యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో కాలేజ్ ఫీజు: ఫిదా అవుతున్న నెటిజన్లు

భారతదేశంలో యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న వారు చాలామందే ఉన్నారు. తమ పని తాము చేసుకుంటూనే వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు అన్ని పనులు మానుకుని వీడియోలు చేయడం ద్వారానే డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరు ఎలా చేసినా.. డబ్బులు మాత్రం సంపాదిస్తున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని తమ మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించింది.

ప్రారంభంలో 50-100 వ్యూవ్స్ మాత్రమే!

ఇషానీ శర్మ.. అందరిలాగానే యూట్యూబ్ క్రియేట్ చేసి వీడియోలు చేయడం ప్రారంభించింది. మొదట్లో తాను చేసిన వీడియోలకు 50 నుంచి 100 వ్యూవ్స్ (వీక్షణలు) మాత్రమే వచ్చేవి. ప్రారంభంలో సరైన వీడియో ఎడిటింగ్ లేదు, ఫ్యాన్సీ థంబ్‌నెయిల్ కూడా లేదు. కానీ వీడియోస్ చేయాలనే తపన మాత్రం ఉంది. ఇలాంటి సమయంలోనే.. ఆమె పదవ తరగతి విద్యార్థులు కోసం 5 నిమిషాల వీడియో రికార్డ్ చేసి.. తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇది నెట్టింట్లో బాగా వైరల్ అయింది. నిజానికి ఈమె యూట్యూబ్ కంటెంట్ కూడా విద్యార్థుల చదువుకోవడానికి కావలసిన టిప్స్ చెప్పడం, సలహాలు చెప్పడమే.

దశ మార్చిన ఒక్క వీడియో

మొత్తానికి ఒక్క వీడియో తన దశను మార్చేసింది. తన ఛానల్ మానిటైజేషన్‌కు అర్హత సాధించింది. ఆ తరువాత మరిన్ని వీడియోస్ చేయడంలో నిమగ్నమైంది. ఇలా డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆలా వచ్చిన డబ్బుతోనే తన మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించింది. ఈమె చదువుతున్న కాలేజీ ప్రభుత్వ కళాశాల, అందులో చెల్లించాల్సిన ఫీజు కూడా చాలా తక్కువే.. అయినప్పటికీ, తాను సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టుకోవడం అనేది చాలా గర్వంగా ఉందని పేర్కొంది. ఈమె చేసిన పని చాలామందికి ప్రేరణగా కూడా నిలుస్తుంది.

ఫీజు తక్కువే.. గర్వంగా ఉంది

ప్రభుత్వ కళాశాలో చదువుకు ఫీజు చాలా తక్కువే.. కానీ నాకు ఇది ఒక పెద్ద సక్సెస్ అని ఇషానీ పేర్కొంది. నేను నా సంపాదన ద్వారా ఫీజు చెల్లిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇష్టపడే పని చేస్తే తప్పకుండా.. ఫలితం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. మీరు కూడా ఏదైనా ప్రారంభించాలని అనుకుంటే.. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక బ్లాగ్, పాడ్‌కాస్ట్ ఏదైనా కావచ్చు, సరైన సమయం రావాలని వేచి చూడకండి. ఇప్పుడే ప్రారంభించండి. దానిని ఆస్వాదిస్తూ కొనసాగించండి. ఎదో ఒకరోజు తప్పకుండా సక్సెస్ లభిస్తుందని ఆమె వెల్లడించింది.

ఇష్టమైన పనిచేస్తూ ముందుకు పోతే..

ప్రస్తుతం ఇషానీ చదువుపై ద్రుష్టి పెట్టడం వల్ల యూట్యూబ్ వీడియోలకు కొంత విరామం ప్రకటించింది. కానీ త్వరలోనే మళ్ళీ వీడియోలు క్రియేట్ చేయడం మొదలుపెడుతుంది ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె కథ వైరల్ అయింది. ఇష్టమైన పనిచేస్తూ ముందుకు పోతే.. తప్పకుండా ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించిన ఈమెను పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం చాలామంది యోట్యూబ్ వీడియోలు చేస్తూ లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడం కష్టమే. ఒక వందమంది యూట్యూబ్ ఛానల్ పెడితే.. ఏ ఒక్కరికో, లేదా ఇద్దరికో (కంటెంట్ బాగుంటే) మాత్రమే మానిటైజేషన్ వస్తుంది. కానీ ఎవరైనా మంచి కంటెంట్‌తో స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని మాత్రం చెప్పవచ్చు.