శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి: పండితులు ఏం చెబుతున్నారంటే?

హిందూ పంచాంగం ప్రకారం.. శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. అంటే ఉగాది పండుగ తీసిన తొమ్మిదో రోజన్నమాట. అయితే ఈసారి నవమి తిథి రెండు తేదీల్లో ఉండటంతో భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి మార్చి 26న మధ్యాహ్నం 2:18 గంటలకు ప్రారంభమై, మార్చి 27న మధ్యాహ్నం 12:36 వరకు కొనసాగుతుంది. దీంతో పండగ తేదీపై స్పష్టత కోసం భక్తులు పండితులను ఆశ్రయిస్తున్నారు.

సాంప్రదాయంగా హిందూ పండుగలు సూర్యోదయ కాలంలో ఉన్న తిథి ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నియమాన్ని అనుసరించి పండితులు మార్చి 27నే శ్రీరామనవమి జరుపుకోవాలని సూచిస్తున్నారు.

పండగ ఎప్పుడంటే?

హిందూ సంప్రదాయం ప్రకారం.. పండుగలు తిథి సూర్యోదయ సమయంలో ఉండే రోజునే జరుపుకోవాలి. మార్చి 27న ఉదయం సూర్యోదయ సమయంలో నవమి తిథి ఉండటం వల్ల ఆ రోజే పండగ జరుపుకోవడం శ్రేయస్కరం. మార్చి 26న నవమి తిథి మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతున్నందున ఆ రోజున పండగ చేయడం సాంప్రదాయానికి అనుగుణంగా ఉండదని పండితులు చెబుతున్నారు.

భద్రాచలంలో ప్రత్యేక వేడుకలు!

తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా శ్రీ సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది కూడా మార్చి 27ననే భద్రాచలంలో రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలి వస్తారు.

భక్తులకు సూచనలు

శ్రీరామనవమి సందర్భంగా భక్తులు ఉపవాసం పాటించడం, శ్రీరాముడి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణాలు నిర్వహిస్తారు. ఇంటి వద్ద కూడా భక్తులు పూజలు చేసి, పానకం, వడపప్పు వంటి ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

పండుగ ప్రాముఖ్యత

శ్రీరామనవమి పండగ శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటారు. ధర్మం, సత్యం, న్యాయం వంటి విలువలను గుర్తు చేసే ఈ పండగకు హిందువులలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండగ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతుంది.

శ్రీరామనవమి గురించి

శ్రీరామనవమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది శ్రీరాముడు జన్మించిన రోజుగా భావించి, చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిథినాడు జరుపుకుంటారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా, సత్యనిష్ఠకు ఆదర్శంగా నిలిచినందున ఈ పండుగను విశేషంగా గౌరవిస్తారు. ఈ రోజున భక్తులు ఉదయం స్నానం చేసి, దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా రామాయణం పారాయణం చేయడం, భజనలు పాడటం వంటి ఆచారాలు విస్తృతంగా జరుగుతాయి.

శ్రీరామనవమి సందర్భంగా చాలా ప్రాంతాల్లో సీతారామ కళ్యాణం నిర్వహించడం ప్రత్యేకత. ఈ వేడుకలో సీతాదేవి, శ్రీరాముని వివాహాన్ని ప్రతీకాత్మకంగా జరుపుతారు, ఇది దాంపత్య జీవితం యొక్క పవిత్రతను సూచిస్తుంది. ఆలయాలలో ప్రత్యేక అలంకరణలు చేసి, పానకం, వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులు ఉపవాసం పాటించి, సాయంత్రం పూజల అనంతరం ప్రసాదం స్వీకరిస్తారు. ఈ పండుగ మనకు ధర్మం, న్యాయం, నీతి మార్గంలో నడవాలని ఉపదేశిస్తూ, కుటుంబంలో శాంతి, ఐక్యత పెంపొందించే సందేశాన్ని ఇస్తుంది.

Also Read: ఉడుతా భక్తి: విన్నారు సరే.. అర్థం ఏమిటో తెలుసా?