టీటీడీ గొప్ప అవకాశం: VIP దర్శనం ఉచితంగా పొందండిలా..

TTD Govinda Koti Scheme: యువతలో రోజురోజుకి ఆధ్యాత్మిక చింతన కనుమరుగైపోతోంది. దీనిని మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు వినూత్న పద్దతిని అమలులోకి తీసుకొచ్చారు. ఎవరైతే గోవింద కోటి రాస్తారో.. వారికి ఉచితంగా వీఐపీ దర్శనం కల్పిస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

గోవింద కోటి అంటే ఏమిటి? TTD వినూత్న పథకం

నిజానికి చాలామందికి రామకోటి మాత్రమే తెలుసు. ఈ తరహాలోనే టీటీడీ యాజమాన్యం గోవింద కోటి తీసుకొచ్చించి. ఈ పథకం ద్వారా యువతలో భక్తి భావాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశ్యం.

VIP దర్శనం పొందే విధానాలు:

  • కుటుంబంతో సహా VIP దర్శనం: 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న యువత గోవింద కోటి (కోటిసార్లు గోవింద నామం) రాస్తారో.. అలాంటి వారికి, వారి ఫ్యామిలీతో సహా వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.
  • వ్యక్తిగత VIP బ్రేక్ దర్శనం: ఎవరైనా 10,01,116 (పది లక్షల వెయ్యి నూట పదహారు) సార్లు గోవింద నామం రాస్తారో.. అలాంటి వారికి (రాసిన వ్యక్తికి మాత్రమే) వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది.

గోవింద కోటి పుస్తకాలు మరియు నియమాలు

పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి?

గోవింద కోటి రాయాలనుకునే వారికోసం కావాల్సిన పుస్తకాలు.. టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్‌లో లభిస్తాయి.

పుస్తకాల వివరాలు మరియు పూర్తి చేయడానికి పట్టే సమయం:

ఒక్కో పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఇలాంటి ఒక పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు.

  • 10,01,116 నామాలు రాయడానికి సుమారు 26 పుస్తకాలు అవసరమవుతాయి. ఈ పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.
  • కోటి నామాలు రాయడానికి 252 కంటే ఎక్కువ పుస్తకాలు కావాల్సి ఉంటుంది, దీనికి మరింత ఎక్కువ సమయం పడుతుంది.

గోవిండ కోటి పూర్తి చేశాక VIP దర్శనం పొందడం ఎలా?

ఎవరైతే గోవింద కోటి పూర్తి చేస్తారో.. అలాంటి వారు తాము రాసిన పుస్తకాలను తిరుమలలోని పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తే.. వారికి ఆ మరుసటిరోజే వీఐపీ దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఉచితంగానే శ్రీవారి వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని లేదా పద్దతిని టీటీడీ యాజమాన్యం ఎప్పుడో ప్రవేశపెట్టింది.

గోవింద కోటి ద్వారా లబ్ధి పొందిన వారు

ఇప్పటి వరకు గోవింద కోటి రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నవారు కేవలం ముగ్గురు మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో మొదటి వ్యక్తి బెంగళూరుకు చెందిన కీర్తన అనే యువతి. ఇంటర్ పూర్తిచేసిన ఈ యువతి 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీ యాజమాన్యానికి సమర్పించింది. యాజమాన్యం ఈమెకు ఉచిత వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తరువాత మరో ఇద్దరు యువత కూడా 10,01,116 సార్లు గోవింద నామం రాసి ఉచిత వీఐపీ దర్శనం చేసుకున్నట్లు సమాచారం.

గోవింద కోటి వల్ల కలిగే ప్రయోజనాలు

యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి టీటీడీ తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ గోవింద కోటి. దీనివల్ల భక్తి భావం పెరుగుతుంది. తద్వారా మనసులో చెడు ఆలోచనలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరిగి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా.. సమాజానికి కూడా ఉపయోగపడుతుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *