ఒకేసారి రెండు బైకులు లాంచ్ చేసిన యమహా: ధరలు & వివరాలు ఇలా..

జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా.. ఇండియన్ మార్కెట్లో ఒకేసారి రెండు బైకులు లాంచ్ చేసింది. అవి ఒకటి ఎక్స్ఎస్ఆర్ 155, మరొకరి ఎఫ్‌జెడ్ రేవ్. సంస్థ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్స్ డిజైన్, ఇతర ఫీచర్స్ వంటి వివరాలతో ధరలను కూడా ఈ కథనంలో చూసేద్దాం.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155

కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది నియో రెట్రో స్టైలింగ్ పొందుతుంది. ఇందులోని 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్.. 10000 ఆర్పీఎం వద్ద 18.4 హార్స్ పవర్, 7500 ఆర్పీఎం వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎక్స్ఎస్ఆర్ 155 బైకు రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్ పొందుతుంది. అయితే ఈ బైక్ బ్రాండ్ లోగోకు బదులుగా యమహా పేరుతో ఉండటం చూడవచ్చు. ఇందులో సింగిల్ పీస్ సీటు ఉంటుంది. ఇది రైడర్, పిలియన్ ఇద్దరికీ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది రెట్రో ప్రేరిత ఫుల్ ఎల్‌సీడీ యూనిట్. ఇందులో యమహా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సూట్ కూడా ఉంటుంది. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఈ బైకులో ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఈ లేటెస్ట్ యమహా బైకులో ఉంది. సస్పెన్షన్స్ మరియు బ్రేకింగ్ సెటప్ అద్భుతంగా ఉండటం చూడవచ్చు.

యమహా ఎఫ్‌జెడ్ రేవ్

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్.. యమహా ఎఫ్‌జెడ్ రేవ్. దీని ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్, కొత్త డిజైన్ ఫ్యూయెల్ ట్యాంక్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ పొందుతుంది. ఈ బైక్ కూడా సింగిల్ పీస్ సీటును పొందుతుంది. క్రిస్పీ టెయిల్ లాంప్ ఇందులో చూడవచ్చు.

ఎఫ్‌జెడ్ రేవ్ బైకులో.. 149 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 12.2 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి బైక్ స్మూత్ రైడింగ్ అందిస్తుంది. 136 కేజీల (కర్బ్ వెయిట్) బరువున్న ఈ లేటెస్ట్ బైక్ 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు కావడం గమనార్హం. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ పెద్దది కాబట్టి.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇండియన్ మార్కెట్లో యమహా బైకులకున్న డిమాండ్

భారతదేశంలో స్టైలిష్ బైక్ అనగానే గుర్తొచ్చేది యమహా బ్రాండ్ బైకులే. ఈ కంపెనీ కేవలం బైకులు మాత్రమే కాకుండా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. దీంతో ఇది ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతోంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో మొత్తం 22 మోడల్ యమహా టూవీలర్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా మార్కెట్లో తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా రెండు బైకులు లాంచ్ చేసింది. ఇవి కూడా మంచి అమ్మకాలు పొందుతాయని భావిస్తున్నాము.