కల నెరవేరింది.. మొత్తానికి మదనపల్లె జిల్లా అయింది: జాబితాలో మరో రెండు..

ప్రజల అభ్యర్థనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2025 నవంబర్ 25వ తేదీన ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మదనపల్లె, పోలవరం, మార్కాపురం అనే ఈ మూడు ప్రాంతాలను కొత్త జిల్లాలుగా రూపుదిద్దుకోనున్నాయి.

నెరవేరిన కల!

తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ విడిపోయి కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చర్చ వచ్చిన నాటి నుంచి మదనపల్లెని జిల్లాగా ప్రకటించాలని ప్రజలు, నాయకులు ప్రతిపాదించడం జరిగింది. అందుకోసం అన్ని పార్టీలు, నాయకులు విడివిడిగా కొన్నిసార్లు కలిసి మరికొన్ని సార్లు ఎన్నో సభలు, సమావేశాలు, ర్యాలీలు ఈ విధంగా ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరికి తమ సొంత జిల్లా కల నెరవేరినందుకు జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

స్వతంత్య్ర జిల్లాగా మదనపల్లి

మదనపల్లెని జిల్లాగా ప్రకటించక మునుపు పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలు అన్నీ కూడా చిత్తూరు జిల్లా పరిధిలో ఉండేవి. ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా నుంచి తీసి మదనపల్లి జిల్లాలోకి చేర్చడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు ఈ మూడు నియోజకవర్గాలు ఇప్పుడు మదనపల్లె జిల్లాలో కలిసిపోయాయి.

పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు మొత్తం ఈ నాలుగు నియోజకవర్గాలను మదనపల్లె జిల్లాలోకి కలపడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగం అనే విషయం అందరికీ తెలిసింది. జిల్లా ముఖ్య కార్యాలయం మదనపల్లెలో ఉంది. మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోనే భాగంగా ఉంది. ఇంకా పూర్తి అధికారాలు మదనపల్లికి బదిలీ చేయలేదు. 2026 జనవరి నెలలో అన్నమయ్య జిల్లా నుంచి వీడి మదనపల్లె స్వత్రంత్ర జిల్లాగా అవతరించనుంది.

మదనపల్లి జిల్లా మండలాలు

ఈ జిల్లాకి సంబంధించినంత వరకు దాదాపు 20 మండలాలు ప్రతిపాదించడం జరిగింది. అవి ”మదనపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లి, పీలేరు, కలికిరి, వాయల్పాడు, గుర్రంకొండ, కలకడ, కెవి పల్లె, పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, కంభంవారి పల్లి, తంబళ్లపల్లి, ములకల చెరువు, పెద్ద తిప్పసముద్రం, బి. కొత్తకోట, పెదమండ్యం, కురబల కోట”.

నియోజకవర్గాలు

మదనపల్లె జిల్లాకి నాలుగు నియోజకవర్గాలు వచ్చాయి.
➤మదనపల్లె
➤పుంగనూరు
➤తంబళ్లపల్లి
➤పీలేరు

రెవిన్యూ డివిజన్లు

పీలేరు, మదనపల్లె ఈ రెండు కూడా ముందు నుంచి రెవిన్యూ డివిజన్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మదనపల్లె జిల్లాలో భాగం అవ్వడం ప్రజల పరిపాలనకు చాలా సులభతరం అవుతుంది.

జనాభా విషయానికి వస్తే దాదాపు 11.05 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. మదనపల్లె మంచి విద్యాలయాలు ఉన్న ప్రాంతం. పురాతనమైన బీటీ కళాశాల ఇక్కడే ఉన్నది. పర్యాటక ప్రాంతంగా కూడా ఇప్పటికే చాలా అభివృద్ధిలో ఉంది. ఇక్కడ హార్సిలి హిల్స్ & నంది హిల్స్ టూరిజం పరంగా ప్రజలకి మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా జనాలకి సౌకర్యవంతంగా అందుబాటులో ఉంది. అన్నీ ప్రాంతాలకి వెళ్లడానికి రోడ్డు సదుపాయాలు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దులు ఆనుకోని ఉండటం మరింత కలిసొచ్చే అంశం. మదనపల్లె జిల్లా కావడానికి అన్నీ వసతులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకటించిన మదనపల్లి, మార్కాపురం, పోలవరం మూడు జిల్లాలు కలుపుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 జిల్లాలు అయ్యాయి.