మంచితనం ఎక్కడున్నా.. ప్రశంసించాల్సిందే. పక్కవాడు బాగుపడితే చూడలేని ఈ లోకంలో నిజాయితీగా ఉండే మనుషులు దాదాపు అందరించిపోయారనే చెప్పాలి. అయితే అక్కడక్కడా.. అప్పుడప్పుడా మట్టిలో మాణిక్యం లాగా ఎదో ఒక మూలన కొందరు నిజాయితీపరులు వెలుగులోకి వస్తుంటారు. అలాంటి కోవకు చెందినవారిలో ఒకరే చెన్నైలోని పారిశుద్ధ్య కార్మికురాలి పద్మ.
45 తులాల బంగారం అప్పగింత
పద్మ చెత్తను తొలగించే పనే అయినా.. నిజాయితీతో నిలువెత్తు బంగారం అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి.. అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఈమె చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సైతం ఫిదా అయిపోయారు.
పద్మను సన్మానించిన రజనీ కాంత్
తనది కానీ వస్తువు బంగారమే అయినా.. తాను సొంతం చేసుకోకుండా నిజాయితీ చాటుకున్న పద్మను రజనీ కాంత్ గొప్పగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. శాలువాతో సన్మానించి.. ఒక బంగారు గొలుసు సైతం అందించారు. తలైవా చేసిన ఈ పనికి ఆమె ఎంతగానో సంతోషపడింది. రజనీ కాంత్ అభిమానులు కూడా ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష బహుమతి
పద్మ చేసిన పనికి తపాలా శాఖ ఆమె ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడమే కాకుండా.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా 15 లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీ అందించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం పద్మ నిజాయితీకి మెచ్చుకుని లక్ష రూపాయల నగదు బహుమతిగా ఇచ్చింది.
ఇంకా సమాజంలో మంచి వాళ్లున్నారు!
పరుల సొమ్ము పాము వంటిది అని మనం చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ మాటలను ఎవరు పాటిస్తున్నారు చెప్పండి?. ఆ మాటలు పుస్తకానికే పరిమితం చేసి.. పరుల సొమ్ము పాయసం లాంటిదని, పక్కవాళ్లను ముంచేస్తున్న మహానుభావులు సమాజంలో ఎంతోమంది. అయితే సోషలిటీలో అందరూ ఇలాంటి వాళ్లే ఉన్నారని చెప్పలేము. ‘పద్మ’లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు పద్మ వెలుగులోకి వచ్చారు. వారు వెలుగులోకి రాలేదు. అంతే తేడా. అయితే మంచి ఏ కొంచమైనా కనిపిస్తే.. ప్రతి ఒక్కరూ అభినందించాలి.
ఎంత మంచి మనసు!
45 తులాల బంగారం (450 గ్రాములు) ధర ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో (చెన్నై మార్కెట్లో) సుమారు రూ. 63 లక్షలు (450 x 14000 = 63 లక్షలు). ఇంత ఖరీదైన బంగారం కనిపిస్తే.. మూడో కంటికి కనిపించకుండా నొక్కేసేవాళ్లే ఎక్కువ. కానీ ఏ మాత్రం ఆశించకుండా పోలీసులకు అప్పగించాలంటే.. ఎంత మంచి మనసు అయి ఉండాలి.
ఇలాంటి సంఘటనలు గతంలో..
గతంలో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు.. తమ ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లు ఏదైనా మరిచిపోతే దానిని తిరిగి పోలీసుకులకు అప్పగించారు. ఇంకొందరు హాటల్ కార్మికులు కూడా.. అక్కడ బస చేసిన వాళ్ల వస్తువులను కూడా తిరిగి అప్పగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులైన.. పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఎందోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
హిమాన్షు కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.