Thursday, January 15, 2026

ఈ20 పెట్రోల్ మంచిదా.. కాదా!.. వాహనాల్లో సమస్యలు తప్పవా?

గత కొన్ని రోజులుగా ‘ఈ20 పెట్రోల్‘ (ఒక లీటరు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం) గురించి దేశం మొత్తం మీద చర్చలు మొదలయ్యాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని మంత్రులు చెబుతుంటే.. వాహనాలపై అవగాహన ఉన్న కొందరు ఇంజిన్ పనితీరు తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత?, ఇథనాల్ ఉపయోగిస్తే నిజంగానే ఇంజిన్ పనితీరు తగ్గిపోతుందా?, కేంద్రమంత్రులు ఎందుకు ఇథనాల్ ఉపయోగించాలని చెబుతున్నారు అనే విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం.

ఇథనాల్

నిజానికి భారతదేశంలో పెట్రోల్ కొరత ఉంది. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఇథనాల్ అనేది.. సాధారణ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, కాలుష్య కారకాల శాతం కూడా తగ్గుతుంది. దీనిని పూర్తిగా మనదేశంలోనే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది.

ఇథనాల్ ఉపయోగంపై నితిన్ గడ్కరీ

నిజానికి వాహన రంగంలో కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తులలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. దీనికి నిదర్శనం ఆయన వినియోగానికి హైడ్రోజన్ కారును ఉపయోగించడమే. ఇప్పుడు దేశంలో ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించాలని చెబుతున్నారు. జపాన్ వంటి దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మనం కూడా ఇథనాల్ వాడకాన్ని పెంచితే.. పెట్రోల్ దిగుమతి కొంత తగ్గుతుంది. ఇది దేశాన్ని ఆర్థికంగా కూడా కొంత బలపరుస్తుందని గడ్కరీ చెబుతున్నారు.

ఇథనాల్ వినియోగం వల్ల ఇంజిన్ పనితీరులో సమస్యలు వస్తాయనే మాట పూర్తిగా అబద్దమని ఇటీవలే గడ్కరీ స్పష్టం చేసారు. ఇతర దేశాల్లో ఇథనాల్ ఉపయోగిస్తున్నారు. అక్కడ ఇంజిన్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను పెట్రోల్ లాబీలే చేస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధనం ఇథనాల్ అని ఈయన స్పష్టం చేశారు. ఇది పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడుతుందని ఆయన అన్నారు.

ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందిలా..

భారతదేశంలో ఇథనాల్ వాడకం పెరిగితే.. ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి. దీనిని మొలాసిస్ (చెరుకు పిప్పి), మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. కాబట్టి దీనివల్ల రైతులు లాభాలను గడించవచ్చు. ఇది వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ఇథనాల్ ఉపయోగం.. పెట్రోల్ దిగుమతి తగ్గిస్తుంది. దీని వల్ల దేశం కూడా ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేస్తుంది.

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల నష్టమా?

భారతదేశంలో ఒకప్పుడు డీజిల్ కార్లు మాత్రమే ఉండేవి, ఆ తరువాత పెట్రోల్ కార్లు, ఇప్పుడు ఎలక్ట్రిక్.. సీఎన్‌జీ కార్లు ఉన్నాయి. అయితే గడ్కరీ.. ఒక లీటరు పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్.. మిగిలిన 20 శాతం ఇథనాల్ ఉపయోగించుకోవడం వల్ల సమస్య ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం పాత వాహనాలలో ఈ20 పెట్రోల్ ఉపయోగించి పరీక్షిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన కొంతమంది.. వాహన రంగానికి చెందిన ఇంజినీర్లు సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. తక్షణం ప్రభావం కనిపించదు. కానీ భవిష్యత్తులో ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయి. గ్యాస్కెట్లు, ఫ్యూయెల్ ఫిల్టర్స్, పైపులు కోతకు గురవుతాయని చెబుతున్నారు.

Himansh
Himansh
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here