‘రమణ మహర్షి సందేశం.. నిశ్శబ్దమే గొప్ప గురువు’

పూరి మ్యూజింగ్స్‌లో రమణ మహర్షి జీవితం, ఆత్మ విచారణపై పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతి, ధ్యానం సందేశం గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా తన ‘పూరి మ్యూజింగ్స్’ కార్యక్రమంలో రమణ మహర్షి జీవితం, ఆయన ఆత్మవిచారణ సిద్ధాంతం గురించి వివరించారు. “మనలోనే ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి.. నీ గురించి నువ్వు తెలుసుకుంటే మిగతావన్నీ అర్థమవుతాయి” అనే రమణ మహర్షి సందేశాన్ని ఆయన ప్రస్తావించారు. ధ్యానం, మౌనం, ఆత్మజ్ఞానం గురించి మహర్షి చెప్పిన విషయాలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

పూరి జగన్నాథ్ తన ప్రసంగంలో రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్ అని తెలిపారు. 1879లో తమిళనాడులో జన్మించిన ఆయనకు 16 ఏళ్ల వయసులో ఆత్మానుభవం కలిగిందని చెప్పారు. “నేను ఎవరు?” అనే ప్రశ్న ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని వివరించారు. అనంతరం ఆయన ఇంటిని విడిచి తిరువణ్ణామలై చేరుకుని అరుణాచల కొండపై ధ్యానం ప్రారంభించారని పేర్కొన్నారు.

రమణ మహర్షి బోధనల్లో ముక్యంగా ‘ఆత్మ విచారణ’ అనే తత్వం ఉందని పూరి చెప్పారు. మనసును లోపలికి తిప్పి నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ విచారణ అని ఆయన వివరించారు. మరణం, జీవితం, ఆత్మ గురించి లోతుగా ఆలోచిస్తూ మహర్షి ధ్యానంలో లీనమయ్యారని తెలిపారు. చాలా సంవత్సరాలు ఆయన మౌనంగా గడిపారని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారని గుర్తుచేశారు.

రమణ మహర్షి జీవితం గురించి..

పూరి జగన్నాథ్ ప్రకారం.. రమణ మహర్షి మొదట విరూపాక్ష గుహల్లో నివసించేవారు. ధ్యానంలో అంతగా లీనమై ఉండేవారని, పిల్లలు లేదా పురుగులు శరీరాన్ని గాయపరిచినా ఆయన బయటకు రాకపోయేవారని పేర్కొన్నారు. ఆ స్థితిలోనే ఆయనకు జ్ఞానోదయం కలిగిందని చెప్పారు.

ఆయన జీవితం పూర్తిగా సాదాసీదాగా ఉండేదని పూరి వివరించారు. ఆశ్రమంలో స్వయంగా వంట చేసేవారని, కూరగాయలు తరిగేవారని చెప్పారు. భోజనం కూడా చాలా సాధారణంగా ఉండేదని, అందరితో కలిసి కూర్చుని భోజనం చేసేవారని తెలిపారు.

రమణ మహర్షి జంతువులను కూడా మనుషుల్లాగే గౌరవించేవారని పూరి పేర్కొన్నారు. ఆశ్రమంలో ఉన్న ‘లక్ష్మి’ అనే ఆవుపై ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేదని చెప్పారు. కోతులు, కుక్కలు, నెమళ్లు ఎలాంటి భయం లేకుండా ఆశ్రమంలో తిరిగేవని తెలిపారు. ప్రతి జీవిలో ఆత్మ ఉందనే భావనతో జంతువులను కూడా గౌరవించేవారని వివరించారు.

నిశ్శబ్దమే గొప్ప గురువు!

రమణ మహర్షి సందేశాల్లో మౌనం, శాంతి, ప్రేమ ముఖ్యమని పూరి జగన్నాథ్ తెలిపారు. చాలా ప్రశ్నలకు ఆయన నవ్వుతోనే సమాధానం చెప్పేవారని పేర్కొన్నారు. ఆ నవ్వులోనే ఒక అర్థం ఉండేదని చెప్పారు.

“నిశ్శబ్దం అత్యంత శక్తిమంతమైన గురువు” అని రమణ మహర్షి చెప్పేవారని పూరి గుర్తుచేశారు. మనలోనే శాంతి ఉందని, బయట వెతకాల్సిన అవసరం లేదని మహర్షి బోధించారని వివరించారు. ఆత్మజ్ఞానం ద్వారా మనిషి జీవిత సత్యాన్ని తెలుసుకోగలడని ఆయన పేర్కొన్నారు.

పూరి మాట్లాడుతూ.. రమణ మహర్షికి ఎంతోమంది అనుచరులు ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ గురువునని చెప్పుకోలేదని అన్నారు. ఆయన చివరి శ్వాస విడిచిన ప్రదేశంలో ఆలయం నిర్మించారని తెలిపారు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి ధ్యానం చేయడంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.

అరుణాచలం ఆశ్రమం ప్రత్యేకత

శ్రీ రమణాశ్రమం పవిత్రమైన అరుణాచలం కొండ పాదాల వద్ద ఉందని పూరి తెలిపారు. ఈ ఆశ్రమం నిశ్శబ్ద వాతావరణంతో ధ్యానం చేసేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని సూచించారు.

రమణ మహర్షి చివరిగా చెప్పిన మాటలను కూడా పూరి ప్రస్తావించారు. “‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం కాదు. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి, తన గురించి తాను తెలుసుకోవడమే అసలైన సమాధానం” అని మహర్షి చెప్పారని వివరించారు. పూరి జగన్నాథ్ చెప్పిన ఈ ఆధ్యాత్మిక అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆత్మవిచారణ, ధ్యానం, మానసిక ప్రశాంతతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read: ఫోన్‌లోనే జనగణన నమోదు ప్రక్రియ – ఎలా అంటే?

Shaurya Vardhan
Shaurya Vardhan
శౌర్య వర్ధన్ - నేను సబ్ ఎడిటర్‌గా MarthaTelugu వెబ్‌సైట్‌లో పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించిన వార్తలు రాయడం నా ప్రత్యేకత. టాలీవుడ్, బాలీవుడ్ మొదలైన రంగాల వార్తలు, రివ్యూలు విశ్లేషించి రాయగలను. చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles