్స్ మరియు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం ఏడాదికి రూ. 2వేల కోట్లు ఉందని ఎల్ అండ్ టీ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం కారణంగానే మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుత మెట్రో సేవలు మరియు రద్దీ

    ప్రస్తుతం నగరంలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, ఎంజీ బస్ స్టేషన్ నుంచి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ వరకు.. నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 57 మెట్రో ట్రైన్లు ప్రస్తుతం రోజూ నగరంలో ప్రయాణిస్తున్నాయి.

    ఈ మెట్రో ట్రైన్ల ద్వారా ప్రతి రోజూ నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే వారాంతంలో ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా ఉంటుంది.

    భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు

    హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టు రెండో దశ పనులు వేగవంతమవుతున్నాయి.

    మెట్రో ఫేజ్ 2 ‘బి’

    రెండో దశ ‘బీ’లో భాగంగా ముఖ్యమైన మార్గాలకు సంబంధించిన నివేదిక సిద్ధమైంది. దీనిని హైదరాబాద్ మెట్రో ఆమోదించాల్సి ఉంది. ఇందులో హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో మెట్రో సేవలను విస్తరించే ప్లాన్స్ ఉన్నాయి.

    ప్రతిపాదిత కొత్త రూట్లు

    రాబోయే రోజుల్లో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి మేడ్చల్ వరకు 24 కిమీ.. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 21 కిమీ మార్గం మరియు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు (సుమారు 40 కిమీ) మెట్రో మార్గం ఏర్పడనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నగరవాసుల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.