కలియుగ ప్రత్యక్ష దైవం.. ఏడుకొండల వెంకన్న అందరికీ ఆరాధ్యదైవమే. కుల, మత బేధాలు లేకుండా అందరూ దర్శించుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే.. ప్రతి రోజూ లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల పరమ పవిత్రం, పావనం. తిరుమల గురించి అందరికీ తెలిసిందే, కానీ శ్రీవారిని శనివారం దర్శించుకుంటే మంచిదని చాలామంది అనుకుంటుంటారు. నిజంగా శనివారం స్వామివారికి ప్రత్యేకమేనా?, ఈ రోజు దర్శించుకుంటే మాత్రమే కోరిన కోరికలు నెరవేరుతాయా?, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే తెలుసుకుందాం.
శనివారం ప్రత్యేకం!
హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి దేవునికి ఒక్కో ప్రత్యేకమైన రోజు ఉంటుందని నమ్మకం. ఇందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం అని విశ్వసిస్తారు. కానీ స్వామివారికి ప్రతిరోజూ ప్రత్యేకమే, ప్రతి రోజూ సమానమే. అయితే శనివారం మాత్రం ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
శని ప్రభావం నుంచి విముక్తి!
శనివారం.. శనిగ్రహానికి సంబంధించిందని, శని ప్రభావం నుంచి బయటపటడానికి వెంకటేశ్వర స్వామిని ఎక్కువమంది పూజిస్తారు. ఈ రోజున చాలామంది శనివారం రోజు స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా.. వ్రతాలు మొదలైనవి కూడా చేస్తారు. ఏది ఏమైనా.. శనివారం రోజు భక్తుల రద్దీ కొంత ఎక్కువగా ఉంటుంది. కొందరు భక్తులు శనివారం రోజు ప్రత్యేకంగా.. ఉపవాసాలు ఉండి, పూజలు చేసి, సాయంత్రం ప్రసాదం తీసుకుంటారు.
రోజువారీ సేవలు యథాతథం!
పురాణాల ప్రకారం.. వెంకటేశ్వర స్వామిని కష్టాలు, బాధలు తొలగించే దయామయుడిగా కొలుస్తారు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం.. దేవదేవుణ్ణి శనివారం రోజు కొలవడం సర్వసాధారణం అయిపోయింది. మొత్తం మీద చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. శనివారం అని కొందరు చెప్పుకుంటారు, కానీ కొండపైన అన్ని సేవలు రోజువారీగా నిర్విఘ్నంగా జరుగుతుంటారు.
శనైశ్వరునికి.. శనివారానికి సంబంధం
ఒక్కొరోజుకి ఒక్కో గ్రహాధిపతి ఉంటారని హిందూ పురాణాలూ చెబుతాయి. దీని ప్రకారమే శనివారానికి శనైశ్వరుడు అధిపతి. అందుకే ఈ రోజు (శనివారం) శని దేవునికి ప్రత్యేక పూజలు చేసి, ఆయన కృపకు పాత్రులు అవుతారు. సూర్య భగవానుని కుమారుల్లో ఒకరైన ఈయన.. న్యాయదేవునిగా ప్రసిద్ధి చెందారు. మనిషి చేసిన పాప పుణ్యాల ఫలితంగానే వారికి ఫలితాలను ఇస్తారు. శని గ్రహాన్ని కర్మ ఫలదాత అని కూడా అంటారు. కాబట్టి ప్రజలు ప్రత్యేకించి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసుకుంటారు.
తిరుమల గురించి
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోవెల. ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతుంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా అలరారుతున్న ఈ దేవాలయం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి. తిరుమల కొండమీద ఎంతోమంది పుణ్య పురుషులు చెట్లు, పుట్టలు, కొండలుగా ఉంటూ నిత్యం స్వామివారిని సేవించుకుంటున్నారని ఐతిహ్యం. అంతటి మహామాన్విత పుణ్యక్షేత్రం భారతదేశంలో ఉంటడం భారతీయలు చేసిన పుణ్యమనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పావన క్షేత్రం ఈ ఇల వైకుంఠం (తిరుమల).
హిమాన్షు కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.