అనాథలా పెరిగి.. అందనంత ఎత్తుకెదిగిన అందెశ్రీ: ఇక లేరు

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ.. ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత, గాయకుడు అందెశ్రీ ఈరోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుముశారు.

జీవితం మొదలైందిలా..

డాక్టర్ అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన జూలై 18వ తేదీన 1961వ సంవత్సరంలో రెబర్తీ అనే ఊరు, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లాలో జన్మించారు. ఒక అనాథగా పెరిగి.. గొర్రెలు మేపుకుంటూ, అతి సాదాసీదాగా జీవనం సాగించేవారు. అక్కడ నుంచే స్వయం కృషితో అక్షరాలు నేర్చుకుని తెలుగు సాహిత్యంపైన పట్టు సాధించారు.

చిన్నప్పుడు బడికి వెళ్లి చదువుకోలేదు, కానీ ఆసువుగా కవిత్వం చెబుతారు. తెలుగు సాహితీ, కళా రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నవంబర్ 10వ తేది 2025న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అరభై నాలుగేళ్ల వయసులో అందెశ్రీ తన కలానికి, గళానికి స్వస్తి పలికారు.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

గేయ రచయితగా అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గేయంతో పాటు అనేక సామాజిక పాటలు, తెలంగాణ ఉద్యమం కోసం పాటలు, సినిమా పాటలు రచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఎప్పటికీ నిలిచిపోయే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందెశ్రీ చేత రాయించి.. అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ పాటని ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో “జయ జయ జయహే తెలంగాణ, జననీ జయకేతాన్ని” గీతంగా ఆలపిస్తున్నారు.

“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకంతైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు” అనే పాటను ఆర్. నారాయణమూర్తి సినిమా కోసం అందెశ్రీ రాశారు. ఆ తరువాత ఆ పాటను తెలుగు పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చారు. పల్లెటూరు వాతావరణం, జీవితం, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం గురించి ఎన్నో మరచిపోలేని పాటలు ఆయన అందించారు.

అందెశ్రీ అందుకున్న పురస్కారాలు..

  • తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, కృషిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి చేతుల మీదగా 2024 సంవత్సరంలో కోటి రూపాయలు నగదు అందజేశారు.
  • 2006లో గంగ అనే సినిమా కు ప్రభుత్వం నుంచి నంది అవార్డు తీసుకున్నారు.
  • 2014 సంవత్సరంలో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ కాకతీయ విశ్వవిద్యాలం ఆయనను గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించడం జరిగింది.
  • 2015లో దాశరథి సాహితీ పురస్కారం స్వీకరించారు.
  • 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు.
  • రావూరి భారద్వాజ సాహిత్య పురస్కారం అందుకున్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆయన స్వగృహం లాలాగూడలో ఉంచారు. కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆయనతో వారికున్న సాన్నిహిత్యాన్ని, చేసిన సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.