T20 World Cup: ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్.. హోటల్ రూ.లక్ష, ఫ్లైట్ టికెట్లు ట్రిపుల్!

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడనున్న ఈ కీలక పోరు ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వేలాది అభిమానులు అహ్మదాబాద్‌కు చేరుకుంటుండటంతో నగరంలో హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ ధరలు భారీగా పెరిగాయి.

టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన తర్వాత మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలు, రైళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక రైళ్లు, అదనపు విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

హోటల్ గదులకు డిమాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరంలో హోటల్ గదుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో అందుబాటులో ఉండే గదులు కూడా ఇప్పుడు పూర్తిగా బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టేడియానికి సమీపంలోని హోటళ్లలో గదులు దాదాపు ఫుల్ అయిపోయాయి.

అహ్మదాబాద్ నగరానికి 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హోటళ్లకు కూడా భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. అభిమానులు మ్యాచ్‌కు దగ్గరగా ఉండేందుకు ముందుగానే గదులను బుక్ చేసుకుంటున్నారు. దీంతో హోటల్ యజమానులు కూడా ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా హోటల్ రంగానికి చెందిన ఒక నిర్వాహకుడు మాట్లాడుతూ.. ”మార్చి నెలలో సాధారణంగా ఇంత డిమాండ్ ఉండదు. కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కారణంగా ఒక్కసారిగా బుకింగ్స్ పెరిగాయ” అని తెలిపారు.

రూ.లక్ష వరకు అద్దె!

అహ్మదాబాద్‌లోని పలు హోటళ్లలో ప్రస్తుతం గదుల అద్దెలు భారీగా పెరిగాయి. మ్యాచ్ జరిగే వారాంతంలో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

  • బడ్జెట్ హోటళ్లలో ఒక్క రాత్రి గది అద్దె సుమారు రూ.15,000
  • మధ్యస్థాయి హోటళ్లలో రూ.25,000 నుంచి రూ.40,000 వరకు
  • ప్రీమియమ్ హోటళ్లలో రూ.50,000 నుంచి రూ.80,000 వరకు

కొన్ని లగ్జరీ హోటళ్లలో మాత్రం గదుల అద్దె రూ.1 లక్ష వరకు చేరినట్లు సమాచారం. దీనికి జీఎస్టీ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అభిమానులు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా మ్యాచ్ జరిగే రోజు స్టేడియానికి సమీపంలోని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది.

పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా కనిపిస్తోంది. సాధారణంగా హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు విమాన టికెట్ ధర రూ.5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. కానీ మ్యాచ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కొన్ని విమాన సర్వీసుల్లో సింగిల్ జర్నీ టికెట్లు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉన్నాయి. అయితే తిరుగు ప్రయాణ టికెట్ల ధరలు అంతగా పెరగకపోవడం గమనార్హం. అయినప్పటికీ మ్యాచ్ చూసేందుకు విమానంలో వెళ్లాలనుకునే అభిమానులకు ఈ ధరలు కొంత భారంగా మారుతున్నాయి.

మ్యాచ్ టికెట్లకు కూడా భారీ డిమాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నరేంద్రమోదీ స్టేడియంలో కొన్ని స్టాండ్లలో ఒక్కో టికెట్ ధర రూ.1 లక్షకు పైగా ఉందని సమాచారం. లీగ్ దశలో ఇవే టికెట్లు వేల రూపాయలకే లభించాయి. కానీ ఫైనల్ మ్యాచ్ కావడంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా భారీగా పెరిగాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో ఒకటి. ఇందులో సుమారు 1.30 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. అందువల్ల ఈ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది.

మ్యాచ్‌కు ముందు ఎంటర్‌టైన్‌మెంట్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయ గాయకుడు రికీ మార్టిన్, పంజాబీ మరియు బాలీవుడ్ గాయకుడు సుఖ్‌బీర్, గుజరాతీ జానపద గాయని ఫల్గుణి పాఠక్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత 6:30 గంటలకు టాస్ నిర్వహించి, అనంతరం భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also read