Category: Education

  • పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త: IIIT దరఖాస్తు గడువు పెంపు

    పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త: IIIT దరఖాస్తు గడువు పెంపు

    AP IIIT Admission Deadline Extended: పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులలో కొందరు ఇంటర్మీడియట్ చేస్తారు, మరికొందరు డిప్లమో చేస్తారు, ఇంకొందరు ఐఐఐటీ (IIIT)లో చేరతారు. ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ట్రిపుల్ ఐటీలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఐఐఐటీలో చేరడానికి (అప్లై చేసుకోవడానికి) ఆఖరి గడువును పెంచుతూ తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఎక్కువ మార్కులు తెచ్చుకుని, ఇప్పటికీ అప్లై చేయకుండా ఉన్న విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. కొత్త షెడ్యూల్ వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ట్రిపుల్ ఐటీ దరఖాస్తు గడువు పొడిగింపు: కొత్త తేదీలు ఇవే!

    ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి అప్లై చేసుకోవడానికి చివరి గడువు మే 20వ తేదీతో ముగిసింది. అప్లై చేసుకున్న విద్యార్థులకు, షెడ్యూల్ ప్రకారం జూన్ 5నాటికి ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, 10వ తరగతి ఫలితాల్లో ఏర్పడిన కొన్ని అవకతవకల కారణంగా అధికారులు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.

    ముఖ్యమైన తేదీలు (తాజా షెడ్యూల్ ప్రకారం):

    • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10
    • ఫలితాల వెల్లడి (అంచనా): జూన్ 20

    కొత్త షెడ్యూల్ మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ తేదీని బహుశా మళ్ళీ పెంచే అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం మంచిది.

    గడువు పొడిగింపునకు కారణం: పదవ తరగతి ఫలితాల్లో అవకతవకలు

    నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో కొన్ని అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. మార్కుల రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం ఏకంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 18 శాతం (11,175) జవాబు పత్రాలలో మార్కులలో మార్పులు జరిగాయి. దీంతో కొందరు విద్యార్థులకు మరిన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.

    అధిక మార్కులు వచ్చిన విద్యార్థులు ‘ఐఐఐటీ’కి అప్లై చేసుకోవడానికి అర్హత పొందారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ తేదీలను ప్రభుత్వం పొడిగించడం జరిగింది.

    రీవెరిఫికేషన్ తర్వాత మార్పులు: విద్యార్థులకు పెరిగిన మార్కులు

    ఈ ఏడాది రాష్ట్రంలో 6,14,459 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత కొందరు విద్యార్థులు జవాబు పత్రాల రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకోగా, మరికొంతమంది రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ తరువాత కొంతమంది విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరిగాయి.

    కొన్ని ఉదాహరణలు:

    • బాపట్ల జిల్లా కొల్లూరు ఉన్నత పాఠశాలకు చెందిన తేజస్విని అనే అమ్మాయికి 5 సబ్జెక్టులలో 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే, సాంఘిక శాస్త్రంలో మాత్రం 23 మార్కులతో ఫెయిల్ అయినట్లు రిజల్ట్స్ వచ్చాయి. ఆ అమ్మాయి రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోగా, సాంఘిక శాస్త్రంలో 96 మార్కులు వచ్చాయి.
    • అలాగే, కర్నూలు జిల్లా సీ బెళగల్ మండలంలోని సంఘాల ఉన్నత పాఠశాలకు చెందిన ప్రేమవర్ణ అనే అమ్మాయికి సాంఘిక శాస్త్రంలో 77 మార్కులు వచ్చాయి. రీవెరిఫికేషన్ తరువాత అదనంగా 16 మార్కులు కలిశాయి. దీంతో ఈమెకు మొత్తంగా 93 మార్కులు వచ్చాయి.

    కొంతమంది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్ తరువాత ఉత్తీర్ణత సాధించారు. ఈ కారణాల వల్ల ఐఐఐటీ మాత్రమే కాకుండా, ఇతర కోర్సులకు సంబంధించిన ప్రవేశ గడువులు కూడా పొడిగించడం జరిగింది.

  • ఐసెట్ 2025 ఫలితాలు వచ్చేశాయ్: టాపర్స్ లిస్ట్ ఇదే..

    ఐసెట్ 2025 ఫలితాలు వచ్చేశాయ్: టాపర్స్ లిస్ట్ ఇదే..

    AP ICET 2025 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ (AP ICET) 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 7న జరిగిన ఈ పరీక్షలో సుమారు 96 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. ఈ ఫలితాలను విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన మొత్తం 34,131 మంది విద్యార్థులలో 32,719 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

    ఏపీ ఐసెట్ 2025 ఫలితాలపై మంత్రి నారా లోకేష్ అభినందనలు

    ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు విడుదలైన సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్’ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షలో 95.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంటూ, విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

    ఏపీ ఐసెట్ 2025: ముఖ్య గణాంకాలు

    ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు సంబంధించిన కీలక గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి:

    • మొత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు: 37,572
    • పరీక్షకు హాజరైన అభ్యర్థులు: 34,131
    • అర్హత సాధించిన అభ్యర్థులు: 32,719
    • అర్హత సాధించిన అబ్బాయిలు: 15,176
    • అర్హత సాధించిన అమ్మాయిలు: 17,543
    • పరీక్ష జరిగిన తేదీ: మే 7, 2025
    • మొత్తం పరీక్షా కేంద్రాలు: 94

    ఏపీ ఐసెట్ 2025 టాప్ 10 ర్యాంకర్లు వీరే!

    ఐసెట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 ర్యాంకర్ల జాబితా:

    1. మనోజ్ మేకా (విశాఖ)
    2. ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్ఆర్ కడప)
    3. ఎస్. కృష్ణసాయి (ఎన్టీఆర్ జిల్లా)
    4. వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్)
    5. రేవూరి మాధుర్య (గుంటూరు)
    6. షేక్ బహీరున్నీషా (అనకాపల్లి)
    7. వి. అజయ్ కుమార్ (తిరుపతి)
    8. భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పు గోదావరి)
    9. ఎస్.గణేష్ రెడ్డి (విశాఖపట్నం)
    10. మహేంద్ర సాయి చామా (తిరుపతి)

    తదుపరి ప్రక్రియ: ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2025

    ఐసెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2025 ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ మరియు ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

    ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

    అభ్యర్థులు తమ ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. దాని కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    1. ముందుగా ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. (ఉదా: cets.apsche.ap.gov.in/ICET)
    2. హోమ్ పేజీలో “AP ICET 2025 Results” లేదా “ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
    3. తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
    4. మీరు సాధించిన మార్కులు మరియు ర్యాంక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
    5. భవిష్యత్ అవసరాల కోసం మీ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవడం మంచిది.
  • రేపే పాలిసెట్ 2025 పరీక్ష: విద్యార్థులకు ముఖ్య సూచనలు

    రేపే పాలిసెట్ 2025 పరీక్ష: విద్యార్థులకు ముఖ్య సూచనలు

    Telangana Polycet 2025: ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. కాగా ప్రస్తుతం పోటీ పరీక్షల కాలం నడుస్తోంది. ఇందులో భాగంగానే రేపు (మంగళవారం, మే 13) తెలంగాణ పాలీసెట్ 2025 పరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ళ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సులు మరియు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లమోలలో ప్రవేశానికి ఈ పరీక్ష రాయడం జరుగుతుంది. పరీక్ష సమయం, పరీక్షలకు వెళ్లేవారు పాటించాల్సిన సూచనలను ఇక్కడ తెలుసుకుందాం.

    తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్ష: హాజరయ్యే విద్యార్థులు

    రేపు (మే 13) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 1,06,716 మంది. ఇందులో వివరాలు:

    • ఎంపీసీ విద్యార్థుల సంఖ్య: 64,295 మంది
    • బైపీసీ విద్యార్థుల సంఖ్య: 42,421 మంది
    • మహిళల సంఖ్య: 49,538 మంది
    • పురుషుల సంఖ్య: 57,178 మంది

    తెలంగాణ పాలిటెక్నిక్ 2025: పరీక్షా విధానం

    2025 తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్ష ఇంజినీరింగ్ కోర్సుల వారికి ఈ క్రింది సబ్జెక్టులు ఉంటాయి:

    • గణితం (Mathematics): 60 మార్కులు
    • ఫిజిక్స్ (Physics): 30 మార్కులు
    • కెమిస్ట్రీ (Chemistry): 30 మార్కులు

    అగ్రికల్చర్ / హార్టికల్చర్ / వెటర్నరీ కోర్సుల వారికి అదనంగా ఈ సబ్జెక్టు కూడా ఉంటుంది:

    • బయాలజీ (Biology): 30 మార్కులు

    పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య సూచనలు

    తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సూచనలను తప్పకుండా పాటించాలి:

    1. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోండి

    2025 తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్య గమనిక: 11 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.

    2. అవసరమైన వస్తువులు మరియు నిషేధిత వస్తువులు

    పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి), బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

    గమనిక: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి పరీక్షా కేంద్రంలోకి ఖచ్చితంగా అనుమతించబడవు. ఈ విషయాలను విద్యార్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

    3. ముందస్తు ప్లాన్

    తెలంగాణ పాలిటెక్నిక్ 2025 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ప్రయాణానికి తగినంత సమయం కేటాయించుకోవాలి. ఒకవేళ పరీక్ష కేంద్రం గురించి తెలియకపోతే, పరీక్షకు ముందు రోజే మీ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ఉత్తమం. పరీక్ష సమయంలో అనవసరమైన టెన్షన్ నివారించడానికి, పరీక్షా కేంద్రం గురించి ముందే తెలుసుకుని, ఆలస్యం కాకుండా హాజరవ్వాలి. దీనిని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష రాసిన తరువాత.. మే 2025 చివరి నాటికి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. ఏ కాలేజీలో సీటు లభిస్తుంది, ఇతరత్రా వివరాలు తెలుస్తాయి.

  • తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025: ఫీజు గడువు & టైమ్‌టేబుల్

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025: ఫీజు గడువు & టైమ్‌టేబుల్

    Telangana Inter Supplementary Exams 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

    అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం, ఫీజు చెల్లింపు గడువును 2025 మే 8 (గురువారం) వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే, విద్యార్థులు ఈ రోజులోగా ఫీజు చెల్లించి తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత, ఆలస్య రుసుము రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ తేదీలోగా ఫీజు చెల్లించని పక్షంలో, విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హత కోల్పోయి, మరో ఏడాది వేచి చూడాల్సి వస్తుంది.

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2025

    ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) మే 22, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు ఒకే తేదీ నుంచి జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:

    ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2025

    • 2025 మే 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
    • 2025 మే 23: ఇంగ్లీష్ పేపర్ 1
    • 2025 మే 24: గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం (బోటనీ) పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
    • 2025 మే 25: గణితం పేపర్ 1బీ, జంతుశాస్త్రం (జువాలజీ) పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
    • 2025 మే 26: భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
    • 2025 మే 27: రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) పేపర్ 1, కామర్స్ పేపర్ 1
    • 2025 మే 28: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1
    • 2025 మే 29: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

    ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2025

    • 2025 మే 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
    • 2025 మే 23: ఇంగ్లీష్ పేపర్ 2
    • 2025 మే 24: గణితం పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
    • 2025 మే 25: గణితం పేపర్ 2బీ, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
    • 2025 మే 26: ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
    • 2025 మే 27: కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
    • 2025 మే 28: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2
    • 2025 మే 29: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2

    తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 రెగ్యులర్ ఫలితాల వివరాలు

    తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మొదటి మరియు రెండవ సంవత్సరం రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ 2025 ఏప్రిల్ 22న అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2025 మార్చి 5 నుంచి 2025 మార్చి 25 వరకు 1532 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం విద్యార్థులలో 66.89% ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరం విద్యార్థులలో 71.37% ఉత్తీర్ణత సాధించారు.

  • నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    NEET UG 2025 Hall Ticket: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎట్టకేలకు ఈ రోజు (2025 ఏప్రిల్ 30) నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకున్నవారు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎగ్జామ్ తేదీ, సమయం వంటి వివరాలతో పాటు.. హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    నీట్ 2025 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియ (NEET 2025 Admit Card Download Process)

    1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) ఓపెన్ చేయాలి.
    2. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. లేటెస్ట్ న్యూస్ (Latest News) విభాగం కనిపిస్తుంది. దానికి పక్కనే ‘Admit Card for NEET (UG) – 2025 is Live‘ అనే లింక్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి.
    3. క్లిక్ చేసిన తరువాత ఒక కొత్త పీజీ ఓపెన్ అవుతుంది.
    4. కొత్త పేజీలో, మీకు ఎరుపు రంగులో ‘NEET (UG)-2025 Admit Card‘ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి.
    5. ఇప్పుడు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కావలసిన పేజీ ఓపెన్ అవుతుంది.
    6. ఈ పేజీలో మీ అప్లికేషన్ నెంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password), మరియు క్యాప్చా (Security Pin) ఎంటర్ చేసి, సబ్మిట్ (Submit) బటన్ క్లిక్ చేయాలి.
    7. ఇవన్నీ పూర్తయిన తరువాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ సెంటరుకు తీసుకెళ్లవచ్చు.

    ముఖ్య సమాచారం (Important Information on Hall Ticket)

    మీరు డౌన్‌లోడ్ చేసుకునే హాల్ టికెట్లోనే మీ రోల్ నెంబర్, పరీక్షా కేంద్రం (Exam Center) చిరునామా వంటి వివరాలతో పాటు, ఎగ్జామ్ సెంటరుకు వెళ్లే ముందు పాటించాల్సిన సూచనలు, తీసుకెళ్లాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్స్ మొదలైనవి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చదివి, దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరయ్యే ముందు వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు (ఉదాహరణకు పేరు, ఫోటో, సంతకం) ఉంటే వెంటనే NTA హెల్ప్‌లైన్‌కు నివేదించాలి.

    అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important Instructions for Candidates)

    • నీట్ 2025 పరీక్ష మే 4వ తేదీ (ఆదివారం) జరుగుతుంది.
    • దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.
    • పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ & పేపర్) మోడ్‌లో జరుగుతుంది. పెన్ను, పేపర్ పరీక్షా కేంద్రంలోనే అందిస్తారు, అభ్యర్థులు బయటి నుంచి తీసుకురాకూడదు.
    • పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని (కలర్ లేదా బ్లాక్ & వైట్), చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా నింపి తీసుకెళ్లాలి.
    • అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు), స్టడీ మెటీరియల్స్, బ్యాగులు వంటివి అనుమతించబడవు.

    నీట్ యూజీ పరీక్ష గురించి (About NEET UG Exam)

    ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), ఆయుష్ (BAMS, BUMS, BSMS) మరియు నర్సింగ్ (B.Sc Nursing), ఇతర అనుబంధ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నీట్ యూజీ (NEET UG) ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంక్ ఆధారంగానే ఆయా కోర్సులలో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ (neet.nta.nic.in)ను తనిఖీ చేస్తూ ఉండండి.