TTD VIP Break Darshan Timing: ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఈ రద్దీ మరింత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యం.. బ్రేక్ దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేసింది. రద్దీని తగ్గించడంలో భాగంగా ఈ కొత్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కొత్త వీఐపీ బ్రేక్ దర్శన నియమాలు (జూలై 15 వరకు)
టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ‘వీఐపీ’లకు మాత్రమే ఈ రోజు నుంచి (2025 మే 1) జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయం కూడా ఉదయం 5:45 గంటల నుంచి 11 గంటల వరకు పరిమితం చేశారు.
ప్రత్యేక సేవల రోజుల్లో మినహాయింపు
కాగా.. శ్రీవారి తిరుప్పాడ సేవ (గురువారం), అభిషేక సేవ (శుక్రవారం) నేపథ్యంలో ఈ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.
సాధారణ భక్తుల ప్రయోజనం కోసమే ఈ మార్పులు
నిజానికి.. సాధారణ రోజులలో కంటే కూడా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వేసవి సెలవులు కావడం చేస్తే.. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సాధారణ భక్తుల సంఖ్య పెరగడం వల్ల, వారికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడానికి.. వీఐపీ దర్శనానికి సంబంధించి మార్పులు చేయడం జరిగింది.
వీఐపీ భక్తుల సంఖ్య పెరిగితే.. సాధారణ భక్తులు తప్పకుండా కొంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. దేవదేవుని దర్శనం కూడా ఆలస్యమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ఈ రోజు (గురువారం) నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయి. అయితే జులై 15 తరువాత ఈ రూల్స్ ఇలాగే కొనసాగుతాయా?, పాత వేళలనే అమలు చేస్తారా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద టీటీడీ యాజమాన్యం సామాన్య భక్తులకు అనుకూలంగా కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.
ఇతర టీటీడీ సమాచారం & నవీకరణలు
అక్షయ తృతీయ నాడు రద్దీ
ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దేవదేవుని దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ క్యూలైన్ కొనసాగింది. దీంతో టోకెన్స్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ఈ రోజు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
జూన్ నెల ఆన్లైన్ సేవా కోటా
ఇదిలా ఉండగా.. శ్రీవారి సేవలో 2025 జూన్ నెలలో వివిధ సేవలకు సంబంధించిన ఆన్లైన్ కోటా ఏప్రిల్ 30న విడుదలైంది.
ముఖ్యమంత్రి సూచనలు & వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానాలు సందర్శించే భక్తులకు నాణ్యమైన సేవలను అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కీలక సూచనలు చేశారు. అయితే టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సారి 2025 సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి.
Leave a Reply