First Tesla Cybertruck India: అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ దేశంలో తన కారును టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో.. సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి ‘లవ్జీభాయ్ బాద్షా’ (Lavjibhai Badshah) సైబర్ ట్రక్ కొనుగోలు చేసింది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ కావడం గమనార్హం.
సైబర్ ట్రక్ ఓనర్: లవ్జీభాయ్ బాద్షా ఎవరు?
భారతదేశపు మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ కొనుగోలు చేసిన లవ్జీభాయ్ బాద్షా.. గుజరాత్లోని భావ్నగర్కు చెందినవారు. ఈయన ప్రారంభ జీవితం.. వజ్రాల కర్మాగారంలో కార్మికుడిగా మొదలైంది. నేడు ఒక వజ్రాల పరిశ్రమకే అధినేత అయ్యాడు.
భారత్కు సైబర్ ట్రక్ ప్రయాణం ఎలా జరిగింది?
లవ్జీభాయ్ బాద్షా కొనుగోలు చేసిన సైబర్ ట్రక్ను.. ఆరు నెలల కింద అమెరికాలోని టెక్సాస్లోని టెస్లా షోరూమ్లో బుక్ చేసుకున్నారు. అన్ని ప్రక్రియలోనూ.. పూర్తయిన తరువాత కారు డెలివరీ అయింది. ఈ కారును దుబాయ్కు తీసుకెళ్లి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత.. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అయింది. మొత్తానికి అనుకున్న విధంగా.. ఇండియాకు మొదటి టెస్లా సైబర్ ట్రక్ వచ్చేసింది.
టెస్లా సైబర్ ట్రక్: ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా లాంచ్ చేసిన సైబర్ ట్రక్.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కార్ల కంటే భిన్నంగా ఉంది. ఈ కారు గురించి సంస్థ చాలా ఏళ్లుగా చెబుతూనే ఉన్నప్పటికీ.. 2023లో అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయింది. ఇది దృఢమైన డిజైన్ కలిగి, అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ధర మరియు రేంజ్
టెస్లా సైబర్ ట్రక్ ధరలు రూ. 50.70 లక్షల నుంచి రూ. 88 లక్షల మధ్య ఉన్నాయి (అంతర్జాతీయ ధరల ఆధారంగా, భారతదేశ ధరలు మారవచ్చు). ఈ కారు 122.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 550 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తప్పకుండా 500 కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.
వేగం మరియు ఛార్జింగ్
ఇది 2.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 209 కిమీ / గం కావడం గమనార్హం. సైబర్ ట్రక్ ఒకేసారి ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం.. ఆరు గంటల కంటే ఎక్కువని తెలుస్తోంది.
భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ
టెస్లా కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి చాన్నాళ్లుగా వేచి చూస్తూనే ఉంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారభించడానికి సిద్ధమైంది. కంపెనీ మోడల్ 3 లేదా మోడల్ వై కార్లను భారతీయ కస్టమర్ల కోసం లాంచ్ చేసే అవకాశం ఉంది. వీటి ధరలు, లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
హైవేపై కనిపించిన సైబర్ ట్రక్?
కాగా ఇటీవల ఒక సైబర్ ట్రక్ కూడా ముంబై – పూణే నేషనల్ హైవే మీద కనిపించింది. బహుశా అదే కారును లవ్జీభాయ్ బాద్షా కొనుగోలు చేశారా? అనే అనుమానం తలెత్తుతోంది. ఇది ఎంత వరకు నిజమో.. కాదో తెలియాల్సి ఉంది.