భారీ వర్షాలు: ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు!

భాగ్యనగరాన్ని (హైదరాబాద్) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు స్తంభించిపోయాయి, ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయ్యాయి. రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం.. మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు

శుక్రవారం కూడా వర్షాలు పడుతున్న కారణంగా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ, డీఈఓ ఉత్తర్వులు జారీ చేసారు. సెలవు కారణంగా.. కాకతీయ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలు.. మళ్ళీ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే విషయాన్ని త్వరలోనే చెబుతారు. కాగా మిగిలిన పరీక్షలన్నీ కూడా యధావిధిగా జరుగుతాయి.

కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు మాత్రమే కాకుండా.. హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఈ రోజు, రేపు (శుక్ర, శనివారం) జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను సంబంధిత అధికారులు త్యరలోనే వెల్లడిస్తారు. వర్షాల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదని వర్సిటీ యాజమాన్యం పరీక్షలను వాయిదా వేసింది.

రానున్న 24 గంటల్లో వర్షాలు!

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షం సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అవసరమైతే తప్పా.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిది. వర్షం కారణంగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైతే.. ప్రయాణం కష్టమవుతుంది. కాబట్టి ప్రజలు వర్షం సమయంలో బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తోంది.

వర్షాలు ఇలాగే కొనసాగితే.. రేపు కూడా సెలవు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఈ రోజు, రేపు, ఎల్లుండి (శుక్ర, శని, ఆదివారం) బడికి సెలవు. ఆ తరువాత సోమవారం పాఠశాల యధావిధిగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా వెల్లడించల్సి ఉంది.

ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షం ఎక్కువైపోయింది. వర్షంలో ఆఫీసులకు వెళ్లాలన్నా, తిరిగి ఇళ్లకు రావాలన్నా.. ఉద్యోగులకు కష్టమవుతోంది. అయితే ఈ వర్షాలు ఇలాగె కొనసాగితే.. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించే అవకాశం ఉంది. నగరం నడిబొడ్డున వర్షపు నీరు ఎక్కువ కావడం వల్ల.. వాహనాలు కూడా అందులోనే కొట్టుకుపోతున్నాయి. ఇది వాహనదారులకు తీరని నష్టం కలిగిస్తోంది.

పొంగుతున్న చెరువులు

నగరంలో వర్షపాతం ఎక్కువవడంతో.. చెరువులన్నీ నిండుకుండలా మారిపోయాయి. మూసి నదీ నిండిపోయింది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నీటితో కళకళలాడుతోంది. వర్షం నగర వాసులకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ.. రైతన్నకు మేలే చేస్తుంది. పంటలకు కావాల్సిన నీరు అందుబాటులో ఉంటుంది. నీటి కొరత లేకుండా పంటలు పండించుకోవచ్చు. తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాగా ప్రస్తుతం అన్నదాత యూరియా కొరతను ఎదుర్కొంటున్నాడు. దీనిని ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

Leave a Comment