మహా శివరాత్రి హిస్టరీ.. భారత్‌లోనే కాదు నేపాల్‌లో కూడా!!

రానున్నది మహా శివరాత్రి. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. ప్రతి ఏటా.. వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగ ఫిబ్రవరి – మార్చి నెలల్లో వస్తుంది. ఈసారి ఫిబ్రవరి 15న (ఆదివారం) వచ్చింది.

పురాణాల ప్రకారం..

మహా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి అని పురాణాలూ చెబుతాయి. లింగోద్భవం ఈ రోజున జరిగిందని, శివ పార్వతుల కల్యాణం, సాగర మధనం కూడా ఈ రోజునే జరిగాయని.. అందుకే ఇది అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహా శివరాత్రి పండుగను.. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు.. దేశంలో నలుమూలలా జరుపుకుంటారు.

ఉపవాస దీక్ష..

శివరాత్రి రోజున చాలామంది ఉపవాస దీక్షతో ఉండి.. శివాలయాలకు వెళ్తారు. దేవదేవుణ్ణి (శివుడు) భక్తితో పూజిస్తారు. కేవలం పత్రం, ఫలం, నీరు సమర్పిస్తే చాలు ఆ జంగమయ్య మురిసిపోతాడని ఎంతోమంది యోగులు చెబుతుంటారు. ఆడంబరాలు లేకుండా.. జరుపుకునే పండుగలలో ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఇలా శుభ ఫలితాలు..

ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించి.. దేవదేవుని నామస్మరణ చేస్తూ, శివయ్యకు మీకు తోచింది (పువ్వు, బిల్వ పత్రమో ఇలా..) ఎదో ఒకటి సమర్పించాలి. కోపాన్ని వదిలి.. ప్రేమతో మెలగాలి. అభ్యాగతులను సైతం ఆదరించాలి.

రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి సమయంలో జాగారం (నిద్రపోకుండా ఉండటం) చేస్తారు. ఈ సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రం జపించుకోవాలని కొందరు చెబుతారు. ఈ మంత్రం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అంతే కాకుండా శివ పురాణం చదవడం, భజనలు చేయడం వంటివి కూడా చేస్తుంటారు.

శివుని ప్రత్యకత & గొప్పతనం

పురాణాల ప్రకారం.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (శివుడు) అని చెబుతారు. ఇందులో శివుడు లయకారుడు, బోళాశంకరాదు. కేవలం దేవతలకు మాత్రమే కాకుండా.. రాక్షసులకు సైతం వారలు ఇచ్చే దయామయుడు ఆ పరమేశ్వరుడు. సాగర మధనం సమయంలో పుట్టిన హాలాహలం(విషం)ను కంఠంలో దాచి సృష్టిని కాపాడిన జంగమయ్య.. అందరికీ ఆరాధ్య దైవం. మెడలో పాము, చేతిలో త్రిశూలం పట్టుకుని హిమాలయ్యాలో ధ్యానంలో ఉండిపోయే ఆ మహానుభావుడు, భక్తులపాలిట కల్పతరువు.

మహా శివుడు అంటే.. దయకు, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం, సమానత్వానికి సంకేతం, ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం. శివుడంటే కేవలం భగవంతుడు మాత్రమే కాదు.. ఆలోచనలను అందని అతీత శక్తి. అంతటి మహాత్మునికి ఇష్టమైన రోజే.. ఈ మహా శివరాత్రి.

నేపాల్ దేశంలో కూడా..

మహాశివరాత్రి పండుగను వారణాసిలో అత్యంత వైభవంగా జరుపుతారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఉండే ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో (శ్రీకాళహస్తీశ్వరాలయం) కూడా గొప్పగా జరుపుతారు. మన దేశంలో ఊరు, వాడల్లో ఎంతో భక్తి భావంతో జరుపుకునే ఈ పండుగను.. నేపాల్ దేశంలో కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు మాత్రమే కాకుండా సన్యాసులు, నాగ సాధువులు కూడా వస్తారని చెబుతారు.