పెట్రోల్ కంటే డీజిల్ ఇంజిన్ వల్లనే ఎక్కువ కాలుష్యమా..: ఎందుకు?

ప్రారంభంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్‌జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు అందుబాటులో ఉన్నా.. పొల్యూషన్ అంటే డీజిల్ కార్లే గుర్తొస్తాయి. పెట్రోల్ కార్లు కూడా కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నప్పటికీ.. డీజిల్ కార్ల కంటే కొంత తక్కువే అని చెప్పాలి. ఈ కథనంలో.. పెట్రోల్ కార్ల కంటే, డీజిల్ కార్లు ఎందుకు ఎక్కువ కాలుష్య కారకాలను రిలీజ్ చేస్తాయనే విషయాన్ని చూసేద్దాం..

కాలుష్య కారకాలను తగ్గించడానికి డీజిల్ ఇంజిన్ల అభివృద్ధి ప్రక్రియలో కొత్త నిబంధనలను, కొత్త టెక్నాలజీలను ఉపయోగించినప్పటికీ.. కాలక్రమంలో యధావిధిగానే డీజిల్ ఇంజిన్లు కాలుష్య కారణాలను విడుదల చేస్తున్నాయి. అంతే కాకుండా పెట్రోల్ కార్ల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువ కూడా. ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా.. కార్ల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కొన్ని కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. డీజిల్ ఇంజిన్లు ఎక్కువ కాలుష్యం కలిగించడానికి ఐదు కారణాల విషయానికి వస్తే..

అధిక ఉష్ణోగ్రత

డీజిల్ ఇంజిన్లు.. పెట్రోల్ ఇంజిన్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. అంటే డీజిల్‌తో ఇంజిన్ పనిచేయడానికి ఉష్ణోగ్రత ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రత వద్ద.. నైట్రోజన్, ఆక్సిజన్ వంటి వాయువులు చర్య జరిపి.. అధిక మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్లను రిలీజ్ చేస్తాయి. ఈ వాయువులు చాలా ప్రమాదకరం. ఇవి పట్టణాల్లో పొగమంచును, ఆమ్ల వర్షాలు ఏర్పడటానికి కారణం అవుతాయి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అసంపూర్ణ దహనం

సాధారణంగా డీజిల్ అనేది, పెట్రోల్ కంటే కూడా బరువైనది. ఇది అస్థిర హైడ్రోకార్బన్ మిశ్రమం. కాబట్టి జ్వలన ప్రక్రియలో.. డీజిల్ అసంపూర్తిగా దహనం అవుతుంది. తద్వారా మసి లేదా సూక్ష్మ కణ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే గాలిలో కలిసి కాలుష్యాన్ని ఏర్పరుస్తాయి. ఈ కారకాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా.. ఉబ్బసం, హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

అధిక సంపీడనం & వేడి గాలి

డీజిల్ ఇంజిన్ శక్తిని ఉత్పత్తి చేయాలంటే.. కొంత ఎక్కువ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డీజిల్ ఇంజిన్లు కాలుష్య ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే పెట్రోల్ ఇంజిన్లు ఇంధనాన్ని మండించడానికి స్పార్క్ ప్లగ్‌లను ఉపయోగిస్తాయి. ఇలాంటివి ప్రత్యేకంగా డీజిల్ ఇంజిన్లలో ఉండవు. దీని వల్ల డీజిల్ ఇంజిన్ హైడ్రోకార్బన్ మిశ్రమాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.

అధిక సల్ఫర్ కంటెంట్

డీజిల్‌లో ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయి. ఇది సాధారణంగా కాలుష్య కారకమే. అత్యంత ప్రమాదకరం కూడా. నిజానికి కంపెనీ డీజిల్ కారును ఉప్పత్తి చేసినప్పుడు.. టెస్టింగ్ దశలో పరీక్షిస్తాయి. ఇంజిన్ కొత్తగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు చాలా తక్కువ. ఇంజిన్ క్రమంగా పనిచేస్తూ ఉండటం వల్ల.. కాలుష్య కారకాలు పుడతాయి.

కాలుష్య కారకాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. కేంద్రం కూడా బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అమలులోకి తెచ్చింది. ఈ సమయంలో కొన్ని కంపెనీలు తమ డీజిల్ వాహనాలను అప్డేట్ చేయలేదు. దీనివల్ల చాలా డీజిల్ కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేశాయి. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు తగ్గాయి. ఇలాంటి కారణాల వల్ల.. డీజిల్ వాహనాలు కనుమరుగుతున్నాయి.