వెలుగులోకి మరో దందా.. తల్లుల ముసుగులో పిల్లల అమ్మకాలు!

సర్రోగేట్ తల్లుల ముసుగులో పిల్లల అమ్మకాలు జరుగుతున్న భారీ దందాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బయటపెట్టింది. సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని పేద మహిళలను ప్రలోభపెట్టి, వారితో పుట్టిన శిశువులను భారీ మొత్తాలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో భాగంగా అధికారులు ఇప్పటికే సుమారు 50 ఆస్తులను జప్తు చేసి మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సర్రోగసీ విధానం పెరుగుతున్న నేపథ్యంలో కొందరు దాన్ని అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా తీసుకొని కొందరు మద్యవర్తులు పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తూ పిల్లల అమ్మకాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన సమాజంలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకవైపు సంతానం కోసం తహతహలాడే దంపతులు ఉంటే, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలను మోసం చేసి అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సర్రోగేట్ తల్లుల ముసుగులో పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయనే విషయం బయటపడటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

పేద మహిళలను ప్రలోభపెట్టి అక్రమ వ్యవహారం

దర్యాప్తు సంస్థల ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లో పనిచేసే మద్యవర్తులు ఆర్థికంగా బలహీనమైన మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి డబ్బు ఇస్తామని చెప్పి సర్రోగేట్ తల్లులుగా మారేలా ఒప్పించేవారని అధికారులు తెలిపారు.

తరువాత ఆ మహిళల ద్వారా పుట్టిన పిల్లలను సంతానం లేని దంపతులకు విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందులో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మధ్యవర్తులు కలిసి పనిచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు ED అధికారులు గుర్తించారు.

వేర్వేరు ధరల్లో..

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత సంచలనంగా మారాయి. ఈ నెట్‌వర్క్‌లో పుట్టిన పిల్లలకు ధరలు కూడా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆడపిల్లకు సుమారు రూ. 3.5 లక్షలు అయితే.. మగపిల్లకు సుమారు రూ. 4.5 లక్షలు. ఈ రేట్ల ప్రకారం బేరసారాలు జరిగాయని దర్యాప్తులో బయటపడింది. పిల్లలను కొనుగోలు చేసే దంపతులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలన్నీ మధ్యవర్తుల ద్వారా నిర్వహించబడినట్లు తెలుస్తోంది.

మనీ లాండరింగ్ కేసు నమోదు

ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ ద్వారా చట్టబద్ధంగా మార్చే ప్రయత్నం చేసినట్లు ED నిర్ధారించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సుమారు 50 ఆస్తులను అధికారులు జప్తు చేశారు.

ఈ ఆస్తులు వివిధ నగరాల్లో ఉన్నట్లు సమాచారం. నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న వ్యక్తులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం, ఈ కేసులో ఇంకా మరికొంత మంది పాత్ర ఉండే అవకాశం ఉంది. అందుకే దర్యాప్తు మరింత విస్తరించే అవకాశం ఉంది.

కట్టుదిట్టమైన నిబంధనలు అవసరం

ఈ ఘటన నేపథ్యంలో సర్రోగసీ ప్రక్రియపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చట్టబద్ధంగా నిర్వహించాల్సిన ఈ విధానాన్ని కొందరు అక్రమ మార్గంలో ఉపయోగించడం సమాజానికి ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని అక్రమ సర్రోగసీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

Also Read: హైదరాబాద్‌ డ్రగ్స్ కేసు.. చంచల్‌గూడ జైలుకు రోహిత్ రెడ్డి!