Hyderabad Metro Fare Hike: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రయాణం చాలా వరకు సులభతరమైంది. ఒకింత మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. గమ్యాన్ని తొందరగా చేరడానికి మెట్రో ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ నుంచి బయటపడటానికి మెట్రో ఓ సులభమైన మార్గం. ఈ కారణాల వల్లనే చాలామంది మెట్రోలలో ప్రయాణిస్తున్నారు.
మెట్రో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
అయితే మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ కంపెనీ షాకిచ్చింది. ఒక్కసారిగా మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను స్వల్పంగా పెంచనున్నట్లు ఎల్ అండ్ టీ ఇప్పటికే వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.
ఛార్జీల పెంపు ఎప్పుడు అమలులోకి రానుంది?
కాగా ప్రస్తుతం ఎల్ అండ్ టీ చైర్మన్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల, మెట్రో కొత్త చార్జీలు మే రెండో వారంలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుత, ప్రతిపాదిత ఛార్జీలు ఎంత?
ప్రస్తుతం మెట్రో ఛార్జీలు కనిష్టంగా రూ. 10 నుంచి.. గరిష్టంగా రూ. 60 వరకు ఉంది. మెట్రో ఛార్జీలను పెంచడం ద్వారా ఎల్ అండ్ టీ కంపెనీ సుమారు రూ. 150 కోట్ల ఆదాయం రాబట్టుకునేందుకు సన్నద్ధమవుతోంది. తాజా పెంపు తర్వాత గరిష్ట ఛార్జీ రూ. 75కు చేరనుంది. దీన్ని బట్టి చూస్తే గరిష్టంగా 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఎలా పెంచుతుందని విషయం త్వరలోనే వెల్లడవుతుంది.
ఛార్జీల పెంపునకు కారణాలు ఏమిటి?
హైదరాబాద్ మెట్రో ఆపరేటర్స్, ప్రకటనలు, మాల్స్ అద్దెల ద్వారా ఎల్ అండ్ టీ ప్రతి ఏటా సుమారు రూ. 150 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే మెట్రో మెయింటెనెన్స్ మరియు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం ఏడాదికి రూ. 2వేల కోట్లు ఉందని ఎల్ అండ్ టీ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం కారణంగానే మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మెట్రో సేవలు మరియు రద్దీ
ప్రస్తుతం నగరంలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, ఎంజీ బస్ స్టేషన్ నుంచి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ వరకు.. నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 57 మెట్రో ట్రైన్లు ప్రస్తుతం రోజూ నగరంలో ప్రయాణిస్తున్నాయి.
ఈ మెట్రో ట్రైన్ల ద్వారా ప్రతి రోజూ నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే వారాంతంలో ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా ఉంటుంది.
భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టు రెండో దశ పనులు వేగవంతమవుతున్నాయి.
మెట్రో ఫేజ్ 2 ‘బి’
రెండో దశ ‘బీ’లో భాగంగా ముఖ్యమైన మార్గాలకు సంబంధించిన నివేదిక సిద్ధమైంది. దీనిని హైదరాబాద్ మెట్రో ఆమోదించాల్సి ఉంది. ఇందులో హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో మెట్రో సేవలను విస్తరించే ప్లాన్స్ ఉన్నాయి.
ప్రతిపాదిత కొత్త రూట్లు
రాబోయే రోజుల్లో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి మేడ్చల్ వరకు 24 కిమీ.. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 21 కిమీ మార్గం మరియు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు (సుమారు 40 కిమీ) మెట్రో మార్గం ఏర్పడనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నగరవాసుల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.