ప్రధాని మోదీ అంటే?: చంద్రబాబు సమాధానం ఇదే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసింది. సుంకాల కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ క్షిణిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వంటి వారు.. ఈ సమస్య తాత్కాలికం మాత్రమే.. శాశ్వతం కాదని చెబుతున్నారు. ఈ విషయం గురించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎకనమిక్స్ టైమ్స్ వరల్డ్ క్లాస్ ఫోరం సదస్సులో ప్రస్తావించారు.

ప్రతి సవాలును స్వీకరించాలి

ట్రంప్ విధించిన సుంకాల వల్ల.. కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కానీ మనకు ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరించాలి, పరిష్కరించుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం మన ముందున్న సుంకాల సవాలును ప్రధాని మోదీ సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు.

2047 నాటికి భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుంది. దీనికి సంస్కరణలు, సాంకేతిక, జనాభా వంటి అంశాలు మద్దతు ఇస్తున్నాయని.. ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాత్కాలికమైన ఎదురు దెబ్బలు ఎదురైనా.. అవన్నీ దేశ పురోగతిని ఆపలేవని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ సొంత బ్రాండ్‌లను నిర్మించుకోవడం మీద దృష్టిపెట్టాలని సూచించారు.

ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ నాకు తెలుసు

సమావేశంలో తన రాజకీయ ప్రయాణాన్ని కూడా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం (టీడీపీ) అధినేతగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశాను. ప్రతి పక్షంలో కూడా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ నాకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వంటి సవాళ్లు రాష్ట్ర అభివృద్ధికి సవాళ్లుగా ఉన్నప్పటికీ.. నేను దేశ అభివృద్ధికి కట్టునది ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. మనమందరం కూడా దేశాభివృద్ధికి కట్టుబడి ఉండాలని అన్నారు.

మోదీ నాయకత్వంపై ప్రశంస

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సమయం, పరిస్థితులు, నాయకత్వం అన్నీ భారతదేశాన్ని నడిపిస్తున్నాయని అన్నారు. ”సరైన సమయం, సరైన స్థలం, సరైన నాయకుడు – అదే ప్రధాని మోదీ” అని చెప్పారు. ప్రపంచాన్ని భారత్ శాసించే రోజు తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశం శక్తిని ఏదీ ఆపలేదు.. ఎదురుదెబ్బలు తాత్కాలికంగానే ఉంటాయని అన్నారు.

భారతదేశంలో ఇప్పుడే.. అమెరికా, చైనా వంటి వాటికి ధీటుగా నిలబడగల శక్తిని సంపాదించింది. అయితే సమగ్ర వృద్ధి, సంక్షేమం వంటివి భారతదేశ అభివృద్ధికి మరింత దోహదపడతాయని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమం తప్పనిసరి. భవిష్యత్తులో మనం చూడబోయే భారతదేశం అన్ని వర్గాలను కలుపుకొని ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలు, ఉచితాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సీఎం సమాధానాలు ఇచ్చారు.

రాష్ట్రానికి పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తోంది. గడచినా ఏడాది కాలంలో రాష్ట్రానికి ఏకంగా రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. లక్ష్మి మిత్తల్ లక్ష కోట్ల రూపాయలతో స్టీల్ సిటీ నిర్మించబోతున్నారు. టీవీఎస్, గూగుల్ వంటి కంపెనీలు కూడా తమ పెట్టుబడులను మరింత పెంచనున్నాయి. ఇది రాష్ట్రంలో ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Comment