Home Blog Page 117

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సక్సెస్: కారణం చెప్పిన తిరువీర్

0

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది నిన్న (2025 నవంబర్ 07) థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ఈ మూవీలో ఒక తిరువీర్ తప్పా దాదాపు మిగిలిన వారంతా కూడా కొత్తవారే. మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొత్తవారే కావడం గమనార్హం. ఏ మాత్రం అంచనాలు లేకుండా మాములుగా విడుదలైన, ఒక సాదసీదా చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అయితే ఆ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేశారు. దీనికి సంబంధించిన విజయోస్తవ సభను మూవీ టీమ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్ ఏమన్నారంటే..

తిరువీర్ కొత్త పంథా

సినిమా ఫంక్షన్లలోనే కాదు, సాధారణంగా.. చాలా కార్యక్రమాల్లో మాట్లాడే వ్యక్తులంతా కూడా ప్రారంభంలో ఏం చెప్పాలో తెలియక ఇష్టం ఉన్నా లేకున్నా మీడియావారికి, పోలీస్ వారికి ఇంకా కొన్ని పేర్లు చెప్పి తరువాత అందరికీ నమస్కారం అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొంతమంది వారి వారి శైలిలో వారికి తోచింది చెబుతుంటారు. అయితే తిరువీర్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పలేదట. మరి ఎందుకో ఏమో కారణాలు అయితే తెలియదు.

ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ చర్చించాల్సి వచ్చింది అంటే.. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. ఈ సంధర్బంగా హైదరాబాద్‌లో బ్లాక్బస్టర్ సక్సెస్‌ఫుల్‌ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.

సినిమా విజయానికి కారణం

ఇందులో భాగంగా మూవీ హీరో తిరువీర్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు సాధారణంగా అందరు చెప్పినట్టు గా మీడియా వారికి నమస్కారం, ఇక్కడ కి వచ్చినందుకు ధన్యవాదములు అని నేను ఎప్పుడు చెప్పలేదు. మామూలుగా అందరికీ నమస్కారం అని చెబుతుంటాను. కానీ ఫస్ట్ టైమ్ నాకు మీడియా విలువ ఏంటో తెలిసింది. ఇప్పుడు చెబుతున్న మీడియా వారికి శిరస్సు వంచి దండం పెడుతున్నా అన్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక రిపోర్టర్, ఒక క్రిటిక్ రైటర్.. మీడియా వ్యక్తులు, వెబ్‌సైట్ కూడా ఒక్క నెగెటివ్ రివ్యూ ఇవ్వలేదని అర్థమైంది. మీడియా కారణంగానే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. కాబట్టి ఆయన అలా చెప్పుకొచ్చారు.

సక్సెస్.. వాళ్లకు బలం

ఇంకో విషయం ఏమిటి అంటే ఎవరు కూడా సినిమాకి రేటింగ్ 2.7 తగ్గించి ఇవ్వలేదు. అంతకు పైనే అందరు ఇచ్చారు. పెద్ద పెద్ద మూవీ వాళ్లకు నెగెటివ్ చెప్పే వాళ్లు కూడా ఈ రోజు “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ” సినిమాకు మంచి రివ్యూ ఇవ్వడం సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ప్లస్ అయింది. అంతేకాకుండా సినిమా కూడా చాలా న్యాచురల్‌గా, కామెడీ కోసమే ఎక్కడ కూడా బూతులు వాడకుండా ఒక స్వచ్ఛమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం వాళ్ల కూడా విజయానికి కారణం అయింది. కొత్తగా పరిచయమైన మూవీ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్ సందీప్‌లకు మరిన్ని సినిమా ప్రయోగాలు చేయడానికి ఈ సక్సెస్ ఒక బలాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు.

2025లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!: ధర రూ.1.5 లక్షల కంటే తక్కువ

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరగడమే. నగర ప్రయాణం చేయడానికి, మెయింటెనెన్స్ తగ్గించుకోవడానికి.. చాలామంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని ఐదు ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి తెలుసుకుందాం.

ఏథర్ 450ఎస్

దేశీయ విఫణిలో చాలామందికి నచ్చిన.. ఎంతోమంది మెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ 450ఎస్ ఒకటి. దీని ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఆకర్షణీయంగా ఉండే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. కాబట్టి ఇది ఒక ఫుల్ ఛార్జితో 122 కిమీ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కాగా ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 90 కిమీ / గం కాగా.. ఇది 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 3.9 సెకన్లు మాత్రమే.

ఈ స్కూటర్ యొక్క డీప్ వ్యూ డిస్‌ప్లే రియల్ టైమ్ న్యావిగేషన్, రైడింగ్ మోడ్స్, కనెక్టెడ్ ఫీచర్స్ వంటివన్నీ ఉన్నాయి. ధర కొంత తక్కువగా ఉండటమే కాకుండా.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా ఎక్కువమంది ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి కారణం అవుతోంది.

టీవీఎస్ ఆర్బిటర్

రూ. 99,900 ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభించే టీవీఎస్ కంపెనీకి చెందిన ఆర్బిటర్ మన జాబితాలో.. 5 ఉత్తమమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులోని 3.1 కిలోవాట్ బ్యాటరీ 115 కిమీ దూరం ప్రయాణించడానికి అనుమతిస్తుంది. 68 కిమీ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్.. 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. కొంత ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వాటికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, యూఎస్బీ ఛార్జింగ్, డ్యూయల్ రైడింగ్ మోడ్స్ వంటివి ఉన్న ఈ టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ వినియోగానికి ఉత్తమమైన ఎంపిక. ఇది భిన్నమైన డిజైన్ పొందుతుంది. తద్వారా.. ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది.

హీరో విడా వీ2 ప్రో

మన జాబితాలో అత్యుత్తమమైన ఐదు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో.. హీరో విడా వీ2 ప్రో కూడా ఒకటి. దీని ధర రూ. 1.20 లక్షలు. ఇది కూడా 115 కిమీ రేంజ్ పరిధిని అందిస్తుంది. దీనికోసం కంపెనీ 3.94 కిలోవాట్ బ్యాటరీని ఫిక్స్ చేసింది. ఇందులోని 6 వాట్స్ ఎలక్ట్రిక్ మోటారు 25 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కిమీ/గం. ఇది రిమూవబుల్ బ్యాటరీ పొందుతుంది. నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. మొత్తం మీద మంచి పనితీరును అందిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటరుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం. దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 3.5 కిలోవాట్ బ్యాటరీ 145 కిమీ దూరం ప్రయాణించడానికి సహకరిస్తుంది. దీని గరిష్ట వేగం 78 కిమీ. అండర్ సీట్ స్టోరేజ్, కనెక్టెడ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నగర ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ స్కూటర్.. నమ్మికైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

బజాజ్ చేతక్ 3501

రూ. 1.22 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బజాజ్ చేతక్ 3501 ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 153 కిమీ పరిధిని అందిస్తుంది. మెటల్ బాడీ కలిగి ఉండటం వల్ల.. ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 73 కిమీ కాగా.. బ్యాటరీ ప్యాక్ ఐపీ67 రేటింగ్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. పనితీరు పరంగా ఇది ఉత్తమంగా ఉంటుంది.

మొలకెత్తిన బంగాళాదుంప: తింటే వచ్చే సమస్యలు

కొన్ని మొలకెత్తి తింటే మంచిదంటారు. మరికొన్ని మొలకెత్తినవి తింటే ప్రమాదంటారు. నిజానికి పెసలు వంటివి మొలకెత్తి తినడం వల్ల.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొలకెత్తిన బంగాళా దుంప (పొటాటో) తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా ప్రమాదం?, దీనివల్ల జరిగే అనర్దాలు ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మొలకెత్తిన బంగాళాదుంప – సమస్యలు

ఈ రోజుల్లో చాలామంది బంగాళాదుంపను దాదాపు అన్ని వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటారు. వంటకాలు పక్కనపెడితే.. ఫ్రెంచ్ ప్రైస్, చీజ్ బాల్స్ వంటివాటితో మాత్రమే కాకుండా.. చాలామంది ఇష్టంగా తినే పానీపూరీలో కూడా పొటాటోను విరివిగా ఉపయోగిస్తుంటారు. మొలకెత్తని బంగాళాదుంప వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ మొలకెత్తిన బంగాళాదుంప అయితేనే సమస్య.

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్, చాకోనిన్ అనే రెండు గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవెల్స్ నిర్వహించడంలో సహాయపడతాయి. ఎక్కువైతే.. ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు

➤గ్లైకోఅల్కలాయిడ్ తీసుకోవడం వల్ల.. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని పరిమాణం ఎక్కువైతే లేదా గ్లైకోఅల్కలాయిడ్ ఎక్కువైతే.. తలనొప్పి, జ్వరం, పల్స్ పెరిగిపోవడం, లో బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయని హెల్త్‌లైన్ స్పష్టం చేసింది.

➤బంగాళాదుంపలు మొలకెత్తినట్లయితే.. గ్లైకోఅల్కలాయిడ్ ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నాం. అంటే బంగాళాదుంప ఆకులు, పువ్వులు, మొలకెత్తిన ప్రాంతాల్లో గ్లైకోఅల్కలాయిడ్ ఉంటుంది. కాబట్టి మొలకెత్తిన పొటాటో తినడం వల్ల.. జీర్ణాశయానంతర సమస్యలు మాత్రమే కాకుండా.. నాడీ సంబంధ రుగ్మతలు ఏర్పడతాయి. తలనొప్పి, వికారం, తిమ్మిర్లు, వాంతులు వంటివి కూడా సంభవిస్తాయి.

➤సాధారణ బంగాళాదుంప కంటే.. మొలకెత్తిన బంగాళాదుంపలు రుచికి చేదుగా ఉంటాయి. దీనికి కారణం అధిక స్థాయిలో ఉండే గ్లైకోఅల్కలాయిడ్స్. తినడానికి కూడా అంత బాగుండదు. ఇలాంటివి తినకపోవడమే మంచిది.

➤పోషక విలువలు కూడా మొలకెత్తిన బంగాళాదుంపలో చాలా తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే బంగాళాదుంప మొలకెత్తుతుందో. అప్పుడే పోషకాలు నశించడం ప్రారంభమవుతుంది. కాబట్టి వీటిని తింటే.. పోషకాల సంగతి దేవుడెరుగు, అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

సమస్యను తగ్గించే మార్గాలు

మొలకెత్తిన బంగాళాదుంపలో.. కళ్ళు, ఆకుపచ్చగా ఉండే తొక్క, మొలకలు వంటి భాగాలను తొలగించడం వల్ల కొంతవరకు ఇందులో గ్లైకోఅల్కలాయిడ్ తగ్గించవచ్చు. అంతే కాకుండా ఉడకబెట్టడం, కాల్చడం లేదా మైక్రోవేవ్ చేయడం వల్ల కూడా ఓ స్థాయిలో విషపదార్థాలను తగ్గించవచ్చు.

పరిష్కారం ఇదే..

బాటమ్ లైన్నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం.. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగిచకపోవడమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళాదుంపను తినకూడదు అనుకుంటే.. పొటాటోను వీలైనంత వరకు నిల్వ చేయకుండా ఉండటం మంచిది. ఒక వేళా మీ దగ్గర బంగాళాదుంపలు ఉంటే.. వాటిని పొడి ప్రదేశాల్లో నిల్వచేయడం ఉత్తమం. మొత్తం మీద బంగాళాదుంపను ఇష్టంగా తినేవారు.. ప్రతి ఒక్కరూ మొలకెత్తిన బంగాళాదుంప వల్ల వచ్చే సమస్యలను తెలుసుకోవాలి. లేకుంటే.. అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారు అవుతారు.

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ కొన్న తొలి హీరోయిన్: కారు రేటెంతో తెలుసా?

సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నటి మృణాళిని రవి.. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన లిమిటెడ్ ఎడిషన్ కొనేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోస్ అన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కారు కొన్న శుభ సందర్భంగా.. నటికి అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మహీంద్రా స్పెషల్ ఎడిషన్

మృణాళిని రవి కొనుగోలు చేసిన మహీంద్రా కారు.. బీఈ6 బ్యాట్‌మెన్ ఎడిషన్. ఈ కారును కంపెనీ 2025 ఆగస్టులో మార్కెట్లో లాంచ్ చేసి.. కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కానీ దీనికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో సంస్థ.. ఈ కారును 999 మందికి విక్రయించాలని నిర్ణయించుకుంది. అంతే 999 యూనిట్లను విక్రయిస్తుందన్నమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి దీని ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).

చూడటానికి సాధారణ మహీంద్రా బీఈ6 మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగినట్లుగానే.. బ్యాట్‌మెన్ చిత్రాలను అక్కడక్కడా చూడవచ్చు. ఇది ప్రత్యేకమైన శాటిన్ బ్లాక్ కలర్ ఎంపికలో లభిస్తుంది. కాబట్టి ఇది సాదరణ మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రత్యేకతలు

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ బీఈ6 కారులో స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీ ఫోబ్ వంటి ప్రదేశాల్లో ఆల్కెమీ గోల్డ్ యాక్సెంట్లతో కూడిన డార్క్ థీమ్ క్యాబిన్ ఉంటుంది. కారు లోపలి కార్నర్ భాగం.. బ్రష్డ్ గోల్డ్‌లో పూర్తి చేయబడి ఉండటం చూడవచ్చు. సీట్లు చార్‌కోల్ లెదర్, కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ పొందుతాయి. లోపల కూడా బ్యాట్ లోగోలు ఉన్నాయి. రూఫ్‌లో కూడా సిగ్నేచర్ డార్క్ నైట్ ఎంబ్లెమ్ ఉంటుంది. పుడిల్ లాంప్స్ బ్యాట్ లోగోను ప్రాజెక్ట్ చేస్తాయి. మొత్తం మీద ఇది సాధారణ బీఈ6 కంటే కూడా హుందాగా ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఈ6 టాప్ స్పెక్ వేరియంట్ ఏ ఫీచర్స్ పొందుతుందో.. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కూడా దాదాపు అదే ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో.. ఫిక్స్‌డ్ పనోరమిక్ రూఫ్, 16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మొదలైన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

బ్యాటరీ వివరాలు & పరిధి (రేంజ్)

మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 76 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక పూర్తి ఛార్జితో 682 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాగా ఇది 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది డీఫాల్ట్, రేంజ్, ఎవ్‌రిడే, రేస్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. కాబట్టి డ్రైవింగ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మృణాళిని రవి గురించి..

నిజానికి ఒకప్పుడు డబ్‌స్మాష్, రీల్స్, వీడియోలు చేస్తూ ఉండే మృణాళిని రవికి డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ మొదటిసారి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. అలా 2019లో సూపర్ డీలక్స్ సినిమాలో.. అరంగేట్రం చేసిన మృణాళిని, ఆ తరువాత గడ్డలకొండ గణేష్, ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కొనుగోలు చేసిన మొదటి నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

రామ్ చరణ్ పెద్ది లేటెస్ట్ అప్డేట్: చికిరి చికిరి వచ్చేసింది!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా టీమ్ మూవీ కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసింది. బుచ్చిబాబు ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యానర్‌పైన వెంకట సతీష్ కిలరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా నిర్మాణంలో బాగమయ్యాయి. ఏఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చికిరి చికిరి సాంగ్

పెద్ది చిత్రం నుంచి ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. చికిరి చికిరి అనే పేరుతో ఒక మెలోడీ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇది ఏఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన గీతంగా మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. మోహిత్ చౌహాన్ ఈ పాటను ఆలపించారు. రెహమాన్ బాణికి బాలాజీ సాహిత్యాన్ని అందించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేశాడు. చికిరి పాట విడుదలైన కొన్ని గంటల్లోనే.. ఒక తెలుగు వీడియో మాత్రమే దాదాపు ఒక కోటి మందికి పైగా వీక్షించారు. ఇంకా మిగిలిన భాషల్లో కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారు. ప్యాన్ ఇండియా లెవెల్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) బాషలలో సాంగ్ రిలీజ్ అయి ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్లోకి దూసుకెల్తోంది. బుచ్చిబాబుకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్. రెహమాన్ ఒక్కరంట అందుకే ఈ సినిమాకు ఆయనతో వర్క్ చేస్తున్నాడట.

రామ్ చరణ్ డ్యాన్స్ హైలెట్

వీడియో సాంగ్‌లో రామ్ చరణ్ డ్యాన్స్ హైలెట్ అనే చెప్పాలి. పల్లెటూరులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని వేసే స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. తన మొదటి సినిమా చిరుత గుర్తుకొస్తున్నదని.. డ్యాన్స్‌లో ఆ గ్రేస్ కనిపిస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో రామ్ చరణ్ అభిమానులకు ఫుల్ స్టఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ సిటీ అమ్మాయిగా కనిపిస్తోంది. వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పియానోతో, మూవీ డైరెక్టర్ బుచ్చి బాబు పాటని ఆస్వాదిస్తూ, సింగర్ మోహిత్ చౌహాన్ లిరిక్స్ పేపర్ పట్టుకుని కనిపించి మంచి అట్రాక్షన్ క్రియేట్ చేశారు.

పెద్ది విజయం సాధిస్తుందా?

హీరో లొకేషన్స్ ఎక్కువగా అడవి ప్రాంతంలో, మారుమూల పల్లెటూరులో, హీరోయిన్ పాత్ర సిటీ ఏరియాలో షూటింగ్ చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్యారెక్టర్లకు తగినట్టు ఎంపిక చేసిన ప్రదేశాలు అన్నీ కూడా చూడటానికి అత్యంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మాస్ కుర్రాడి పాత్రలో బాగున్నాడు. 1980ల్లో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అని ప్రచారంలో ఉన్నది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిరాశపరిచినప్పటికి.. పెద్ది సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప విజయాన్ని అందిస్తుందని ఈ చికిరి చికిరి పాట చూస్తే అర్థమైపోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లలో గడ్డం, పొడుగు జుట్టు, ముక్కుకు పోగు పెట్టుకుని సినిమా పట్ల హైప్ తీసుకొచ్చారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వయేందు శర్మ లాంటి వారు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2025 ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లాంచ్: ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో..

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లాంచ్ చేసింది. ఇది చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక గొప్ప అప్డేట్ పొందింది. కాబట్టి ధరల్లో కూడా వ్యత్యాసం ఏర్పడింది. ఈ లేటెస్ట్ 2025 బైక్ గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ మీకోసం!

వేరియంట్స్.. ధరలు

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే టాప్ ఎండ్ వేరియంట్ మాత్రమే ప్రధాన అప్డేట్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. కాబట్టి దీని ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).

  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్: రూ. 1,40,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ సింగిల్ సీట్: రూ. 92,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ ఓబీడీ2బీ: రూ. 92,500
  • ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్ ఓబీడీ2బీ: రూ. 89000 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

ప్రధాన అప్డేట్ & ఫీచర్స్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్.. ప్రధానంగా డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ థ్రోటిల్‌తో పాటు.. మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ డిస్‌ప్లే కూడా ఇందులో కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ప్రీమియం బైకు మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి రైడర్లను ఆకట్టుకోవడంలో ఇది సక్సెస్ సాదిస్తుందని భావిస్తున్నాము.

కలర్ ఆప్షన్స్ & ఇంజిన్ వివరాలు

బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ మ్యాట్ షాడో గ్రే, బ్లాక్ లీఫ్ గ్రీన్ అనే మూడు కొత్త రంగుల్లో లభించే ఈ బైక్.. 124.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.4 బీహెచ్పీ పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ 5.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 66 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మెకానికల్ అప్డేట్స్

2025 హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్.. ఛాసిస్ సెటప్ ఎలాంటి మార్పు పొందలేదు. కాగా ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయెల్ హైడ్రాలిక్ షాక్ పొందుతుంది. బ్రేకింగ్ అప్డేట్ పొందింది. కాబట్టి ఇది 276 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ బైక్ ముందు భాగంలో 90/90, వెనుక భాగంలో 120/80 ట్యూబ్‌లెస్ టైర్‌లతో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125 అప్డేట్ బైక్.. 794 మిమీ ఎత్తైన సీటును పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. అంటే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే.. సుమారు 600 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది తెలుస్తోంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ 136 కేజీలు మాత్రమే. కాబట్టి రైడింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2025 ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద అప్డేట్స్ పొందలేదు. కానీ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. ఇది రైడర్ల భద్రతను నిర్థారిస్తుంది. రోడ్డుపై బైక్ స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది: రూ.64999 మాత్రమే!

ఇండియన్ మార్కెట్లో రూ. లక్ష నుంచి రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన బైకులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బైకులు దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్నా.. తక్కువ ధరలో లభించే బైకులకు లేదా స్కూటర్లకు డిమాండ్ ఎక్కువ. అందులోనూ లక్ష రూపాయల కంటే.. తక్కువ ధరలో లభించే వాటికి కొంత ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని న్యూమెరోస్ మోటార్స్ ఒక సరసమైన ఎలక్ట్రిక్ టూ వీలర్ లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

బెంగళూరుకు చెందిన.. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే స్టార్టప్ కంపెనీ న్యూమెరోస్ మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని పేరు ఎన్ ఫస్ట్. దీని ప్రారంభ పరిచయ ధర రూ. 64999 (ఎక్స్ షోరూమ్). ఈ ధర మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరుగుతుంది. అయితే ఎంత పెరుగుతుందనే విషయాన్ని కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు.

రోజువారీ వినియోగానికి

యువతను దృష్టిలో ఉంచుకుని.. అందులోనూ ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. తక్కువ బరువున్న ఈ స్కూటర్.. మంచి పనితీరును అందిస్తూ.. రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. నగర ప్రయాణానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ఈ స్కూటరును ఇటాలియన్ డిజైన్ స్టూడియో వీలాబ్ సహకారంతో రూపొందించింది.

ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అందులో కొన్ని ఈవీ యాప్ ద్వారా కనెక్టెడ్ ఫీచర్స్, డేటా లీడ్ రైడ్ గణాంకాలతో పాటు.. దొంగతనం, టో హెచ్చరికలు, జియో ఫెన్సింగ్, రిమోట్ లాకింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. ఆధునిక కాలంలో ఇలాంటి ఫీచర్స్ చాలా అవసరమవుతాయి. ఈ స్కూటర్ ట్రాఫిక్ రెడ్, ప్యూర్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

సింగిల్ ఛార్జ్.. 109 కిమీ రేంజ్!

సుమారు ఐదు వేరియంట్లలో లభించే న్యూమెరోస్ ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ వేరియంట్ ఐ-మ్యాక్స్ ప్లస్ వేరియంట్ 3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 109 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా ఇందులోని 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 91 కిమీ రేంజ్ అందిస్తుంది. అన్ని వేరియంట్లు.. చైన్ డ్రైవ్‌తో మిడ్ మౌంటెడ్ పీఎంఎస్ఎమ్ మోటారును పొందుతాయి. ఇది ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి 5 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇందులోని బ్యాటరీ వేడి, చల్లదనాన్ని తట్టుకునేలా ఉంటుంది.

బుకింగ్స్

న్యూమెరోస్ మోటార్స్ కంపెనీ.. తన ఉనికిని దేశంలోని విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ బెంగళూరు, చెన్నై, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రాంతాల్లో.. డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరిస్తుంది. 2020లో ప్రారంభమైన ఈ కంపెనీ బెంగళూరు సమీపంలో 70,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం కలిగిన తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కాగా కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

నేనొక చిత్రమైన పాత్ర చేశా!.. కాంత గురించి ముందే చెప్పిన రానా

0

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన చిత్రం కాంత. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ లు ఇద్దరు కలిసి ఈ సినిమాను వారి నిర్మాణ సంస్థలైన.. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సెల్వమని సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.

దాదాపు 1950ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామా కథ ఇది. ఆనాడు మద్రాసు (చెన్నై)లో ఉన్న ఏవిఎం స్టూడియోస్ & విజయ వాహిని స్టూడియోస్ లాంటి వాటిలో అప్పుడు నిర్మాతలకు, డైరెక్టర్లకు, సంగీత దర్శకులకు, నటులకు, ఇతరత్ర సాంకేతిక నిపుణులకు వారి వారి మధ్య ఉన్న అహం వలన ఎటువంటి రాజకీయాలు నడిచేవి, ఎవరెవరి జీవితాలు ఎలా తారుమారయ్యేవి అనేది చాలా ఆసక్తిగా ఈ సినిమాలో చూపించనున్నారు.

ఆయన జీవితం ఆధారంగానే..

ఒకప్పటి ప్రఖ్యాత నటుడు మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకేక్కింది. ఆయన ఎదుగుదల, ఒడిదుడుకులు మరియు ఆ సమయంలో ఉన్న తమిళ, తెలుగు ముఖ్య కథానాయకులు, దర్శక, నిర్మాతల పాత్రలు కూడా ఇందులో కనిపించునున్నాయి.

ఇప్పుడంటే మీడియాను మించిన సోషల్ మీడియా వచ్చింది. టెక్నాలజీ పెరిగింది. స్టూడియోస్ చాలా వచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో ఏం జరిగినా.. క్షణాల్లో బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్నంత ప్రచారం, సమాచారం, టీవీలు, వార్త పత్రికలు అప్పట్లో అంతగా లేవు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చాలామందికి తెలిసేది కాదు, కొద్దిమందికి తప్పా. అందుకే జనాలు కూడా వారు ఏదో చాలా గొప్పవాళ్లుగా ఊహించుకునే వారు. సినిమా వాళ్ల జీవన విధానం, అలవాట్లు, ప్రవర్తన శైలి ఇంకా అనేకం వారి గురించి తెలుసుకోవాలని, వారిని చూడాలనే ఆత్రుత, ఆరాటం కనిపించేవి. మాములుగా ఇతరుల జీవితాల్లో ఏమి జరుగుతుందో, ఏంటో తెలుసుకోవాలని చూసే అలవాటు ఉన్న జనాలే ఎక్కువ కాబట్టి ఈ సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది అనిపిస్తుంది.

విచిత్రమైన పాత్రలో రానా

రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ఇందులో పీనిక్స్ అనే ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. ఈ కాంత సినిమా కు సంబందించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రానా మీడియాతో మాట్లాడుతూ తాను ఒక విచిత్రమైన పాత్ర చేశానని ఆ కాలంలో ఎవరు అంత వైలెంట్‍గా ఉండరని, అయితే ఏ రిఫరెన్స్ లేకుండా చేసిన క్యారెక్టర్‌గా ఆయన చెప్పుకొచ్చారు. ఒక గురు శిష్యుల మధ్య జరిగే డ్రామా అని కూడా తెలిపాడు. చాలా రోజుల తరువాత ఇలా జనాల మధ్యలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఎవరిని నొప్పించదని కచ్చితంగా అందరికి నచుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి రిలీజ్ వరకూ ఆగాల్సిందే మరి.

తెలుగు సినిమా గతి మార్చిన వర్మ.. శివ రీ-రిలీజ్: కొత్తగా ఏముంటుందంటే?

0

కాలేజీ విద్యార్థుల మధ్య జరిగే స్టూడెంట్ రాజకీయాలు, ఎన్నికలు.. ఇందులో బయటి వ్యక్తులు చేరి స్టూడెంట్స్ మధ్యలో గొడవలు, సమస్యలు తీసుకురావడం. కాలేజీకి సంబంధం లేని రాజకీయ పార్టీల నాయకులు వారికి కొమ్ముకాసే రౌడీలు విద్యార్థులను వారి స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం. వీటితో విసిగిపోయి. అలవాటు పడిన వాళ్ల మధ్యకి వచ్చి చేరిన హీరో శివ (నాగార్జున), వాటన్నిటిని ఎదిరించి, కొట్లాడి ఎలా నిలబడ్డాడు, ఆ పరిస్థితుల నుంచి విద్యార్థులను, ఆ సమాజాన్ని ఎలా బయటేయగలిగాడు అన్నదే స్టోరీ.

సినిమా పేరు: శివ.
విడుదల తేదీ: 1989 అక్టోబర్ 05.
దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర
సంగీతం: ఇళయరాజా
కెమెరా: ఎస్. గోపాల్ రెడ్డి
అసిస్టెంట్ డైరెక్టర్స్: పూరీ జగన్నాథ్, గుణశేఖర్, తేజ, ఉత్తేజ్
రచయిత: తనికెళ్ళ భరణి
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు: అక్కినేని నాగార్జున, అమల, రఘవరన్, కోట శ్రీనివాసు రావు, గొల్లపూడి మారుతిరావు తదితరులు

మాస్ హీరోగా నాగార్జున

అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన చిత్రం శివ. నాగార్జునకి అప్పటిదాక తన సినిమా జీవితంలో ఎప్పుడు లేనంత మాస్ ఫాలోయింగ్, అద్భుతమైన.. అఖండమైన విజయాన్ని తీసుకొచ్చింది శివ. నాగ్ నటనా శైలిలో కొత్త మార్పులు చేర్చి డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఎంత వరకు మాట పలకాలి, ఏ విధంగా చెప్పాలి.. అభినయం ఎంతమేరకు చూపించాలి అని అన్నీ కూడా వర్మ మర్చివేశాడు. తెలుగు సినిమా కుర్రాళ్లు శివ వచ్చేవరకు ఒక టైపు సినిమాలకు అలవాటుపడ్డారు. శివ వచ్చాక సినిమాలు చూసే తీరే మారిపోయింది. నాగార్జున ఒక మాస్ కథానాయకుడిగా స్థిరపడటానికి శివ బీజం వేసింది.

సినిమా గతి మార్చిన వర్మ

1989 సంవత్సరం నాటి వరకు ఒక మూస పద్ధతిలో నడుస్తున్న భారతీయ చలన చిత్రాల గతిని మార్చి తనదైన సినిమా పరిజ్ఞానంతో ఒక సరికొత్త పంథాను అవలంభించిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే మార్పకి కారణమయింది. తను తీసుకున్న కథా వస్తువు సాధారణమైనప్పటికి.. వర్మ తనకి తగినట్టు మలుచుకోవడంలో జాగ్రత్త వహించాడు. కథనాన్ని నడిపించిన పద్ధతి, అందరూ అరితేరిన నటనాచతుర్యం కలిగినప్పటికి వారిలో వారికే తెలియని ఒక కొత్త నటనను రాబట్టుకున్న నైపుణ్యం, తాను సినిమా ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు చదివి, వీని, చూసి వాటన్నింటిని ఆర్జీవీ ధృక్ఫథంలోకి మార్చుకొని ఒక స్పష్టతతో చలన చిత్ర రంగానికి నవ అధ్యాయాన్ని లిఖించి బాటలు వేశాడు. ఎంతగా అంటే.. శివ సినిమాకు, ముందు శివ సినిమాకు తరువాత అన్న విధంగా మర్చివేసాడు.

ఆర్జివీ తన ఆలోచనలు తెరకేక్కించాలన్నా, తనకున్న సినిమా విజన్ తెరపై చూపించాలన్నా అందుకు తగిన ధనము.. తనను నమ్మి ముందడుగు వేయగలిగే అనుభవమున్న నిర్మాతలు అవసరం. ఆ విధంగా నమ్మకంతో డబ్బులు పెట్టిన వ్యక్తులే ఈ అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర. అక్కినేని వాళ్ల సొంత నిర్మాణం అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తీయడం అనేది వారికి కలిసిచ్చిన అంశం. ఆర్జీవీకి వీడియో క్యాసెట్స్ షాప్ ఉండటం వలన నిర్మాత సురేంద్ర ఎప్పుడు ఆ స్టూడియోకి వెళ్లి వస్తుండేవాడు. ఆ చనువుతో అక్కినేని వెంకట్ పరిచయమై.. అక్కినేని నాగార్జునని కలిసి కథ చెప్పే అవకాశాన్ని అందిపుచ్చుకుని అతనితో మొత్తానికి సినిమా చేయగలిగే ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా అది యాదృశ్చికం అనే చెప్పాలి. ఆర్జీవీ అడిగిన టెక్నీషియన్స్, నటులను వాళ్లు ఒప్పుకుని ఖర్చు పెట్టడం వల్లే సినిమా అంత బాగా రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు.

ఇళయరాజా సంగీతం

అప్పటికే దక్షిణ భారతదేశ  సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన, విజయవంతమైన సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చడం సినిమాకు అతి పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దింది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. “సరసాలు చాలు శ్రీ వారు వేళ కాదు, ఆనందో బ్రహ్మ, ఎన్నియల్లో మళ్లీయల్లో ఎన్నెన్ని అందాలో” లాంటి రొమాంటిక్ సాంగ్స్ మంచి ఫీల్ క్రియేట్ చేస్తాయి. బోటనీ పాఠముంది పాట నేటికీ.. స్టూడెంట్స్ ఫేవరేట్ పాటే. అంతలా సినిమాకు మ్యూజిక్ సహాయ పడింది. రాం గోపాల్ వర్మకు.. ఇళయరాజా చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు.

అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసి మంచి సాంకేతిక జ్ఞానం, అవగాహన ఉన్న ఎన్. గోపాల్ రెడ్డి కెమెరా బాధ్యత నిర్వర్తించడం సినిమాని ఒక మలుపు తిప్పింది. అప్పటి వరకు లేని డిఫరెంట్ యాంగిల్లో షాట్స్ తీయించాడు వర్మ. ఆర్జీవీ అనుభవం లేకపోయినా స్పష్టత ఉన్న దర్శకుడు కావడంతో సీనియర్ కెమెరామెన్ అయినప్పటికీ రాముకి ఏమి కావాలో అదే తను ఇచ్చాడు. తెలుగు మూవీ టెక్నిషియన్స్, సినిమా ప్రేక్షకులకు తెలియని ఒక కొత్త కెమెరా వర్కింగ్ స్టైల్‌ను వర్మ రుచిచూపించాడు. శివ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా రామ్ గోపాల్ వర్మనే డైరెక్టర్ కావడం గమనార్హం.

అద్భుతమైన నటన.. ఎవరికివారే సాటి!

నటుల విషయానికి వస్తే అందరూ అప్పటివరకు బాగా పాపులారిటీ ఉన్న అమల, రఘవరన్, కోట శ్రీనివాస్ రావు, తనికెళ్ళ భరణి, మురళీ మోహన్, గొల్లపూడి మారుతీరావు, సాయిచంద్ ఉన్నారు. జెడీ చక్రవర్తి, చిన్న, శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రోహిణి, రాం జగన్ లాంటి కొంతమంది కొత్తవాళ్ళు ఈ సినిమాతో పరిచయమయ్యారు. రఘవరన్ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిచ్చాడు. ఇందులో భయంకరంగా కనిపిస్తాడు. నటనలో జీవించాడు. మొదటిసారి ఈ మూవీలో రఘువరన్ ఒరిజినల్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఆ ఫార్ములా సక్సెస్ అయింది. భవాని అనే ఒక మాఫియా డాన్ మాదిరిగా ఇందులో అద్భుతంగా చేశాడు.

తనికెళ్ళ భరణి విలన్‌కు సహాయకుడిగా ప్రత్యేకంగా కనిపించాడు. మురళి మోహన్ హీరో అన్నగా సెంటిమెంట్ బాగా పండించాడు. స్టూడెంట్ మధ్య వైరాన్ని వాడుకునే రాజకీయ నాయకునిగా కొత్త ముఖ కవలికలతో మెప్పించాడు. హీరోగా సినిమాలు చేసిన సాయిచంద్ అప్పటికే సినిమాలు చేయడం నిలిపివేసిన కూడా వర్మ రిక్వెస్ట్‌తో పోలీస్ ఆఫీసర్‌గా శివ సినిమాలో కనిపించారు. గొల్లపూడి ఒకటి రెండు సీన్లే అయినా మెప్పించాడు. నాగార్జున పక్కన స్నేహితులుగా రాం జగన్, చిన్న, శుభలేఖ సుధాకర్ పాత్రలు సినిమా మలుపులు తిరగడానికి కీలకంగా పని చేశాయి. క్యాంటీన్‌లో టీ సర్వ్ చేసే ఉత్తేజ్ బాగా చేశాడు. ఇంకా బ్రహ్మాజీ కూడా ఒక చిన్న విలన్ పాత్రలో కనిపించి అలరిస్తాడు.

జేడి చక్రవర్తికి శివతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు చిన్న పిల్లవాడు అయిన రివర్స్‌లో గడ్డం ట్రిమ్ చేసి ఒక విలన్‌గా చూపించగలగటం జేడికి మంచి భవిష్యత్తుకు బాటలు వేసింది. ఒప్పొసిట్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా మొదటి సినిమాకే మెప్పించాంగలిగాడు. ఆ తరువాత అతను ఒక హీరోగా కూడా సినిమాలు చేశాడు.

కొత్తగా ఏముంటుందంటే?

శివ సినిమా తరువాత సినిమాలు తీసే పద్ధతే మారిపోయింది. ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ చిత్రం. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ ఇలాంటి వారంతా ఈ సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్లుగా.. చేసి తరువాత డైరెక్టర్స్ అయ్యారు. ఎంతోమంది టెక్నిషియన్స్, యాక్టర్స్ శివ పేరు చెప్పుకొని ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు, ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. దాదాపు 36 ఏళ్ళ క్రితం సినిమాకి ఇప్పుడు కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో అని. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి అక్కినేని నాగార్జున, రాం గోపాల్ వర్మ ప్లాన్ చేశారు. పూర్తిగా 4కే క్వాలిటీతో, డాల్భీ సౌండ్‌తో పాత సినిమాని.. కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కాకుండా కొత్తగా ఏమీ ఉండదని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా శివ మూవీని 2025 నవంబర్ 14న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

సౌండ్ చేయని.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చేస్తోంది: లాంచ్ ఎప్పుడంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి తన హవాను కొనసాగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన కంపెనీ.. రెండో మోడల్ ప్లయింగ్ ప్లీ సీ6ను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైకును సంస్థ ఈఐసీఎంఏ 2025 కార్యక్రమంలో ఆవిష్కరించింది. దీనిని సంస్థ 2026లో దేశీయ విఫణిలో లాంచ్ చేస్తుందని సమాచారం.

యూరప్ మార్కెట్లో లాంచ్!

2026లో మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ప్లీ సీ6 అడుగుపెట్టనున్నట్లు.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ. గోవిందరాజన్ పేర్కొన్నారు. కాగా ఈ బైకును మార్కెట్లో లాంచ్ చేసున్నా తరువాత ఎస్6’ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ బైకును ముందు యూరప్ మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. భారతదేశంలో లాంచ్ అవుతుంది.

కంపెనీ లాంచ్ చేయనున్న.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్, సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగా కాకుండా, నగర ప్రయాణానానికి అనుకూలంగా ఉండేలా తయారవుతుంది. ఇది పొడవైన స్టాన్స్, వెడల్పుగా ఉన్న హ్యాండిల్ బార్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది. ఈ బైక్.. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుక 18 ఇంచెస్ వీల్ పొందుతుంది. కాబట్టి రైడింగ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్లయింగ్ ప్లీ సీ6 ఎలక్ట్రిక్ బైకులో.. బ్యాటరీ కేసింగ్ బరువును తగ్గిస్తుంది. డిజైన్ కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గంభీరంగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రం అంత హుందాగా అనిపించడం లేదు. కానీ చూడటానికి ఒక రేసింగ్ బైక్ మాదిరిగా ఉంటుంది. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ సీటు.. రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ పాడ్ పొందుతుంది. ఇది టచ్‌స్క్రీన్ వెర్షన్. ఇంటిగ్రేటెడ్ న్యావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లు, రియల్ టైమ్ వెహికల్ మానిటరింగ్ వంటివన్నీ ఇందులో చూడవచ్చు. అంతే కాకుండా.. ఈ బైకులో ఆఫ్ రోడ్ మోడ్, స్విచబుల్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లీన్ యాంగిల్ సెన్సింగ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు, స్కూటర్లకు డిమాండ్ ఉందన్నమాట నిజమే. కానీ బైకులకు మాత్రం చెప్పుకోదగ్గ డిమాండ్ లేదు. దీనికి కారణం బైక్ అంటే.. సౌండ్ అనే అనాదిగా వస్తున్న భావన అనే చెప్పాలి. ఇక ప్రత్యేకించి రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే.. డుగ్, డుగ్ సౌండ్ ఇష్టపడతారు. ఇది ఎలక్ట్రిక్ రూపంలో వస్తే.. ఆ సౌండ్ వచ్చే అవకాశం లేదు. అయితే అందరూ సౌండ్ ఇష్టపడతారు అని ఖచ్చితంగా చెప్పలేము. సైలెంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడేవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందో.. ఇప్పుడే మనం అంచనా వేయలేము. బహుశా.. గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.